ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అన్నదాతలకు శాపంగా వైఎస్సార్​సీపీ ప్రభుత్వ తీరు - అక్కసుతో మెగా డ్రిప్​ పనుల నిలిపివేత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 8:27 AM IST

Mega Drip Irrigation Works Stopped: రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు రూపొందించిన మెగా డ్రిప్​ ఇరిగేషన్​ పథకానికి జగన్​ మార్క్​ గ్రహణం పట్టింది. గత తెలుగుదేశం ప్రభుత్వం అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన మెగా డ్రిప్‌ ఇరిగేషన్​ పథకాన్ని, అక్కసుతో అధికార వైఎస్సార్​సీపీ ప్రభుత్వం నిలిపివేసింది. 2017 ప్రారంభమైన పనులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో 40 శాతం పూర్తై నిలిచిపోయాయి.

mega_drip_irrigation_works_stopped
mega_drip_irrigation_works_stopped

అన్నదాతలకు శాపంగా వైఎస్సార్​సీపీ ప్రభుత్వ తీరు - అక్కసుతో మెగా డ్రిప్​ పనుల నిలిపివేత

Mega Drip Irrigation Works Stopped: అనంతపురం జిల్లా పేరు చెప్పగానే కరవు కళ్లముందు కదులుతుంది. సాగునీటి కోసం రైతుల పడే కష్టాలు గుర్తుకువస్తాయి. ఏ ప్రభుత్వమైనా దుర్భిక్షాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ జగన్‌ సర్కార్‌ మాత్రం అన్నదాతలు ఏమైపోతే మాకేంటి అనే రీతిలో వ్యవహరిస్తోంది. 50 వేల ఎకరాలకు నీళ్లివ్వాలనే సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన మెగా డ్రిప్ ఇరిగేషన్‌ పథకాన్ని అటకెక్కించింది.

అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద కోట్ల రూపాయల విలువైన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను నిల్వచేశారు. సీఎం జగన్‌ అసమర్థ, కక్షసాధింపు ప్రభుత్వ పనితీరుతో, కరవు నేలలో జలధారలు పారించాల్సిన సామగ్రి నాలుగున్నరేళ్లుగా పనికిరాకుండా పడి ఉంది. దీనివల్ల రైతన్నలు సాగనీటి కష్టాలను ఎదుర్కొంటునే ఉన్నారు.

అనంతపురం జిల్లాలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన ఉరవకొండలో పంటల సాగుకు గత టీడీపీ ప్రభుత్వం మెగా డ్రిప్ పథకాన్ని చేపట్టింది. 13వేల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా దేశంలో తొలిసారిగా సామూహిక డ్రిప్ పథకానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో హంద్రీనీవా నుంచి 1.67 టీఎంసీల నీటిని వినియోగించుకుని, డ్రిప్ ద్వారా 50 వేల ఎకరాలకు అందించే లక్ష్యంతో 842 కోట్లు విడుదల చేసింది.

సుమారు 25వేల ఎకరాలకు సరిపడా డ్రిప్ పరికరాలు పంపులు కొనుగోలు చేశారు. 2017లో పనులు ప్రారంభమై 2019 వరకు 40 శాతం పూర్తయ్యాయి. ఈ లోపు 2019లో సార్వత్రిక ఎన్నికలు రావటం, వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అదికారంలోకి రావడంతో మెగా డ్రిప్ పథకానికి గ్రహణం పట్టింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రమంతటా అన్ని పనులు నిలిచిపోయినట్లుగానే ఉరవకొండలో డ్రిప్ పథకం అటకెక్కింది.

నాలుగున్నరేళ్ల క్రితం నిలిచిపోయిన పనులు ఇప్పటికీ మొదలు కాక రైతుల పొలాల్లో అమర్చిన డ్రిప్ పైపులు దొంగల పాలవుతున్నాయి. కొనుగోలు చేసిన సామగ్రితో 25వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉన్నా వైఎస్సార్​సీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండకు వస్తున్న జగన్‌కు మెగా డ్రిప్ పథకం కోసం వృథాగా పడి ఉన్న పరికరాలు స్వాగతం పలుకుతున్నాయి.

"ఇప్పటికీ దాదాపుగా నాలుగు సంవత్సరాల 8 నెలలు అవుతోంది. ఆ పైపులను రైతులకు ఇచ్చింది లేదు. ఏం చేసింది లేదు. రైతులపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి ఉదాహరణల వల్లే తెలుస్తోంది." -రైతు, ఉరవకొండ

"అధికారంలోకి రాగానే దగ్గరుండి డ్రిప్​ పనులు చేస్తానని జగన్​మోహన్​ రెడ్డి వాగ్దానం చేశారు. జగన్​మోహన్​ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటింది. డ్రిప్​ పనులకు అతీగతి లేదు." -రైతు, ఉరవకొండ

ABOUT THE AUTHOR

...view details