కేంద్రం పాలసీ వల్లే హైదరాబాద్కు మంచి కంపెనీలు : నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman Election Campaign In Hyderabad : తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని విపక్షనేతలు కొనియాడుతున్నారని తెలిపారు. తెలంగాణలోనూ అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్లో ఏర్పాటు చేసిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా నిర్మలమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీపక్ రెడ్డి గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Nirmala Sitharaman Comments On BRS Govt : కేంద్ర ప్రభుత్వం పాలసీ వల్లే హైదరాబాద్కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ధనిక తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. పెట్రోల్ మీద వ్యాట్ వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. కేంద్రం కాదని స్పష్టం చేశారు. పేరులో తెలంగాణ తీసేసి తెలంగాణ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమని.. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.