వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కొలనుపల్లి పెద్ద గుట్ట క్వారీ ప్రోక్లైన్, కంటైనర్ దహనం చేసిన ఘటనలో 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రానైట్ క్వారీ యజమాని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కొలనుపల్లి గ్రామానికి చెందిన 29 మంది, జైరాం తండాకు చెందిన ఇద్దరు, ఆరెగూడెంకు చెందిన ఇద్దరిని కలిపి మొత్తం 33 మంది ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.
పేలుళ్ల కారణంగానే దాడి...
ఏవైనా సమస్యలు ఉంటే మొదట తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండా... చట్టానికి వ్యతిరేకంగా ఇతరుల ఆస్తులను ధ్వంసం చేయరాదని హెచ్చరించారు. క్వారీ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా పెద్దగుట్ట క్వారీలో జరుగుతున్న పేలుళ్ల కారణంగానే దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడు గ్రామాల ప్రజల ఆందోళన...
కొలనుపల్లి పెద్దగుట్టపై చాలా రోజులుగా జరుగుతున్న మైనింగ్ పనులను ఆపాలని మూడు గ్రామాల ప్రజలు ఆదివారం రోజున ఆందోళకు దిగారు. మైనింగ్ వలన మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోకపోవడం వల్ల ఎట్టకేలకు గ్రామస్థులే రంగంలోకి దిగి మైనింగ్కు వ్యతిరేకంగా ఆందోళనచేపట్టారు. మండలం కొలనుపల్లి, ఆరేగూడెం, కేశవపురం గ్రామ రైతులు గుట్టపై మైనింగ్ నిలిపివేయాలని రెండు గంటల పాటు నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఆందోళన తీవ్రతరం కాగా.. అక్కడే ఉన్న ప్రోక్లైన్, కంటైనర్లకు గ్రామస్థులు నిప్పంటించారు.
ఇవీ చూడండి: