Tension at Huts Removal : గుడిసెల తొలగింపుతో ఉద్రిక్తత..పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Tension at Govt Land Huts Removal in Mahabubabad : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది... పోలీసుల సహకారంతో తొలగించారు. గుడిసెలను తొలగించవద్దంటూ అధికారులతో బాధితులు వాగ్వాదానికి దిగి అడ్డుకోవడంతో కాసేపు తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ వేణుగోపాల్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అడ్డుకున్న పోలీసులు అతణ్ని పీఎస్కు తరలించారు. అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ... పెద్ద సంఖ్యలో స్థానికులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. వివాదం ముదురుతుండడంతో పోలీసులు కలగజేసుకుని ఆందోళనను ఆపే ప్రయత్నం చేశారు. గుడిసెవాసులు ఎంతకీ వినకపోవడంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి డీసీఎంలలో పోలీస్ స్టేషన్కు తరలించారు.