young writer: రవళిక అక్షర సేద్యానికి సాహిత్యమే మురిసిపోయింది!

author img

By

Published : Aug 29, 2021, 12:48 PM IST

Updated : Aug 29, 2021, 1:55 PM IST

kavitha

పేదరికం.. గ్రామీణ వాతావరణం ప్రతిభకు అడ్డుకాదని నిరూపిస్తుంది ఆ యువతి. పేరున్న విద్యా సంస్థల్లోనే కాదు సర్కారు బడుల్లో విద్యనభ్యసించి అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తుంది. చిన్నతనంలోనే సాహిత్యంపై మక్కువతో వెయ్యికి పైగా కవితలు రాసి జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకుంది. చిన్న వయస్సులోనే ప్రముఖ కవయిత్రిగా పేరు తెచ్చుకున్న యువ రచయిత్రి రవళిక సాహితీ ప్రయాణం ఆమె మాటల్లోనే...

రవళిక అక్షర సేద్యానికి సాహిత్యమే మురిసిపోయింది!

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లికి చెందిన శెట్టి రవి, కామరత కుమార్తె... శెట్టి రవళిక సాహిత్యంలో గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ మాండలికంలో రచనలు చేస్తూ ప్రముఖుల మన్ననలు పొండుతూ ఔరా అనిపిస్తుంది. ఏడో తరగతి చదువుతున్న సమయంలో తనలోని రచయిత్రిని గుర్తించిన ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించారు. తరగతిలోనే సాహిత్యంలో మెలకువలు నేర్చుకుని... అక్షరాలతో విన్యాసాలు చేస్తూ... తన కలం నుంచి జాలువారిన భావజాలంతో ఆలోచింపచేస్తూ.. ఎన్నో అవార్డులు సాధించింది. మారుమూల పల్లె నుంచి ప్రారంభమైన ఆమె ప్రస్థానం జాతీయ స్థాయికి చేరింది. అధ్యాపకులు, తల్లిదండ్రులు, గ్రామస్థుల సహకారంతో మంత్రుల చేతుల మీదుగా అవార్డులు అందుకుంది. ఇప్పటి వరకు వెయ్యికిపైగా కవితలు రాసిన రవళిక... ఎందరినుంచో ప్రశంసలు అందుకుంది.

నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే ఆసక్తి. హైస్కూలులో ఉన్నప్పుడు నేను రాసిన ఓ జవాబును చూసిన మా టీచర్​... నాలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. నేను రాసిన మొదటి కవిత మనం దినపత్రికలో ప్రచురితమైంది. సామాజిక అంశాలే కవితా వస్తువుగా ఎక్కువ కవితలు రాశాను. ఇప్పటి వరకు వెయ్యికి పైగా కవితలు రాశాను. ఈ మధ్యకాలంలో ప్రక్రియలు కూడా ప్రారంభించాను. స్వరాలు, విజయశ్రీ, ముత్యాల పూసలు, తదితర ప్రక్రియలు రాస్తున్నాను. పద్మరత్నాలు ప్రక్రియలో శతకం పూర్తి చేసినందుకు పద్మకవి అవార్డు వచ్చింది. స్వరాలు ప్రక్రియలో శతకం పూర్తి చేసినందుకు స్వర సరస్వతీ పుత్రిక అనే అవార్డు వచ్చింది. నేను రాసిన కవితలను, సాహితీ సేవను గుర్తించి పుడమి జాతీయ వేదిక వాళ్లు డా.బీఆర్​ అంబేడ్కర్​ జాతీయ పురష్కారాన్ని అందించారు. బొజ్జ ఫౌండేషన్​ వారు జాతీయ విశిష్ట సేవా పురష్కారం అందించారు. -రవళిక, యువ రచయిత్రి

అవే ఆమె కవితా వస్తువులు

రైతులు, యువత, మద్యపానం, మహిళలపై అఘాయిత్యాలు, బృూణహత్యలపై కవితలు రాసి తన అక్షరాలతో ఎందిరినో ఆలోచింపచేసింది. ఇటీవల బొజ్జా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రుల చేతులమీదుగా జాతీయ విశిష్ట సేవాజ్యోతి అవార్డును అందుకుంది.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా..

సేద్యం చేసుకునే బతుకే తాము.. అక్షర సేద్యంలో రతనాల పంటలు పండిస్తున్న తమ కుమార్తె ప్రతిభను చూసి మురిసిపోతున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన తమ బిడ్డను సాహిత్యంలో ముందుకు వెళ్లేందుకు అండగా నిలుస్తామంటున్నారు.

మాకు కొడుకైనా, కూతురైనా ఆమెనే.. ఎక్కడ కవితల పోటీ జరిగినా మేము తీసుకెళ్తాము. ఆమె న్యాయమూర్తి కావాలనుకుంటుంది. ఆమె ఎంతవరకు చదువుకున్నా చదివిస్తాం. కామరత, రవళిక తల్లి

మంచిగా కవితలు రాస్తుంది. చక్కగా చదువుకుంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆమెను చదివిస్తాం. శెట్టి రవి, రవళిక తండ్రి

పేరు నిలబెట్టింది..

రవళికలో మంచి రచయిత్రి ఉందని తాము తొలినాళ్లలోనే గుర్తించి ప్రోత్సహించామని ఉపాధ్యాయులు అంటున్నారు. తమ విద్యార్థి వెయ్యికి పైగా కవితలు రాసిందని... జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల ఆమెకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: పాదాలతోనే అద్భుత చిత్రాలు.. దివ్యాంగుడి ప్రతిభ

Last Updated :Aug 29, 2021, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.