ETV Bharat / international

చైనీయులే టార్గెట్​గా పాక్​లో ఉగ్రదాడి! ఆరుగురు మృతి - Chinese Workers Killed In Pakistan

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 5:14 PM IST

Updated : Mar 26, 2024, 5:52 PM IST

Chinese Workers Killed
Chinese Workers Killed

Chinese Workers Killed In Pakistan : పాకిస్థాన్​లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనీయులు సహా ఆరుగురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Chinese Workers Killed In Pakistan : పాకిస్థాన్​లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనా దేశస్థులు సహా ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇస్లామాబాద్​ నుంచి కోహిస్థాన్ వెళ్తున్నపేలుడు పదార్థాలతో నిండిన వాహనం, ​షాంగ్లా జిల్లాలోని బిషామ్​ ప్రాంతంలో ఓ బస్సును ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో బస్సులో ఉన్న చైనీయులతో పాటు డ్రైవర్​ ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ దాడికి ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. అయితే ఇది ఆత్మాహుతి దాడిగా పోలీసులు చెప్పినట్లు పాకిస్థాన్​ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ పేలుడుపై సమాచారం అందుకున్న అధికారులు, ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి పంపించారు. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ పేలుడులో మరిణించిన చైనీయులు డాసు జలవిద్యుత్​ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. చైనా-పాకిస్థాన్​ ఎకనామిక్​ కారిడార్​లో భాగంగా చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో వేలాది మంది చైనా సిబ్బంది పాకిస్థాన్​లో పని చేస్తున్నారు.

'చైనా ఎంబసీకి హోం మంత్రి పరుగులు'
ఈ విషయం తెలిసిన వెంటనే చైనా రాయబార కార్యలయానికి పాకిస్థాన్​ హోం మంత్రి మోషిన్ నఖ్వీ పరుగులు తీశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ దాడికి కారణమైన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని చైనా అధికారులకు హామీ ఇచ్చారు.

'పాక్​-చైనా స్నేహాన్ని దెబ్బతీయలేరు'
ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ. చైనీయుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాక్​-చైనా స్నేహాన్ని దెబ్బతీయడంలో పాక్​ వ్యతిరేక శక్తులు ఎప్పుడూ విజయం సాధించలేవని పేర్కొన్నారు.

పాక్​ ఎయిర్​స్టేషన్​పై దాడి​
పాకిస్థాన్‌లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్‌స్టేషన్‌ పీఎన్‌ఎస్‌ సిద్ధిఖ్‌పై సోమవారం రాత్రి దాడి జరిగింది. బలూచిస్థాన్‌లో ఉన్న ఈ స్థావరంపై కొంతమంది తిరుగుబాటుదారులు తుపాకులు, బాంబులతో విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. నలుగురు తీవ్రవాదులను హతమార్చారు. వారు లోపలికి ప్రవేశిస్తుండగానే గుర్తించి మట్టుబెట్టామని అక్కడి అధికారులు తెలిపారు. ఎయిర్‌స్టేషన్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. ఈ స్థావరంలో చైనాకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించినట్లు తెలుస్తోంది.

నౌక ఢీకొని పేక మేడలా కూలిన బ్రిడ్జి- నదిలో పడిన వాహనాలు- వీడియో వైరల్ - Bridge Collapse In america

'గాజాలో తక్షణమే కాల్పుల విరమణ'- ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ఆమోదం - Gaza Ceasefire Un Security Council

Last Updated :Mar 26, 2024, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.