ETV Bharat / bharat

దత్తత తీసుకున్న యువకుడి పెళ్లికి రాజ్​నాథ్​ హాజరు

author img

By

Published : Feb 28, 2021, 9:02 AM IST

Updated : Feb 28, 2021, 9:16 AM IST

కేంద్ర రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ గొప్ప మనసు చాటుకున్నారు. 20ఏళ్ల కిందట తాను దత్తత తీసుకుని చదివించిన ఓ యువకుడి పెళ్లికి హాజరై.. వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం వైద్యుడిగా సేవలందిస్తున్న ఆ యువకుడు.. తన వివాహానికి రాజ్​నాథ్​ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

Rajnath Singh graces wedding ceremony of doctor whose education he had financed
దత్తత తీసుకున్న యువకుడి పెళ్లికి రాజ్​నాథ్​ హాజరు

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ గొప్ప మనసు చాటుకున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఉత్తర్​ ప్రదేశ్​ సీఎంగా ఉన్న సమయంలో దత్తత తీసుకున్న ఓ యువకుడి పెళ్లి ఘనంగా జరిపించారు. పేద విద్యార్థిగా ఉన్న ఆ యువకుడి విద్యాభ్యాసానికి రాజ్​నాథ్​ సహకారం అందించారు. అతడు ప్రస్తుతం వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. అతడి పెళ్లికి కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు రాజ్​నాథ్​ సింగ్​.

సైద్​పుర్​ గ్రామానికి వెళ్లి..

ఉత్తర్​ప్రదేశ్​ జిల్లా మదిరపుర్​కు చెందిన బిజేంద్రకుమార్ 2000 ఏడాదిలో 8వ తరగతి పరీక్షల్లో టాపర్​గా నిలిచాడు. ఆ సమయంలో తండ్రి మరణించడం వల్ల.. అతడి ఉన్నత చదువులకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. అప్పట్లో యూపీ సీఎంగా ఉన్న రాజ్​నాథ్​ సింగ్​కు ఈ విషయం తెలిసింది. వెంటనే స్పందించి బిజేంద్ర కుమార్​ విద్యాభ్యాసానికి సహకరించాడు. అప్పటి నుంచి బిజేంద్రకు అన్ని విధాల అండదండలు అందించారు. జాతీయ రాజకీయాల్లోకి వచ్చినా బిజేంద్ర బాగోగులు పర్యవేక్షించారు రాజ్​నాథ్​. ఆయన సహకారంతోనే బిజేంద్ర ఎంబీబీఎస్​ చదవి వైద్యుడయ్యాడు. బిజేంద్ర వివాహం అని తెలిసి రాజ్​నాథ్​ సింగ్.. ప్రత్యేకంగా యూపీలోని సైద్​పుర్​ గ్రామానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 20 ఏళ్ల తర్వాత.. రాజ్​నాథ్​ సింగ్​ రావడం వల్ల బిజేంద్ర ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్​నాథ్​ సింగ్.. తాను దత్తత తీసుకున్న ఓ పేద పిల్లవాడు ఉన్నత విద్యను అభ్యసించి.. గొప్పస్థాయికి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

"సమర్థులైన ప్రతిఒక్కరూ ఇలాంటి గొప్ప పనులు చేయాలి. నేను యూపీ సీఎంగా ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నాను. వారిలో ప్రభుత్వ వైద్యుడు బిజేంద్ర ఒకరు."

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

'అంతకంటే వ్యంగ్యం మరొకటి ఉండదు'

సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైన్యాన్ని చూసి గర్వపడుతున్నట్లు చెప్పారు రాజ్​నాథ్​. దేశ సైనికుల శౌర్యాన్ని ప్రశ్నించడం కంటే వ్యంగ్యం ఇంకొకటి ఉండదని విపక్షాలనుద్దేశించి మండిపడ్డారు. సరిహద్దులో చైనా తన బలగాలను ఉపసంహరించుకున్నప్పటీ.. ప్రతిపక్షాలు ప్రశ్నించడం దురదృష్టకరమని అన్నారు.

ఇదీ చదవండి: ఒకేసారి 3,229 పెళ్లిళ్లతో ప్రపంచ రికార్డు

Last Updated :Feb 28, 2021, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.