మరియమ్మ లాకప్ ​డెత్ కేసులో ఎస్సై, కానిస్టేబుళ్ల డిస్మిస్

author img

By

Published : Jul 21, 2021, 8:33 AM IST

కస్టడీలో మహిళ మృతి ఘటనపై చర్యలు.. ఎస్సై, కానిస్టేబుళ్ల తొలగింపు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ అనే ఎస్సీ మహిళ మృతిచెందటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ చర్యలు తీసుకున్నారు. ఎస్సై మహేశ్​, కానిస్టేబుళ్లు రషీద్​, జానయ్యలను సీపీ మహేశ్​ భగవత్ సర్వీసు నుంచి తొలగించారు. ​

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్​ స్టేషన్​లో ఎస్సీ మహిళ మరియమ్మ లాకప్‌ డెత్‌ వ్యవహారంలో ఎస్సై సహా ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మను దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె పోలీసు కస్టడీలో మృతి చెందింది. ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో... విచారణ జరిపిన రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్​ భగవత్‌ ఎస్సై మహేష్‌, కానిస్టేబుళ్లు జానయ్య, రషీద్‌ పటేల్‌ను సస్పెండ్‌ చేశారు. తాజాగా వారి ముగ్గురిని మహేష్‌ భగవత్‌ సర్వీసు నుంచి తొలగించారు.

ఈ కేసుపై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్​, డీజీపీ మహేందర్​ రెడ్డిలు సీరియస్​ అయ్యారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పూర్వపరాలను తెలుసుకుని... అవసరమైతే బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్‌ డీజీపీని ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం డీజీపీ మహేందర్​ రెడ్డి ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. లాకప్​డెత్​కు గురైన మరియమ్మ కుటుంబాన్ని డీజీపీ పరామర్శించి.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే...

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ అనే ఎస్సీ మహిళ మృతిచెందటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన మరియమ్మ... యాదాద్రి జిల్లా గోవిందాపురంలో చర్చి పాస్టర్ బాలశౌరి ఇంట్లో వంటమనిషిగా పనిచేశారు. జూన్​ 3న ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌తో పాటు అతడి స్నేహితుడు శంకర్‌... గోవిందాపురం వచ్చారు. జూన్​ 5న ఫాదర్ పని మీద హైదరాబాద్ వెళ్లారు. మరుసటి రోజు వచ్చేసరికి... ఇంట్లో 2 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. డబ్బుల విషయమై మరియమ్మను పాస్టర్‌ ప్రశ్నించారు. మర్నాడు మరియమ్మతోపాటు ఆమె కుమారుడు... రాత్రికి రాత్రే పరారయ్యారు. సొమ్ము పోయిందని అడ్డగూడురు పోలీస్ స్టేషన్‌లో ఫాదర్‌ ఫిర్యాదు చేశారు. కేసులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు.. జూన్​ 18న మరియమ్మను పిలిపించారు. విచారణలో భాగంగా... ఆమె స్పృహ కోల్పోయిందని.... భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరియమ్మ మృతిచెందటంతో పోలీసులే అమె మృతికి కారణమని ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే ప్రమాదమని భావించిన పోలీసులు... భువనగిరి కేంద్రంగా వ్యవహారం నడిపారు. జూన్​ 19న ఠాణాలో కాకుండా... రహస్య ప్రదేశంలో మంతనాలు సాగించారు. దొంగతనం జరిగిన 2 లక్షల్లో... 90 వేలను అప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మరియమ్మ ప్రాణాలు కోల్పోయింది. మరియమ్మ మృతితో ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేయటంతో... ఎస్సై మహేశ్‌, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను సస్పెండ్‌ చేస్తూ.... రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా వారిని సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.