Maize Farmer loss in Rains : 'వరి ధాన్యం లాగే ప్రభుత్వం మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి'
Published: May 14, 2023, 2:14 PM

Crop loss compensation in Telangana : వరంగల్ జిల్లాలో పంటల నమోదు రైతులకు తల నొప్పిగా మారింది. అమ్మకానికి తెచ్చిన పంట అధికారుల నిరాదరణకు గురికావడం కష్టాలకు కారణమవుతోంది. రాయపర్తి మండలం పెర్కవీడులో అన్నదాతలు పండిచిన పంట నమోదు చేసుకోకపోవడంతో.. ఆరుగాలం కష్టపడి పండించిన మక్కలు అమ్ముకోలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. దీంతో కోళ్ల ఫారాలు, దళారులకు విక్రయిస్తూ కర్షకులు ప్రభుత్వ మద్దతు ధరను కోల్పోతున్నారు. ప్రభుత్వ గిట్టుబాటు ధర రూ.1960 కాగా.. దళారులు రూ.1600 నుంచి రూ.1700 అడుగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం లాగే మొక్కజొన్నలను సైతం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
"ఇన్ని రోజుల వరి ధాన్యం తడిచిపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మొక్కజొన్నలను ఎండబెట్టి అమ్మాలంటే చాలా కష్టంగా ఉంది. వరి రైతులకు చేసిన న్యాయమే మొక్కజొన్న రైతులకు చేయాలి. తడిసిన మక్కలు అధికారులు కొనుగోలు చేయలేమంటున్నారు. మరి మేము వీటిని ఏం చేయాలి. ఈ క్రమంలోనే ప్రైవేట్ వ్యక్తులకు చాలా తక్కువ ధరకే అమ్ముకుంటున్నాం."- మహిళా రైతు