Prof Kodandaram fires on KCR : ప్రజాసంక్షేమంపై చిన్నచూపు.. ఆస్తుల సంపాదనపై పెద్దచూపు
Published: May 18, 2023, 8:18 PM

Prof Kodandaram fires on KCR : రైతురాజ్యం కావాలని కేసీఆర్ చెప్పటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలకు సేవ చేయడం మరిచిపోయి.. ఆస్తులను కూడబెట్టడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. ఎందరో అమరవీరులు, ప్రజలందరి సమష్టి పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. వారి సంక్షేమం గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భారీగా అవినీతి చోటుచేసుకుందని దుయ్యబట్టారు.
ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల సంక్షేమం కోసం పనిచేయడం లేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లు న్యాయమైనవని.. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సకల జనులందరూ సర్కార్కు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జూన్ 4న సూర్యాపేటలో నిర్వహించే తెలంగాణ జన సమితి 3వ ప్లీనరీ సమావేశానికి సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను పార్టీ నాయకులతో కలిసి కోదండరాం ఆవిష్కరించారు. ప్లీనరీకి పార్టీ కార్యకర్తలు పెద్ధ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.