ETV Bharat / bharat

'ఎన్నికల ప్రక్రియకు అవరోధాలు కలిగిస్తారా?'- ఖర్గేపై ఈసీ తీవ్ర ఆగ్రహం - Lok sabha election 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 4:14 PM IST

Updated : May 10, 2024, 5:04 PM IST

Lok Sabha Election 2024
Lok Sabha Election 2024 (ANI)

Lok Sabha Election 2024 : కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటింగ్​ శాతం ప్రకటన ఆలస్యం, నిర్వహణ లోపంపై ఖర్గే చేసిన ఆరోపణలు ఈసీ ఖండించింది. ఓటింగ్

Lok Sabha Election 2024 : పోలింగ్ శాతం వివరాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విపక్షాలకు లేఖ రాసిన కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఎన్నికల సంఘం. వివరణ కోరే ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహించింది. ఈ లేఖ ఓటర్లు, రాజకీయ పార్టీల మనసుల్లో అనేక సందేహాలను సృష్టిస్తుందని అభ్యంతరం తెలిపింది. ఓటింగ్​ శాతం ప్రకటన ఆలస్యం, నిర్వహణ లోపంపై ఖర్గే చేసిన ఆరోపణలు ఈసీ ఖండించింది. ఓటింగ్​ డేటా విషయంలో ఎలాంటి తప్పులు జరగలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల రోజు చెప్పిన ఓటింగ్ శాతం కంటే తర్వాత ప్రకటించిన డేటా అధికంగానే ఉందని తెలిపింది.

"ఓటింగ్​ శాతంపై ఖర్గే చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. లోక్​సభ ఎన్నికల మధ్యలో గందరగోళం సృష్టించేలా ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగకుండా అవరోధాలు కల్పించేలా కనిపిస్తున్నాయి. ఇది ఓటర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఓటింగ్​లో పాల్గొనకుండా ఓటర్లను బలహీన పరుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికల యంత్రాంగాన్ని నిరుత్సాహ పరుస్తుంది" అని ఈసీ పేర్కొంది.

విపక్షాలకు ఖర్గే లేఖ
అంతకుముందు మే 7న సార్వత్రిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన పోలింగ్‌ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆ వైరుద్ధ్యాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని అందులో పిలుపునిచ్చారు. ఈసీ పూర్తి స్వతంత్రత, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడటం అత్యావశ్యకమని తెలిపారు.

ఓటింగ్ శాతం వెల్లడిపై సుప్రీంలో పిటిషన్​
మరోవైపు ఎన్నికల ముగిసిన 48 గంటల్లోగా ఓటింగ్​ శాతాన్ని ప్రకటించాలంటూ అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రీఫార్మ్స్​ అనే ఓ ఎన్​జీఓ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రతి పోలింగ్ స్టేషన్​ పోలింగ్​ శాతాన్ని ఈసీ వెబ్​సైట్​లో పెట్టాలంటూ 2019 నాటి పిల్​లో మధ్యంతర పిటిషన్​ను దాఖలు చేసింది. 17C పార్ట్​ 1లో నమోదైన ఓట్ల సంఖ్యను పోలింగ్ స్టేషన్ ప్రకారం వెబ్​సైట్​లో పొందుపరిచేలా ఆదేశించాలని సుప్రీంను కోరింది. ఏప్రిల్​ 30 నాటి ఈసీ ప్రకటనకు తుది ఓటింగ్​ శాతానికి 5శాతం తేడాలు ఉండడం వల్ల ప్రజల్లో అనుమానాలు తలెత్తాయని పిటిషన్​లో పేర్కొంది.

ఎన్నికలపై మోదీ, రాహుల్​ లైవ్​ డిబేట్​! అగ్రనేతలకు ప్రముఖుల లేఖ - PM Modi Rahul Gandhi Live Debate

'కాంగ్రెస్​లో చేరి నిర్వీర్యమయ్యే బదులు NDAతో కలవండి'- పవార్​, ఠాక్రేకు మోదీ ఓపెన్ ఆఫర్! - PM Modi Offer To Sharad Pawar

Last Updated :May 10, 2024, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.