Paddy Procurement Issue in TS : ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. రైతుల నరకయాతన

author img

By

Published : May 24, 2023, 2:37 PM IST

Farmers Problems At Agriculture Market Yards

Paddy Procurement Issue in Telangana : ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాత నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికే అకాల వర్షాలతో సగం నష్టపోయిన రైతులను అధికారులు తేమ పేరుతో మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడానికి జాప్యం చేస్తుండటంతో ఎప్పుడు వానొస్తుందో.. మిగిలిన ఈ పంట కూడా ఎక్కడ నీటిపాలవుతుందోనని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Paddy Procurement Issue in Telangana : రాష్ట్రంలో రైతులు పంటను అమ్ముకోవడానికి నానా అవస్తలు పడాల్సి వస్తోంది. తేమ పేరుతో కొనుగోలు కేంద్రాల్లో తూకం జరగక... అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. తడిచిన ధాన్యానికి తేమ పేరుతో మరో విధమైన దోపిడి చేస్తున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానకు తడుస్తూ... ఎండకు ఎండుతూ... పంట అమ్ముకోవడానికి కర్షకులు నరకయాతన పడుతున్నారు

Paddy Procurement Issue in Warangal : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఆరు మండలాల్లో దాదాపుగా 45 వేల 71 ఎకరాల్లో యాసంగి వరి సాగు చేశారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తెచ్చి రైతులు పడిగాపులు కాస్తున్నారు. వడ్లు విక్రయించడానికి రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక కర్షకులు బిక్కు బిక్కుమంటున్నారు.

"ధాన్యం అంతా తడిసింది. పంటను కాపాడుకోవడానికి పరదాలు ఇవ్వడం లేదు. కాంటాలు పెట్టడం లేదు. లారీలు అందుబాటులో ఉండటం లేదు. 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. వర్షం వస్తే పరదాల మీదే పడుకోవాల్సి వచ్చింది. వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం. ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. క్వింటాలుకు 4 కిలోలు తరుగు తీస్తున్నారు. దానివల్ల మేం తీవ్రంగా నష్టపోతున్నాం. ఇప్పటికే వానలు మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇప్పుడు వీళ్లు ఇలా చేస్తున్నారు. " - రైతులు

ఖానాపురం మండలం పాకాల సరస్సు ఆయకట్టు కింద ఎన్నడూ లేని విధంగా సాగు జరిగింది. నర్సంపేట కొత్తగూడ ప్రధాన రహదారిపై, దామర చెరువు నుంచి పాకాల వరకు మూడు కిలో మీటర్ల మేరకు రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. జాగా లేకపోవడంతో కొంతమంది రైతులు ఏకంగా పాకాల సరసులోని ఖాళీ స్థలంలో ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. ఒకవేళ వర్షం వస్తే ధాన్యం కొట్టుకుపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"పంటను ఆరబోయడానికి స్థలం లేక వాగు పక్కన ఆరబోసుకుంటున్నాం. మిల్లు వాళ్లు, కొనుగోలు కేంద్రం వాళ్లు కుమ్మక్కై మమ్మల్ని మోసం చేస్తున్నారు. బస్తాలు ఇస్తే లారీలు రావడం లేదు. లారీలు వస్తే బస్తాలు ఇవ్వడం లేదు. పరదాలకు చాలా కిరాయి అవుతుంది. వయసుపైబడిన వారు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండి పనిచేయలేకపోతున్నారు. వర్షం వస్తే పంట అంతా కొట్టుకుపోతుంది. ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. మొన్నటి వర్షానికి వడ్లు కూడా తడిశాయి. వెంటనే ప్రభుత్వం పంటను కొనుగోలు చేసి రవాణా వాహనాలను పంపిస్తే బాగుంటుంది." - రైతులు

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం తడిసిముద్దైంది. జేసీబీ సాయంతో నీటిని బయటకు పంపించి... వడ్లను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని రైతు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.