10 సెకన్లు ఒంటి కాలు మీద నిలబడలేరా? అయితే ఇక జాగ్రత్తపడండి!

author img

By

Published : Jun 23, 2022, 4:51 PM IST

10 second balance test

50 ఏళ్లు పైబడిన వారి ఆరోగ్యానికి సంబంధించి ఓ అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. 10 సెకన్ల పాటు ఒంటి కాలు మీద నిలబడలేకపోతే వారు మరో పదేళ్లలో మరణం అంచున ఉన్నట్లేనని హెచ్చరించింది.

కనీసం 10 సెకన్ల పాటు ఒంటి కాలు మీద నిలబడలేని 50 ఏళ్లు పైబడిన వారు అనారోగ్యం పాలయినట్లేనని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2009 నుంచి 1,702 మందిపై బ్రెజిల్​లోని ఓ సంస్థ చేసిన అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్​లో ప్రచురితమైంది. ఈ పరీక్షలో భాగంగా ఒక కాలు భూమి మీద ఉంచి రెండో కాలును ఒక అడుగు పైకి లేపాలి. భూమి మీద ఉన్న కాలు వెనుకగా రెండో కాలును పెట్టాలి. ఈ టెస్ట్​లో ఒక్కొక్కరికి మూడు సార్లు అవకాశం ఇస్తారు. అందులో ఒక సారైనా పాసవ్వాలి. ఇలా చేసిన ఈ టెస్ట్​లో ప్రతి అయిదుగురిలో ఒకరు విఫలమయ్యారు.

10 సెకన్ల పాటు ఒక కాలు మీద నిలబడలేని మధ్య వయస్కులు ఒక దశాబ్దంలో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ టెస్ట్​లో ఫెయిలైన వారు వచ్చే పదేళ్లలో మరణించే అవకాశం 84 శాతం ఎక్కువగా ఉందని సర్వేలో వెల్లడైంది.

బ్రెజిల్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో వృద్ధుల కోసం చేసే సాధారణ ఫిట్​నెస్​ టెస్ట్​లకు బ్యాలెన్సింగ్ పరీక్షను జోడించడం వల్ల వైద్యులకు కావలసిన ఆరోగ్య సమాచారం అందుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సరిగా నిల్చునే సామర్థ్యం లేక కింద పడిపోయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 6,80,000 కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారని తెలిపారు. ఈ 10 సెకన్ల పరీక్ష ద్వారా అలాంటి ఇబ్బందులు ఉన్న వారెవరో తెలుసుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.

'ఈ పరీక్ష చాలా సురక్షితమైనది. కేవలం ఒకటి లేదా రెండు నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. ఇది రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులకు తెలియజేస్తుంది." అని పరిశోధకులు చెప్పారు. ఫిటినెస్ టెస్ట్​లో సఫలమైన వారితో పోల్చితో విఫలమైన వారి మరణ శాతం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ఫిటినెస్ టెస్ట్​లో ఫెయిలైనవారు 17.5 శాతం మంది మరణించగా, పాసైనవారు కేవలం 4.5 శాతం మంది మరణించారని వివరించారు.

ఇవీ చదవండి: ఆఫీస్​లోనే ఈజీగా యోగా.. ఈ 5 ఆసనాలతో స్ట్రెస్​, మెడ నొప్పి మాయం!

పొగతాగితే ఎముకలు గుల్ల.. అకాల మరణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.