MLA Veeraiah on Seethammasagar Works : 'పనులు ఆపకుంటే యంత్రాలు తగులబెడతాం'
Published: May 23, 2023, 4:24 PM

MLA Veeraiah on Seethamma Sagar Project Works : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు ఆపకుంటే ఊరుకోబోమని.. యంత్రాలు తగుల బెడతామని భద్రాచలం కాంగ్రెస్ శాసనసభ్యులు పొదెం వీరయ్య హెచ్చరించారు. ఈ మేరకు సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ పనులు నిర్వహిస్తోన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే.. వారిపై తీవ్రంగా మండిపడ్డారు. పర్యటనలో భాగంగా చర్ల మండలం కొత్తపల్లికి వెళ్లిన ఎమ్మెల్యే.. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సిబ్బందితో వివాదానికి దిగారు. కొరెగడ్డ నిర్వాసితులకు పరిహారం ఇచ్చే వరకు పనులు చేయొద్దని ఆయన డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులను ఆపాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. వాటిని కూడా లెక్క చేయకుండా పనులు చేయడం ఏంటని అక్కడి అధికారులను ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల అండ దండలతో పనులు చేస్తున్నారని ఆరోపించారు. తమకు పరిహారం అందలేదని ఒకవైపు రైతులు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తుంటే.. వారికి పరిహారం చెల్లించకుండా పనులు చేయడం సరికాదన్నారు. పనులు కొనసాగిస్తే ఊరుకోమని హెచ్చరించారు.