MP komatireddy venkat reddy: 'పార్టీ మారతానని ప్రచారం చేస్తే లీగల్‌ నోటీసులు ఇస్తా'

author img

By

Published : Aug 5, 2022, 8:33 AM IST

MP komatireddy venkat reddy

komatireddy venkat reddy on party change: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా అనంతరం ఆయన బ్రదర్​ వెంకట్​రెడ్డి పార్టీ మార్పు అంశం తెరపైకి వచ్చింది. తమ్ముడి బాటలోనే అన్న కూడా పార్టీ మారబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకట్​రెడ్డి స్పందించారు. పార్టీ మార్పుపై ఆయన స్పష్టతనిచ్చారు. అసలు ఆయన ఏమన్నారంటే..?

komatireddy venkat reddy on party change: తాను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేసే వారికి లీగల్‌ నోటీసులు ఇస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. దిల్లీలో గురువారం ఆయన మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం తదితర అంశాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. కోమటిరెడ్డి బ్రాండ్‌ లేదనడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌లో 35 ఏళ్లుగా పని చేస్తున్నానని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని వెంకట్​రెడ్డి తెలిపారు. తాను నాలుగు పార్టీలు మారి రాలేదన్నారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇంతకుముందే కోరానని చెప్పారు. సోనియా గాంధీ తనను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారని తెలిపారు.

'నేను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేసే వారికి లీగల్ నోటీసులు ఇస్తా. నేను నాలుగు పార్టీలు మారి కాంగ్రెస్​కు రాలేదు. 35 ఏళ్లుగా కాంగ్రెస్​లోనే పని చేస్తున్నా. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశా. సోనియా గాంధీ నన్ను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్​గా నియమించారు.' - కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, భువనగిరి ఎంపీ

ఇన్నాళ్లు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి శత్రువులతో కలిసి వెన్నుపోటు పొడిచారంటూ ఇటీవలె పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. సోదరుడు రాజగోపాల్‌రెడ్డితో తనను కలిపి.. ఇద్దరికీ ఆ వ్యాఖ్యలు వర్తించేలా ‘మీరు’ అని అన్నందుకు క్షమాపణలు చెప్పాలని బుధవారం పేర్కొన్నారు. సోదరుడి పార్టీ ఫిరాయింపు గురించి అడగ్గా.. రాజగోపాల్‌రెడ్డి భాజపాలోకి ఎందుకు వెళ్తున్నారన్నది ఆయన్నే అడగాలని అన్నారు. తాను కాంగ్రెస్‌ కార్యకర్తనని, పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పనిచేస్తానని తెలిపారు.

తమది ఉమ్మడి కుటుంబమని, ప్రస్తుత పరిణామాలను వ్యూహ కమిటీ చూసుకుంటుందన్నారు. తమ్ముడితోపాటు అన్న కూడా పార్టీ ఫిరాయిస్తారన్నది మీడియాకున్న అనుమానం తప్పితే దానిపై తాను స్పందించడానికేమీ లేదన్నారు. కాంగ్రెస్‌పార్టీ కరుడుగట్టిన కార్యకర్తను పట్టుకొని పార్టీ ఫిరాయిస్తారా? అని అడగడం తప్పని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తర్వాత రేవంత్‌రెడ్డి ‘మీరు’ అంటూ ఇద్దర్నీ ఒకే గాటనకట్టి చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం తప్పన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనాలి తప్పితే కోమటిరెడ్డి బ్రదర్స్‌ అని అర్థం వచ్చేలా అన్నారని ఆక్షేపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.