BIKE ACCIDENTS: రోడ్డు ప్రమాదాలకు కారణమేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

author img

By

Published : Sep 14, 2021, 9:18 AM IST

BIKE ACCIDENTS

ఎంతో భవిత ఉన్న యువత రోడ్డు ప్రమాదాల్లో అర్ధంతరంగా మృత్యువాత పడుతున్నారు. వీటిల్లో ద్విచక్ర వాహనాలు నడుతున్నపుడు జరుగుతున్నవే ఎక్కువ. కొందరు యువకులు వాహనాలను వేగంగా నడిపించడమే కాకుండా, రోడ్డుపై రద్దీలేదని రకరకాల విన్యాసాలు చేయడంతో అదుపుతప్పి అసువులు బాస్తున్నారు. కొందరు క్షతగాత్రులవుతున్నారు. ఈ సంఘటనలు కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతున్నాయి. సరదా కాస్త ప్రాణసంకటంగా మారుతోంది. క్షణాల్లో దూసుకెళ్లే అత్యాధునిక మోటారు సైకిళ్లపై మితిమీరిన వేగంతో రయ్‌మంటూ దూసుకుపోతున్నారు. వీటికి అనుగుణంగా రహదారులు లేవన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. మరో వైపు ఎదురుగా వస్తున్న వాహనాలను చోదకులు అంచనా వేయలేకపోవడంతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తూ, ఏటా వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు.

బుగ్గురామలింగేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ప్రమాదానికి గురైన మోటారు సైకిల్‌


వికారాబాద్​ జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల ద్విచక్రవాహనాలున్నాయి. ఇందులో అత్యధికంగా 100 సీసీ నుంచి 150 సీసీ సామర్థ్యం కలిగినవే. ఇటీవల 350 సీసీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని నడిపించాలంటే దేహదారుఢ్యం అవసరం ఉంటుందని రవాణా శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఇంటర్‌ నుంచి ఇంజినీరింగ్‌ చదువుకునే విద్యార్థులకు తల్లిదండ్రులు కోరిన మోటారుసైకిల్‌ కొనిస్తున్నారు. దీంతో వారు అతివేగంగా వాహనాలు నడిపిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇష్టానుసారం, చరవాణితో మాట్లాడుతూ నడపడం, నిర్లక్ష్యం, అతివేగం వల్లే జరుగుతున్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

అనంతగిరిలోనే అధికం

జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతం, కోట్‌పల్లి జలాశయానికి వారాంతాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఇందులో యువతే అధికం. హైదరాబాద్‌ నుంచి స్నేహితులతో కలసి మోటారు సైకిళ్లపై బయలుదేరి, వేగంగా నడిపించేందుకు పోటీ పడుతున్నారు. విన్యాసాలు చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి రహదారులపై అవగాహన లేకపోవడం కూడా ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

అస్తవ్యస్త రోడ్లతో

వికారాబాద్‌ డీఎస్పీ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డులో పేరుకున్న మట్టి

టీవల కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. తాండూరు, వికారాబాద్‌ రోడ్డులో గుంతలు పడ్డాయి. కొడంగల్‌- తాండూరు రోడ్డు కయ్యలు పడి, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదానికి ఆస్కారం ఉంది. చాలా ప్రాంతాల్లో మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేవు. వికారాబాద్‌, తాండూరు పట్టణాల్లో దారులపై మట్టి, ఇసుక పేరుకుపోయింది.

* ఇటీవల ధారూర్‌కు చెందిన ఇద్దరు యువకుల ద్విచక్రవాహనంపై వికారాబాద్‌ వచ్చి తిరిగి వెళుతుండగా, బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు.

* కెరెళ్లికి చెందిన వ్యక్తి, తన మిత్రుడితో కలిసి వికారాబాద్‌లో పనులు ముగించుకుని గ్రామానికి వెళుతున్న క్రమంలో అనంతగిరి అటవీ ప్రాంతం మలుపు వద్ద మోటారు సైకిల్‌ జారిపడింది. ఇద్దరికి గాయాలయ్యాయి.

* హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులు స్పోర్ట్స్‌ మోటారు సైకిల్‌పై అతి వేగంగా వెళుతూ అనంతగిరి అటవీ ప్రాంతంలోని వేగ నియంత్రికను గుర్తించలేకపోయారు. దీంతో వాహనం గాల్లోకి ఎగిరిపడింది. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

అవగాహన లేకే..

మోటారు సైకిల్‌ నడిపే వ్యక్తికి వాహనంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. డ్రమ్‌, డిస్క్‌ రెండు రకాల బ్రేకింగ్‌ వ్యవస్థ ఉంటుంది. డ్రమ్‌ బ్రేక్‌ను బలంగా వినియోగించాల్సి ఉంటుంది, డిస్క్‌ బ్రేక్‌ సున్నితంగా వినియోగించాలి. ఎంత వేగంలో ఉన్నాం, నియంత్రించేందుకు ఎంత మేరకు బ్రేక్‌లను వినియోగించాలి అనేది తెలియకుంటే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. తేలికైన వ్యక్తి, బరువైన మోటారు సైకిల్‌ను నడిపించే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్ధు. రఫీ, మోటారు సైకిల్‌ మెకానిక్‌, వికారాబాద్‌

హెల్మెట్‌ లేకుంటే రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు

మన జిల్లాలో స్పోర్ట్స్‌ మోటారు సైకిళ్లు లేవు. బుల్లెట్‌, మరికొన్ని రకాల ఆధునికమైనవి మాత్రమే వస్తున్నాయి. మోటారు సైకిల్‌ కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్‌కు వచ్చినపుడు తప్పనిసరిగా హెల్మెట్‌ వినియోగించాలని, పరిమిత వేగంలోనే వాహనాన్ని నడిపించాలని, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, వేగ నియంత్రికలు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. శిరస్త్రాణం లేకుంటే రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి అన్ని రకాలుగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నాం. భద్రునాయక్‌, జిల్లా రవాణా అధికారి

నివారణకు చర్యలు

జిల్లా మోటారు సైకిల్‌ రేసింగ్‌ జరిగే పరిస్థితి లేదు. కొంత మంది యువకులు అతివేగంతో వెళుతున్నట్లు గుర్తిస్తే వెంటనే వారికి చలానాలు విధించి, అవగాహన కల్పిస్తున్నాం. అనంతగిరి అటవీ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. వారాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. నిర్ణీత వేగానికి మించి నడిపినా కేసులు నమోదు చేస్తున్నాం. రహదారిపై వేగ నియంత్రికలు ఏర్పాటు చేస,ి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. చరవాణిలో మాట్లాడుతూ బండి నడపొద్దని సూచిస్తున్నాం.-ఎస్పీ నారాయణ

ఇదీ చూడండి: GHMC: హైదరాబాద్‌ రోడ్లపై భవన వ్యర్థాలు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.