దిల్లీని తలపించేలా దుమ్ము, దుమారం.. ఎక్కడంటే..?

author img

By

Published : Jan 2, 2023, 9:42 AM IST

Updated : Jan 2, 2023, 12:57 PM IST

Pollution at Tandoor

Pollution at Tandoor : కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని మాస్కు ముసుగున నెట్టేసింది. కానీ కొవిడ్ రావడాని కంటే ముందే ఆ ప్రాంత ప్రజలు మాస్కులు ధరించకుండా బయట అడుగుపెట్టలేని పరిస్థితి. ఈ పరిస్థితికీ ఓ మహమ్మారి కారణం. కానీ అది కరోనా వంటి వైరస్ కాదు. ఆ ప్రాంతంలో ఉండే ఓ పరిశ్రమ వెదజల్లే ఘన, ద్రవ, వాయు వ్యర్థాలు. ఆ పరిశ్రమ వల్ల వచ్చే దుమ్ము, ధూళితో అక్కడి ప్రజలు ఏళ్ల తరబడి మాస్కులు ధరించే జీవిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడంటే..?

Pollution at Tandoor : ఎటు చూసినా నాపరాళ్ల పరిశ్రమలు.. వాటి పాలిషింగ్‌ వల్ల వెలువడే ఘన, ద్రవ, వాయు వ్యర్థాలు నివాస ప్రాంతాల చుట్టూ కమ్మేసి కనిపించే దృశ్యాలు.. రోడ్ల వెంబడి ఎక్కడి చూసినా రాళ్ల ముక్కలు.. ఏ దారిలో ప్రయాణించినా మెత్తటి ప్రమాదకరమైన దుమ్ము, ధూళి.. తెలియకుండానే ఇవన్నీ ప్రజల శరీరాల్లోకి చొరబడి వ్యాధులకు గురి చేస్తున్నాయి. కరోనా రావడానికి కంటే చాలా ఏళ్ల నుంచే అక్కడి ప్రజలు మాస్క్‌, లేదా ముక్కుకు రుమాలు కట్టుకుంటే గానీ బయట తిరగలేని పరిస్థితి. తాండూరు పట్టణం, పరిసరాల్లోని అనేక గ్రామాల పరిస్థితి ఇది. ఈ సమస్యలపై క్షేత్రస్థాయి కథనం ఇది.

లక్ష జనాభా.. ఇతర ప్రాంతాల నుంచి నిత్యం 30-40 వేల మంది వచ్చిపోయే తాండూరు పట్టణం నెత్తిన వాయు కాలుష్యం కత్తి వేలాడుతోంది. ఇక్కడ నివాస ప్రాంతాల మధ్యే నాపరాయి పాలిషింగ్‌ యూనిట్లు నడుస్తుండడంతో ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సమస్య తీవ్రంగా ఉన్నా.. ఇప్పటికీ ఇక్కడ వాయు కాలుష్య నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రజల్లో ఆందోళన వ్యక్తమైనప్పుడు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఓ రెండు రోజులు నమూనాలు తీసి లెక్కల నమోదుకే పరిమితమవుతోంది. శ్వాసకోశ వ్యాధుల బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పల్మనాలజీ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఏళ్లుగా కార్యరూపం దాల్చలేదు.

...

మైనింగ్‌ ప్రాంతం, నిత్యం వందల లారీలు..: తాండూరు పట్టణంతో పాటు పరిసరాల్లోని కరణ్‌కోట, మల్కాపురం, ఓగిపూర్‌, సంగెం కలాన్‌, బెల్కటూరు, కోటాభాస్పల్లి, గుంతభాస్పల్లి గ్రామాలు కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ఈ చుట్టుపక్కల అంతా మైనింగ్‌ ప్రాంతం. ఐదు సిమెంటు పరిశ్రమలు, వందల సంఖ్యలో నాపరాతి పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. రైళ్లు, లారీల ద్వారా సిమెంటు, బొగ్గు, లేటరైట్‌, జిప్సం, నాపరాయి రవాణా అవుతుంటాయి. మైనింగ్‌లో సరైన ప్రమాణాలు పాటించడం లేదు. నాపరాయి పాలిషింగ్‌ యూనిట్ల నుంచి నిత్యం 700 టన్నులకు పైగా వ్యర్థాల్ని పారబోస్తున్నారు. పట్టణ, సమీప గ్రామాల్లో రోడ్ల పక్కన, చెరువుల్లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఫలితంగా వాయు, నీటి కాలుష్యం పెరిగిపోతోంది. రాత్రి 9.30 నుంచి ఉదయం 5.30 మధ్య సమయంలో ఎగుమతి, దిగుమతుల కోసం వందల లారీలు తిరగడంతో ఆ సమయంలోనే వాయుకాలుష్యం అత్యధికం.

పారిశ్రామిక పార్కు ఏర్పాటు ఎప్పుడో!.. కాలుష్యం నివారణకు పరిశ్రమలన్నిటినీ తరలించాలని తాండూరు మండలం జిన్‌గుర్తిలో పారిశ్రామిక పార్కు ప్రతిపాదన రాగా.. ప్రభుత్వం 300 ఎకరాల భూమిని మంజూరు చేసింది. ఆయా యూనిట్లకు స్థలాలు కేటాయించి తరలించాల్సి ఉంది.

5 లక్షల మొక్కలు నాటితేనే ఊరట.. "కాలుష్య కారకాలను నియంత్రించడం, భారీ ఎత్తున పచ్చదనం పెంచడం ఈ సమస్యకు పరిష్కారాలు. తాండూరులో మియావాకీ పద్ధతిలో 5 లక్షల మొక్కలు నాటి సంరక్షిస్తేనే కొంత ఊరట లభిస్తుంది. ప్రతి పాలిష్‌ యూనిట్‌తో పాటు పెద్ద కర్మాగారాలు 10 వేల చొప్పున మొక్కలు నాటాలి." - శ్యాంసుందర్‌రావు, అటవీ రేంజి అధికారి, తాండూరు

కాలుష్యం ఎంత?.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం పీఎం 10 సూక్ష్మ ధూళికణాలు (ఘనపు మీటరు గాలికి మైక్రోగ్రాముల్లో) 60 మై.గ్రా. వరకు ఉన్నా ప్రమాదం లేదు. 2021 మార్చి 19, 20 తేదీల్లో పీసీబీ సేకరించిన నమూనాల ప్రకారం.. తాండూరు శివారు గౌతాపూర్‌లో పీఎం 10 ఉద్గారాల గరిష్ఠం 291 మైక్రో గ్రాములు. దేశ రాజధాని దిల్లీలో 2022 డిసెంబరు 31న నమోదైన పీఎం 10 ఉద్గారాలు 293 మై.గ్రా. తాండూరులో ఉద్గారాలు వేసవిలోనే దాదాపు దిల్లీ స్థాయిలో ఉన్నాయంటే చలికాలంలో అంతకుమించి వ్యాపిస్తున్నాయని తెలుస్తోంది.

ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇలా.. తాండూరులోని జిల్లా ఆసుపత్రికి శనివారం వచ్చిన రోగుల్ని ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ పరిశీలించగా.. లక్షణాలను బట్టి 14 శాతం మంది కాలుష్య ప్రభావానికి లోనయ్యారని తెలుస్తోంది.

  • చికిత్సకు వచ్చిన వారి సంఖ్య : 792
  • ఊపిరితిత్తులు, ఆస్తమాతో వచ్చినవారు : 43 మంది
  • దురద, చర్మ సంబంధ సమస్యలతో వచ్చినవారు : 68 మంది

నింగీనేలా.. కాలుష్యపు వల..

నింగీనేలా.. కాలుష్యపు వల..

తెల్లని తెట్టులా కనిపిస్తున్న ఇది కాలుష్యపు ఆనవాలు. నాపరాళ్ల గనులకు, పాలిషింగ్‌ యూనిట్లకు రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన తాండూరు పరిసరాల్లో ఎక్కడ చూసినా ఇలా ఘనీభవించిన ద్రవ అవశేషాలు, గుట్టలుగా నాపరాతి ముక్కలు కనిపిస్తాయి. 750కి పైగా ఉన్న పాలిషింగ్‌ యూనిట్లలో రాళ్లను అరగదీయడం ద్వారా వారానికి 5 వేల టన్నుల ద్రవ, వాయు వ్యర్థాలు వెలువడుతున్నాయి. అవి గాలిని, నేలను, నీటిని కలుషితం చేసేస్తున్నాయి. ఫలితంగా ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. నివాసాల మధ్యలో ఉన్న ఈ యూనిట్లను తరలించేందుకు ఉద్దేశించిన పారిశ్రామిక పార్కు ఏర్పాటు ఇంకా కొలిక్కిరాలేదు.

Last Updated :Jan 2, 2023, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.