చరిత్రలో నిలిచిపోయేలా 'కాకతీయ వైభవ సప్తాహం' వేడుకలు

author img

By

Published : Jul 4, 2022, 6:53 PM IST

telangana

ఆంధ్రాశాతవాహనాలు తర్వాత తెలుగు జాతిని మరోమారు ఏకఛత్రం కిందకు తెచ్చిన సామ్రాజ్యం. అసమాన ధైర్య సాహసాలతో రాజ్యపాలన చేసిన ధీరవనితను అందించిన రాజవంశం. దిల్లీ పాదుషాల వద్ద బానిసత్వాన్ని అంగీకరించక తృణప్రాయంగా ప్రాణాలను తీసుకున్న శౌర్యత్వం. పటిష్ఠ పరిపాలన, అబ్బురపర్చే కళానైపుణ్యం... అద్భుత సాంస్కృతిక వారసత్వంతో.... ఆంధ్రదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజవంశం-కాకతీయులు. అలనాటి విశిష్టతను నేటి తరాలకు చాటిచెప్పేలా..... కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం. 700ఏళ్ల తర్వాత కాకతీయుల వారసుడు ఓరుగల్లుకు రానుండటంతో.... అందుకు తగిన ఏర్పాట్లు చేయటంలో అధికార యంత్రాంగం తలమునకలైంది.

చరిత్రలో నిలిచిపోయేలా 'కాకతీయ వైభవ సప్తాహం' వేడుకలు

ఓరుగల్లు కేంద్రంగా పరిపాలించిన కాకతీయుల కళా వైభవం మాటల్లో వర్ణించలేనిది. అత్యద్భుత శిల్ప సంపదకు ఓరుగల్లును చిరునామాగా మార్చిన ఖ్యాతి కాకతీయులకే దక్కుతుంది. వెలకట్టలేని వారసత్వ సంపదను తరతరాలకు అందించిన ఘనతను వీరే సొంతం చేసుకున్నారు. గొలుసు కట్టు చెరువులు నిర్మించి... ఆంధ్రదేశాన్ని సస్యశ్యామలం చేసిన గొప్ప కీర్తి కూడా కాకతీయ సామ్రాజ్యాధినేతలు సొంతం చేసుకున్నారు. ఔరా.... అనిపించే రీతిలో ఆనాడే అద్భుత సాంకేతికతను ఉపయోగించి... నీటిలో తేలియాడే ఇటుకులతో రామప్పను ఆలయాన్ని నిర్మించారు. ఇటీవలే ఆ సాంకేతికతకు అచ్చెరువొందిన యునెస్కో... రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి..... ఆలయ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.

అలనాటి కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 7 నుంచి వారం రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే బస్తర్‌లో ఉన్న 22వ కాకతీయ వారసులైన కమల్‌చంద్ర భంజ్ దేవ్‌ను.... ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలంటూ.... రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. వారం పాటు జరిగే వేడుకల్లో సాంసృతిక, సాహిత్య, కళ ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష నిర్వహించారు. కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా జరిపేందుకు 50 లక్షల రూపాయలు కేటాయించినట్లు ఇప్పటికే మంత్రులు తెలిపారు. చరిత్ర పరిశోధకులు, టార్చ్ స్వచ్ఛంద సంస్థ ఇందులో భాగమవుతున్నట్లు వెల్లడించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మేధావులు, కవులు, సాహితీ వేత్తలను గౌరవించే విధంగా కాకతీయ వైభవ సప్తాహంను నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కాకతీయుల వైభవాన్ని, ప్రతిష్ఠను పెంచే విధంగా ఏర్పాటు చేయాలన్న మంత్రి.... రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని అధికారులను కోరారు. సాహితీ, సాంస్కృతిక, కళా కార్యక్రమాలను, మేధో చర్చలను రూపొందించి, విద్యార్థి, యువతను సైతం వేడుకల్లో భాగం చేయాలన్నారు. కాకతీయ వైభవ సప్తాహంను విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ... అన్ని శాఖలు కలిసి ముందుకు సాగాలని సూచించారు.

కాకతీయ ఘనచరిత్రను చాటిచెప్పే విధంగా జరిపే ఈ ఉత్సవాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకతీయ వారసులు కమల్ చంద్ర భంజ్ దేవ్‌కు 'పేరిణీ, ఇతర కళాకారులతో' ఘన స్వాగతం పలుకాలని నిర్ణయించారు. విద్యాసంస్థలను సైతం ఇందులో భాగస్వామ్యం చేస్తూ... కాకతీయుల వైభవంపై పిల్లలకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.