Paddy Procurement Frauds in TS : మిల్లర్ల మాయాజాలం.. అన్నదాతలు ఆగమాగం
Published: May 23, 2023, 11:31 AM


Paddy Procurement Frauds in TS : మిల్లర్ల మాయాజాలం.. అన్నదాతలు ఆగమాగం
Published: May 23, 2023, 11:31 AM
Millers Frauds In Paddy Procurement : ఆరుగాలం శ్రమించి పండించిన రైతులకు పంటను అమ్ముకునేందుకు తిప్పలు తప్పడం లేదు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఊపందుకోకపోవడం, తేమ శాతం సాకుతో మిల్లర్లు నానా కొర్రీలు పెట్టడం అన్నదాతలకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తోంది. రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న కర్షకులు కడుపుమండి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. యంత్రాంగం చొరవ తీసుకుని త్వరితగతిన వడ్లను కొనుగోలు చేయాలని నినదిస్తున్నారు.
Millers Frauds In Paddy Procurement : ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పంట పండించిన వరి రైతులకు పంట అమ్మకం ప్రహాసనంగా మారింది. మిల్లర్ల మాయాజాలంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. ధాన్యం తేమ, తాలు, ముక్క ఉన్నాయనే కొర్రీలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన సాగుదారులకు సజావుగా సాగని కొనుగోళ్లతో పెద్ద కష్టమే వచ్చి పడింది.
Paddy Procurement Issues in Warangal : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో తేమ శాతం ఉందని చెప్పి ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. గత్యంతరం లేని రైతులు వేచిచూసి మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. రైతుల సమాచారంతో పోలీసులు వచ్చి కొనుగోలు చేయాల్సిందేనని హెచ్చరించడంతో మళ్లీ కొనుగోళ్లు జరుపుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్ధితుల్లో మిల్లర్లు సహకరించేలా కలెక్టర్ సహా ఉన్నతాధికారాలు చూడాలని రైతులు వేడుకుంటున్నారు.
Paddy Procurement Issues in Telangana : ఐకేపీ సెంటర్లలో తరుగు పేరుతో మూడు కిలోలు అధికంగా జోకుతున్నారంటూ మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వేల్పుగొండలో రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ నిబంధనలను కేంద్రం నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. నార్సింగి- శంకరంపేట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Farmers protest against millers frauds in TS : జగిత్యాల జిల్లా ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినా మిల్లర్లు పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులగూడెం స్టేజీ వద్ద రైతులు ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలిపారు. 20 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యారని ఆరోపించారు. కాంటాలు వేసిన ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనాలంటూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామవరంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ను రైతులు అడ్డుకున్నారు. అభివృద్ధి పనుల కోసం వెళ్తున్న ఎమ్మెల్యేకు తమ గోడు చెప్పుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు కేంద్రంలోనే మూలుగుతున్నాయని రైతులు వివరించారు. క్వింటాకి 10 కిలోల చొప్పున మిల్లు యజమానులు కోత కోస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు.
రైతుల సమస్యను రెడ్యానాయక్ కలెక్టర్కు ఫోన్లో వివరించారు. కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు తరలించేందుకు లారీలను సమకూర్చాలని కలెక్టర్ను కోరారు. వర్షానికి తడిసిన వడ్లరాశులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యేజాజుల సురేందర్ గాంధారి మార్కెట్ యార్డులో పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ఇవీ చదవండి:
