విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందాలా? ఇవి తినండి!

author img

By

Published : Sep 18, 2022, 10:06 AM IST

healthy diet plan indian

Healthy diet plan Indian : ఆకాశంలో చందమామనో, పెరట్లో లేగదూడనో చూపిస్తూ.. లేదంటే ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ.. 'ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద..' అంటూ చిట్టి బొజ్జ నిండేలా గోరుముద్దలు తినిపించడం ఒకప్పటి మాట. టీవీ చూస్తూనో, ఫోను చూపిస్తూనో అన్నం పెట్టామనిపించడం ఇప్పటి మాట. మన జీవనశైలిలోనే కాదు, తినే తిండిలోనూ మార్పులొచ్చేశాయి. అవసరాన్ని మించి ఇష్టాయిష్టాలదే పైచేయి అవుతోంది. ఫలితంగా ఐదేళ్లలోపు పిల్లల్లో 67 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. పెద్దలూ అందుకు మినహాయింపు కాదు. విటమిన్లూ ఖనిజాల లోపాలు అన్నివయసులవారినీ పట్టిపీడిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలో సెప్టెంబరును 'పోషణ మాసం'గా నిర్వహిస్తోంది ప్రభుత్వం.

పిల్లలు.. ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ ఎదగాలి.
యువతీయువకులు.. కొండలనైనా పిండి చేయగల శక్తి సామర్థ్యాలతో చదువుల్లో వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా రాణించాలి.
మధ్యవయస్కులు.. ఆరోగ్యంగా ఆనందంగా ఇంటాబయటా తమ బాధ్యతలను నిర్వర్తించాలి.
వృద్ధులు.. ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడపాలి.

అప్పుడే కదా కుటుంబమైనా, సమాజమైనా అభివృద్ధి పథంలో నడిచేది. అలా కాకుండా, వయసుతో నిమిత్తం లేకుండా.. మనుషులంతా ఈసురోమంటూ ఉంటే.. ఎవరూ ఏమీ సాధించలేరు. అనారోగ్యాలు పట్టిపీడిస్తాయి. సమాజం అతలాకుతలమవుతుంది. దేశం ఆర్థికంగా చతికిలబడుతుంది.

Health food tips in Telugu : ఆ పరిస్థితి రాకూడదనే ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య పరిస్థితులపై పరిశీలనలు జరిపి తగిన చర్యలు తీసుకుంటాయి ప్రభుత్వాలు. ఇటీవల వెలువడిన అలాంటి పరిశీలనల్లో మన దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రేపటి పౌరులైన పిల్లల్లో మూడొంతుల మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నారంటే- అదీ ధాన్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే తొలి వరుసలో నిలుస్తూ అన్నపూర్ణగా పేరొందిన ఈ దేశంలో- చాలా విచారించాల్సిన విషయం. నిజానికి తల్లిపాలతో 60 శాతం మేర పిల్లల ఎదుగుదల లోపాల్ని చక్కదిద్దవచ్చు. కానీ తల్లుల్నే రక్తహీనత పీడిస్తుంటే ఇక పిల్లలకి పోషకాహారం ఎలా అందుతుందీ.. ఐదేళ్ల లోపు అర్థాంతరంగా చనిపోతున్న బిడ్డల్లో 68 శాతం మరణాలకు పౌష్టికాహార లోపాలే కారణం అంటున్నాయి అధ్యయనాలు. అందుకు కారణం- సమతులాహారం మీద అవగాహన లేక పోవడమే. పిల్లలే కాదు, యాభై ఏళ్లలోపు స్త్రీలలో సగానికి పైగా, పురుషుల్లో నాలుగో వంతూ రక్తహీనతతో బాధపడుతున్నారట.

.

మారిన ఆహారపుటలవాట్లు
తరచుగా తలనొప్పి వస్తోంటే పని ఒత్తిడనుకుంటాం. కాఫీనో టీనో తాగితే తగ్గిపోతుందని గంటకోసారి టీ తాగడం అలవాటు చేసుకుంటాం. కళ్లు తిరిగినట్లుంటే బీపీ తగ్గి ఉంటుందని సర్దిచెప్పుకుంటాం. కానీ ఏ సమస్యకూ మనం తీసుకునే ఆహారంలో లోపాలేమన్నా కారణం ఏమోనన్న ఆలోచనే రాదు. పెద్దలే కాదు, పిల్లలూ అంతే. ఆకలి వేస్తే ఒక చాక్లెట్టో చిప్స్‌ ప్యాకెట్టో కావాలంటారు. కానీ ఇంట్లో చేసి పెట్టే టిఫిన్లను మెచ్చరు. సున్నుండలూ చేగోడీలూ లాంటి చిరుతిళ్లను నచ్చరు. పొద్దున్నే ఇడ్లీనో దోసెనో తినమంటే విసుక్కునే పిల్లల్నీ, సాయంత్రం రాగానే పాలూ పండూ వద్దు నూడుల్స్‌ కావాలని మారాం చేసే పిల్లల్నీ చూస్తూనే ఉంటాం. ఏదో ఒకటి తింటే చాలనుకుని పిల్లలకు నచ్చింది వండిపెట్టడానికే మొగ్గుచూపుతున్నారు తల్లులు. కానీ టీతో అయినా చాక్లెట్లతో అయినా కడుపు నిండదు, శరీరానికి కావలసిన పోషకాలు అందవు. బీరకాయ, సొరకాయ, క్యాబేజీలాంటి దాదాపు సగం రకాల కూరగాయల్ని ఇప్పటి పిల్లలు అసలు తినడం లేదంటున్నారు డాక్టర్లు. ఆహారంలో వైవిధ్యం పాటిస్తేనే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలూ అందుతాయి. అందుకే పండ్లూ కూరగాయలూ అన్నీ కలిపి రోజూ కనీసం ఐదు రంగుల ఆహార పదార్థాలను తీసుకోవాలంటారు.

ఆహారానికేం, మూడు పూటలా బాగానే తింటున్నాను కదా.. అంటుంటారు చాలామంది. బాగా తినడం కాదు, అవసరమైనవి అన్నీ అందులో ఉండాలి. మన శరీరానికి విటమిన్లూ ఖనిజాలూ అనే సూక్ష్మపోషకాలు చాలా అవసరం. తక్కువ మొత్తంలోనే కానీ తప్పనిసరిగా అవసరం కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి ఏమాత్రం లోపించినా శరీరంలోని భిన్న అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ముఖ్యంగా రక్తహీనతకు దారితీస్తుంది.
ఆ అవగాహన లేకపోవడమూ, ముఖ్యంగా మహిళలు ఇంటిల్లిపాది గురించీ పట్టించుకుని తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమూ ఎక్కువగా జరుగుతోంది అంటున్నారు నిపుణులు.

.

పెద్ద సమస్య
పిల్లలకు మార్కులు తక్కువొస్తే బాగా చదవడం లేదని కోప్పడతారు. ట్యూషన్లు పెట్టిస్తారు. దానికన్నా ముందు చేయాల్సింది వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందో గమనించడం- అంటున్నారు డాక్టర్లు. ఎదిగే వయసులో వారికి సరైన పోషకాలు అందకపోతే చదువు మీద ఏకాగ్రత ఉండదు, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, ఊరికే అలసిపోతారు. వయసుకు తగ్గ బరువూ ఎత్తూ లేకపోయినా, చదువులో ఆటల్లో చురుగ్గా లేకపోయినా పిల్లలకు వైద్య పరీక్షలు చేయించాలి. రక్తహీనతలాంటి సమస్యలేవీ లేవని నిర్ధారించుకున్నాకే మిగిలిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలైనా అంతే. తలనొప్పీ నీరసం తరచూ వేధిస్తుంటే కారణమేంటో తెలుసుకోవటానికి ముందు రక్తపరీక్ష చేయించుకోవాలంటున్నారు వైద్యులు.

శరీరంలో ఎర్ర రక్తకణాలు లేదా హీమోగ్లోబిన్‌ స్థాయి సాధారణ స్థితి కన్నా తక్కువగా ఉండటాన్ని రక్తహీనత (ఎనీమియా)గా పరిగణిస్తారు. ఎర్ర రక్తకణాలు లోపిస్తే అవయవాలకి తగినంత ఆక్సిజన్‌ అందదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. శారీరకంగా బలహీనంగా ఉంటారు. చర్మం పాలి పోయినట్లై, తరచూ తలనొప్పి వస్తుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే గుండెకూ హాని కలుగుతుంది. గర్భిణుల్లో తీవ్ర రక్తహీనత కాన్పు సమయంలో ప్రాణాలకే ముప్పు తెస్తుంది.
సాధారణంగా ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, బీ12 విటమిన్‌ లోపాలు రక్తహీనతకు కారణమవుతాయి. సికిల్‌సెల్‌ ఎనీమియా, థలసీమియా లాంటి జన్యుపరమైన లోపాలు, దీర్ఘకాలిక మలేరియా లాంటివీ కూడా రక్తహీనతకు దారితీస్తాయి .

Vitamins and Minerals in food : ఈ రక్తహీనతను నివారించడానికి దాదాపు యాభై ఏళ్లుగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. గర్భిణులకు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రల ద్వారా, అదనపు పోషకాహార సరఫరా ద్వారా కాన్పు సమయంలో తల్లీబిడ్డల మరణాలను గణనీయంగా తగ్గించగలిగింది. అయితే ఇప్పుడది అందరి సమస్యగా మారి తెర మీదికి వచ్చింది. ఈ రక్తహీనతనీ, పోషకాహార లోపాన్నీ అధిగమించాలంటే విటమిన్లూ ఖనిజాలూ తగుపాళ్లలో తీసుకోవడం చాలా అవసరం. ఆ విటమిన్లు ఏవీ.. ఎందులో ఉంటాయీ అంటే..

.

విటమిన్‌ ఎ
Vitamin A foods in Telugu : సాధారణంగా కంటిచూపు కోసమే విటమిన్‌- ఎ అనుకుంటారు కానీ వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం దీనికి ఉంది. కణాలను వృద్ధి చేసే ఈ విటమిన్‌ గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు లాంటి కీలకావయవాలు సరిగా పనిచేసేలా చూస్తుంది. ఎదుగుదలకీ, గాయాలు మానడానికీ తోడ్పడుతుంది. రోగనిరోధక వ్యవస్థలో భాగమైన తెల్లరక్తకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మకణాలు దెబ్బతినకుండా చూస్తూ సూక్ష్మక్రిములను శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లూ జలుబూ ఫ్లూ జ్వరాల్లాంటివి రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌ కూడా అయిన ఈ విటమిన్‌ బొప్పాయి, మామిడి, పాలకూర, క్యారట్లు, చేపలు, గుడ్లు లాంటి వాటిల్లో దొరుకుతుంది. విటమిన్‌ 'ఎ' లాంటిదే ప్రొ విటమిన్‌గా పేర్కొనే బీటా కెరొటిన్‌. ఇది చిలకడ దుంప, క్యారట్లు, పాలకూరల్లో పుష్కలంగా లభిస్తుంది.

విటమిన్‌ బి
Vitamin B foods list in Telugu : పది పన్నెండేళ్ల పిల్లలకు కూడా ఈ మధ్య విటమిన్‌ 'బి12' లోపం ఎక్కువగా ఉంటోంది. రక్తహీనతలో కన్పించే ప్రధాన లక్షణాలన్నీ ఈ విటమిన్‌ లోపం వల్ల వచ్చేవే. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, బయోటిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ లాంటి బీ కాంప్లెక్స్‌ విటమిన్లలో ముఖ్యమైంది బి12. ఇది లేకపోతే ఎర్రరక్తకణాలు సరిగా పనిచేయవు. దాంతో ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం తగ్గిపోతుంది. శరీరానికి శక్తినిచ్చే ఈ విటమిన్‌ ఆహారంలో మాంసకృత్తులు జీర్ణమవడానికీ తెల్ల రక్తకణాలు వృద్ధిచెందడానికీ తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని ఎప్పటికప్పుడు ఉత్తేజితం చేస్తూ బాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనేలా చూస్తుంది. గుడ్లు, చేపలు, మాంసం లాంటి వాటిల్లో ఎక్కువగా ఉండే ఈ విటమిన్‌ అవి తినని వారిలో అధికంగా లోపిస్తుంది.

విటమిన్‌ సి
Vitamin C foods in Telugu : తెల్లరక్తకణాల ఉత్పత్తినీ పనితీరునీ ఎంతో మెరుగుపరిచే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌- 'సి' విటమిన్‌. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలర్జీలనూ ఇన్‌ఫెక్షన్లనూ నివారిస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది- దీన్ని శరీరం నిల్వ చేసుకోలేదు. కాబట్టి రోజూ ఆహారంలో తగినంత తీసుకోక తప్పదు. నిమ్మ, బత్తాయి, నారింజ, ఉసిరి, స్ట్రాబెర్రీ, జామ, బొప్పాయి, క్యాబేజీ, పచ్చిమిర్చి, బంగాళాదుంప, బ్రకోలి, కొత్తిమీరలాంటి వాటిల్లో ఈ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. 'సి' విటమిన్‌ నిమ్మజాతి పండ్లలోనే ఉంటుందని చాలామందికి అపోహ. నిజానికి వందగ్రాముల నిమ్మ పండు కన్నా జామపండులో మూడురెట్లు, కొత్తిమీరలో రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందిది. నిమ్మలో బొప్పాయిలో దాదాపు సమానంగా ఉంటుంది.

విటమిన్‌ డి
Vitamin D foods in Telugu list : చిన్నపనికే అలసిపోవడం, మెట్లెక్కినా దిగినా కండరాల నొప్పులు, తరచూ జ్వరం జలుబూ లాంటి అనారోగ్యాలూ ఇబ్బంది పెడుతున్నట్లయితే చాలినంత 'డి' విటమిన్‌ లభించడం లేదని అర్థం. సూర్యరశ్మి నుంచి సహజంగా లభించే ఈ విటమిన్‌ కూడా లోపించడానికి కారణం- ఎండపొడ పడకుండా సాగిపోతున్న మన జీవనశైలే. ఆహారం నుంచి కాల్షియం, ఫాస్పరస్‌లను శరీరం గ్రహించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ రెండూ ఎముకల తయారీకీ, బలానికీ అత్యంత అవసరమైన మూలకాలు. 'డి' విటమిన్‌- క్యాన్సర్‌ కణాల పెరుగుదలని అడ్డుకుంటుందనీ, ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుందనీ పరిశోధనలు చెబుతున్నాయి. రోగకారక క్రిములతో పోరాడే టి-కణాలూ రోగనిరోధక కణాల పనితీరునూ ఇది మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికీ ఉపయోగపడుతుంది.

ఇది లోపిస్తే చిన్నారుల్లో రికెట్స్‌తో పాటు శ్వాసకోశ సంబంధ సమస్యలూ వస్తాయి. స్త్రీలలో ఆస్టియో పోరొసిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భిణుల్లో ఈ విటమిన్‌ లోపిస్తే పాపాయి తక్కువ బరువుతో పుట్టవచ్చు, ఎదుగుదల లోపాలు ఉండవచ్చు.
ఈ విటమిన్‌ని సహజంగా పొందాలంటే రోజూ కాసేపు ఎండలో నిలబడాలి. ఆహారపదార్థాల విషయానికి వస్తే- చేపలు, కాడ్‌లివర్‌ ఆయిల్‌, గుడ్డు పచ్చసొన, లివర్‌, చికెన్‌, పుట్ట గొడుగులు, పాలు, పాల ఉత్పత్తులు, ఫోర్టిఫైడ్‌ నూనెలు, చిరు ధాన్యాలు, పప్పులు, సోయా, నువ్వులు లాంటి వాటిల్లో ఉంటుంది.

.

విటమిన్‌ ఇ, కె
Vitamin E foods in Telugu : మిగిలిన విటమిన్లంత ఎక్కువగా వీటి గురించి మాట్లాడరు కానీ నిజానికి 'ఇ', 'కె' విటమిన్లు కూడా ముఖ్యమైనవే.
ఆహార పదార్థాల ద్వారా లభించే విటమిన్‌ 'ఇ' శరీరంలోని సహజ వ్యాధి నిరోధక శక్తికి అండగా నిలుస్తుంది. ఒకవైపు ప్రత్యక్షంగా టీ-కణాల సామర్థ్యాన్నీ, కణవిభజననూ పెంచుతూనే మరోవైపు పరోక్షంగా ఇన్‌ఫ్లమేషన్‌కు సహకరించే కారకాలను అడ్డుకుంటుంది. ఇది లోపించినా శ్వాసకోశ సమస్యలూ అలర్జీలూ పెరుగుతాయి. పద్నాలుగేళ్లు పైబడ్డ వారందరికీ ఇది అవసరం. పొద్దు తిరుగుడు గింజల నూనె, గుమ్మడి గింజలు, సోయాబీన్‌ నూనె, బాదం, వేరుశనగలాంటి గింజపప్పుల్లో, పాలకూరలో ఇది లభిస్తుంది.
Vitamin K foods in Telugu : శరీరంలో అనవసర కణాలను తొలగించి కొత్త కణాలను తయారుచేసే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది 'కె' విటమిన్‌. ఈ పనులు రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తాయి. తాజా ఆకుకూరలూ గుడ్లు వంటివాటిల్లో ఇది లభిస్తుంది.

ఖనిజాలూ ముఖ్యమే..!
Essential minerals in food chart : విటమిన్లతో పాటూ పట్టించుకోవాల్సిన మరో కీలకమైన పోషకాలు- ఇనుము, జింక్‌ లాంటి మినరల్స్‌. రక్తహీనత సమస్యకు ప్రధాన కారణం ఇనుము లోపించడం. ఇది రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయడానికి తోడ్పడుతుంది. శరీరంలో ఎక్కడైనా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినప్పుడు లింఫ్‌ కణాలు అక్కడికి చేరుకుని రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. అవి అలా పనిచేసేందుకు ఐరన్‌ కావాలి. మాంసం, చికెన్‌, పప్పులతో పాటు పాలకూర, తోటకూరలాంటి ఆకుకూరల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది.
ఇక, కణాల్లో జరిగే చాలా పనులకు జింక్‌ అవసరమవుతుంది. దెబ్బతిన్న రోగనిరోధకవ్యవస్థ కోలుకోవడానికి తోడ్పడుతుంది. గింజధాన్యాలు, మాంసం, పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్‌ తదితర పదార్థాల్లో ఇది లభిస్తుంది.

ఇవీ అవసరమే!
Healthy diet chart for Indian : మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలూ కొవ్వు పదార్థాలూ ఎక్కువగా ఉంటున్నాయి కానీ చాలామంది విటమిన్లతో పాటు మాంసకృత్తుల్నీ నిర్లక్ష్యం చేస్తున్నారు. దేశంలో దాదాపు 90 శాతం చాలినంత ప్రోటీన్లు తీసుకోవడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల మధుమేహం పెరుగుతోందని గుర్తించిన నిపుణులు ఆహారంలో పిండిపదార్థాలను 55 శాతం, కొవ్వు పదార్థాలను 25 శాతానికీ పరిమితం చేసుకుని 20 శాతం దాకా ప్రొటీన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రొటీన్లు కణాలను మరమ్మతు చేస్తాయి. అప్పుడే రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. యాంటీ బాడీలూ, రోగనిరోధక కణాలూ చురుగ్గా ఉంటాయి. కందులు, పెసలు, శనగలు, రాజ్మా వంటి పప్పు దినుసుల్లో, పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి పాల ఉత్పత్తుల్లో, చికెన్‌, మాంసం, గుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.

చూశారుగా.. అన్నీ మనకు తెలిసిన పప్పుధాన్యాలూ కూరగాయలూ పండ్లే. అన్నీ అందుబాటులో ఉన్నవే. మరెందుకు నిర్లక్ష్యం. ఆయా రకాలన్నీ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా వంటల్ని ప్లాన్‌ చేసుకోవడం చేతిలోని పనే. రుచులమీద ఇష్టాయిష్టాల్ని పక్కనపెట్టి ఆరోగ్యానికి అవసరమైనవాటినే రుచిగా వండుకోగలిగితే.. అంతకన్నా ఏం కావాలీ..!

అంకెలు చెప్పే ఆందోళనకరమైన అంశాలు
ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వమూ స్వచ్ఛంద సంస్థలూ తరచూ అధ్యయనాలు జరుపుతుంటాయి. ఇటీవల వెలువడిన అలాంటి కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదిక ప్రకారం ఐదేళ్లలోపు పిల్లల్లో 67 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. 15- 49 మధ్య వయసు పురుషుల్లో 25 శాతం, మహిళల్లో 57 శాతం ఈ సమస్యతో బాధపడుతున్నారు. గత నివేదికతో పోలిస్తే
    ఈ సమస్య ఆదాయాలతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల్లోనూ పెరగడం గమనార్హం.
  • సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ వారి అధ్యయనం ప్రకారం 70 శాతానికి పైగా భారతీయులు సమతులాహారాన్ని తీసుకోలేకపోతున్నారు.
  • ప్రతి ఐదుగురు పిల్లల్లో ఇద్దరు విటమిన్‌ 'ఎ' లోపంతో బాధపడుతున్నారని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం చెబుతోంది.
  • రైట్‌ టు ఫుడ్‌ క్యాంపెయిన్‌ వారు 14 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న సామాన్యుల్లో 80 శాతం- ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నామని చెప్పారట. వారిలో నాలుగో వంతు రోజూ ఒకపూట పస్తులుంటున్నవారేనట.
  • అయిదేళ్లలోపు పిల్లల్లో 4.6 కోట్ల మంది వయసుకు తగిన ఎత్తు లేరని కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. నూటికి 35 మంది గిడసబారిపోయినట్లు ఉంటుండగా, 19 మంది నిస్సత్తువగానూ, 33 మంది బరువు తక్కువగానూ ఉన్నారట.
  • 68 శాతం పిల్లలకు మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. టీనేజ్‌ తల్లుల్లో ఏపీది మూడోస్థానం. కాన్పు అయిన తొలిగంటలో బిడ్డకు పాలిచ్చే తల్లులు తెలంగాణలో కేవలం 38 శాతం.
  • కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అంచనాల ప్రకారమే గతేడాది అక్టోబరు నాటికి దేశంలో దాదాపు 33 లక్షల మంది చిన్నారులు అత్యంత తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
  • 2017 నాటికి దేశంలో కనీస పోషకాహారాన్ని కొనుగోలు చేయలేనివారి సంఖ్య సుమారు 57 కోట్లు ఉండేది. కొవిడ్‌ సంక్షోభం, ధరల పెరుగుదల, ఆదాయాలు తగ్గిపోవడం అన్నీ కలిసి ఆ సంఖ్యను వందకోట్లకు చేర్చిందంటోంది సీఎస్‌ఈ నివేదిక.
  • ముప్పై రాష్ట్రాలకు చెందిన లక్షా 12 వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించి వివిధ విటమిన్లు తదితర లోపాలపై చేపట్టిన కసరత్తు ఏకంగా 71 శాతం ప్రజానీకం సరైన పోషకాహారం అందని పరిస్థితిలో ఉన్నారని తేల్చింది.
  • ఏటా 17లక్షల మరణాలకు పోషకాహార లోపమే కారణమట.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.