Covid : కరోనాకు బలవుతున్న తల్లిదండ్రులు.. అనాథలుగా మారుతున్న పిల్లలు

author img

By

Published : Jun 5, 2021, 1:27 PM IST

covid effect, covid effect on families, corona effect

కలిసి నిండు నూరేళ్లు జీవించాల్సిన భార్యాభర్తలను కొవిడ్ మహ్మమారి పొట్టనపెట్టుకుంటోంది. చిన్న వయస్సులోనే పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేస్తోంది. వృద్ధ్యాప్యంలో తమ ఆలనాపాలన చూసుకుంటారనుకున్న అమ్మానాన్నలకు శోకాన్ని మిగులుస్తోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలు జంటలు వైరస్ బారినపడి...అకాల మరణం చెందడంతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. పిల్లలు, వృద్ధులు అనాథలుగా మారుతున్నారు.

రాష్ట్రంలో కరోనా రెండో దశ ఉద్ధృతి కాస్త తగ్గినా... ఇంకా చాలామంది మహమ్మారి ఉచ్చుకి చిక్కి ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేత్తో పట్టుకుని బతుకుతున్నారు. పచ్చని జంటలను.. కరోనా మహమ్మారి కాటేస్తోంది. కష్టాల్లో సుఖాల్లో నీవెంటే నేనుంటానంటూ బాసలు చేసుకున్న భార్యాభర్తలను కరోనా రక్కసి ఒకరికి తెలియకుండా మరొకరిని మింగేస్తోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలు జంటలు కరోనా బారినపడి కాలంచేశాయి. పసి ప్రాయంలోనే పిల్లలు అమ్మానాన్నల ప్రేమకు దూరమయ్యేలా చేసిందీ మాయదారి వైరస్‌.

అనాథలుగా పిల్లలు..

మహబూబాబాద్ జిల్లాలో దేవేందర్ సుమలత దంపతులను కరోనా బలి తీసుకుంది. మహబూబాబాద్ మిలటరీ కాలనీలో.. భవన నిర్మాణ కార్మికులుగా ఇద్దరూ పనిచేస్తున్నారు. పక్షం రోజుల క్రితం కొవిడ్ బారిన పడగా.. ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...6 రోజుల క్రితం సుమలత చనిపోయింది. భార్య చనిపోయిన రెండు రోజుల్లోనే భర్త దేవేందర్ మృతి చెందాడు. నిన్నటివరకూ ఆలనా పాలనా చూసే అమ్మానాన్నలు లేకపోవడంతో...వీరి పిల్లలు అనాథలయ్యారు.

నీ వెంటే.. నేనుంటా..

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన భిక్షం గత నెలలో కరోనా చికిత్స పొందుతూ హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చనిపోగా.. పదో రోజున ఆయన భార్య మంగమ్మ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఒకరికొకరు తోడు నీడగా ఉండాల్సిన వృద్ధ దంపతులను కరోనా బలితీసుకుంది.

అమ్మానాన్న ఎక్కడ?

ములుగు జిల్లా తాడ్వాయ్ మండలం మేడారం సమ్మక్క సారలమ్మ పూజారి సమ్మారావు.. కరోనాతో వరంగల్​లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోగా... సమ్మారావు భార్య సృజన అంతకు రెండు రోజుల ముందే కొవిడ్ కాటుతో మరణించింది. అమ్మానాన్నలకు ఏమైందో.... ఎందుకు ఒక్కసారిగా కనిపించకుండా ఉన్నారో కూడా పిల్లలకు అర్థం కావట్లేదు.

ఖర్చు చేసినా.. ఫలితం లేకపోయె

జయశంకర్ భూపాలపల్లికి చెందిన సత్తార్‌కు ముందుగా కరోనా సోకగా... ఆ తరువాత బ్లాక్ ఫంగస్‌కు గురై హైదరాబాద్ గాంధీలో చనిపోయాడు. భర్త మరణించిన మూడు రోజులకే....భార్య రబున్నీసా కూడా కన్నుమూసింది. వీరిద్దరి చికిత్స కోసం పదిలక్షల రూపాయల వరకూ వెచ్చించినా ఫలితం లేకపోగా ఒకరితర్వాత మరొకరు చనిపోయారు.

రక్కసి ఉచ్చులో..

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన నర్మద కొవిడ్​తో పోరాడుతూ... గత నెల 16న ఉదయం చనిపోగా...సాయంత్రానికి భర్త రాజు నీవెంటే నేనంటూ.... తనువు చాలించాడు. వీరే కాదు...రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల భార్యభర్తలు కొవిడ్ కాటుకు బలైతూనే ఉన్నారు. అంతేకాదు..భర్తను కోల్పోయి...భార్య..భార్య దూరమై భర్త జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. అయినా కరోనా రక్కసి మృత్యుదాహం మాత్రం తీరట్లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.