ETV Bharat / international

ఇరాన్​లో భారీ శబ్దంతో పేలుడు- ఎయిర్​ ఢిపెన్స్ అలర్ట్​- ఇజ్రాయెల్​ ప్రతీకార దాడి! - Iran Israel War

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 9:17 AM IST

Updated : Apr 19, 2024, 12:51 PM IST

Iran Israel War
Iran Israel War

Iran Israel War : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్​ ఎయిర్​ డిఫెన్స్​ బ్యాటరీస్​లో భారీ పేలుడు సంభవించింది. కానీ దానికి గల కారణాలను వెల్లడించలేదు. అయితే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Iran Israel War : వారంరోజులక్రితం ఇరాన్‌ జరిపిన దాడులకు బదులు తప్పదన్న ఇజ్రాయెల్‌ అన్నంత పనీ చేసింది. టెహ్రాన్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్‌లో ఈ తెల్లవారుజామున పెద్దఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్లు వార్తలు వెలువడిన కాసేపటికే అమెరికా అధికారి ఒకరు ఇజ్రాయెల్‌ దాడులను ధ్రువీకరించారు. తమదేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ ప్రధాని ఇబ్రహీంరైసీ హెచ్చరించిన మరుసటిరోజే ఇజ్రాయెల్‌ దాడులు చేపట్టింది.

ఇరాన్‌ అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో ఈ ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ముందుజాగ్రత్తగా తమ గగనతలాన్ని మూసివేసిన ఇరాన్‌ వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులు రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.30గంటల నుంచే దుబాయ్‌ కేంద్రంగా నడిచే ఎమిరేట్స్‌, ఫ్లైదుబాయ్‌ విమానాలు పశ్చిమ ఇరాన్‌ నుంచి దారి మళ్లాయి. ఇరాన్‌ గగనతలం మూసివేసినట్లు సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ దాడుల సమయంలో టెహ్రాన్‌, పశ్చిమ, సెంట్రల్‌ రీజియన్‌ ప్రాంతాల్లో వాణిజ్య విమానాలు నిలిపివేశారు. లౌడ్‌ స్పీకర్ల ద్వారా ఈ మేరకు ప్రయాణికులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్న అధికారవర్గాలు ఆ తర్వాత విమాన సేవలను పునరుద్ధరించినట్లు తెలిపాయి

ఇస్ఫాహాన్​ నగరంలో ఇరాన్​ ప్రధాన వైనానిక స్థావరం ఉంది. అలాగే అణు కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. వీటినే ఇజ్రాయెల్​ టార్గెట్​గా చేసుకుని ఉండవచ్చని ఇరాన్​ ప్రభుత్వాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. తాము పలు క్వాడ్​కాప్టర్​ డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్​ సివిలియన్ స్పేస్​ ప్రోగ్రాం ప్రతినిధి హుస్సేన్ దాలిరియన్ తెలిపారు. అయితే ఈ ఘటన ఇస్ఫాహన్​ ప్రాంతంలోనా, లేదా మరొక చోట జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇరాన్​ ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది. వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఇక ఇస్ఫాహాన్​లో ఉన్న అణు కేంద్రంపై ఎలాంటి దాడి జరగలేదని, అది సురక్షితంగా ఉందని ఇరాన్‌ మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్‌ అణు కేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఐరాస న్యూక్లియర్‌ వాచ్‌డాగ్‌, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ-IAEA కూడా ధ్రువీకరించింది.

ప్రస్తుతానికి ఏం చెప్పలేం : ఇజ్రాయెల్
అయితే ఇరాన్‌లో పేలుళ్లు ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులేనని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. కానీ, దీనిపై స్పందించేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం నిరాకరించింది. 'ప్రస్తుతానికి మేం ఏం మాట్లాడలేం' అని పేర్కొనడం గమనార్హం. మరోవైపు, ఈ దాడులకు కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్‌, అమెరికా రక్షణ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పెంటగాన్‌ వెల్లడించింది. అయితే, అందులో ఈ దాడి ప్రణాళికల గురించి ఇజ్రాయెల్‌ ప్రస్తావించలేదని తెలిపింది. కానీ, రానున్న 24-48 గంటల మధ్యలో ఇరాన్‌పై దాడి చేస్తామని మాత్రం సూచనప్రాయంగా అగ్రరాజ్యానికి చెప్పినట్లు తెలుస్తోంది.

ఇరాన్​-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం! కారణమిదే!
సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడిలో రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన ఏడుగురు సైనికాధికారులు మృతి చెందారు. అవి ఇజ్రాయెల్‌ దాడులుగా భావించిన టెహ్రాన్‌ గత శనివారం 170డ్రోన్లు, 30కి పైగా క్రూజ్‌, 120కి పైగా బాలిస్టిక్‌ క్షిపణులతో ప్రతీకారదాడులు చేపట్టింది. 'ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌' పేరుతో డ్రోన్లను ప్రయోగించింది. ఆ తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ ఇరాక్‌ గగనతలం మీదుగా వస్తున్న డ్రోన్లను బహుళ అంచెల రక్షణ వ్యవస్థతో కూల్చివేసింది. క్రూజ్‌ క్షిపణులనూ విజయవంతంగా అడ్డుకుంది.

ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌లో ఇరాన్‌తోపాటు లెబనాన్‌, సిరియా, ఇరాక్‌లోని మిలిటెంట్‌ సంస్థలూ పాల్గొన్నాయి. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపించగా వాటిని అమెరికా సహకారంతో నెతన్యాహు సేనలు సమర్థంగా తిప్పికొట్టాయి. అప్పట్నుంచి ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా సహా ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశాయి. టెల్‌ అవీవ్‌ మాత్రం అమెరికా సహా ప్రపంచదేశాల విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తెల్లవారుజామున ప్రతీకారదాడులు చేపట్టింది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇరాన్​పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
మరోవైపు ఇరాన్‌పై గురువారం అమెరికా, బ్రిటన్‌ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. టెహ్రాన్‌ డ్రోన్‌, క్షిపణి సాంకేతికతను పరిమితం చేసే దిశగా ఈ ఆంక్షలను విధించడం గమనార్హం. డ్రోన్లకు ఇంజిన్లు తయారు చేసే 16మంది వ్యక్తులను, రెండు సంస్థలను అమెరికా ఆర్థికశాఖలోని విదేశీ ఆస్తుల నియంత్రణ విభాగం ఆంక్షల పరిధిలోకి తెచ్చింది. బ్రిటన్‌ కూడా డ్రోన్‌, బాలిస్టిక్‌ క్షిపణులు తయారు చేసే సంస్థలు, వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుంది. "ఇరాన్‌ చర్యలను కట్టడి చేయడానికి రానున్న రోజుల్లో మరిన్ని ఆంక్షలు విధిస్తాం" అని అమెరికా ఆర్థికమంత్రి జానెట్‌ యెలెన్‌ పేర్కొన్నారు.

Last Updated :Apr 19, 2024, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.