తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరకు వేళాయె..

author img

By

Published : Jan 23, 2023, 6:05 PM IST

Lingamantula Swami Jatara

Lingamantula Swami Jatara: తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు అంకురార్పణ జరిగింది. ఈ జాతర చేయడానికి ముందు నిర్వహించే దిష్టి పూజ అర్థరాత్రి జరిపారు. ఈ జాతర ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనుంది.

Lingamantula Swami Jatara: తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద జాతరగా పేరొందిన పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతరకు వేళైంది. జాతర ప్రారంభ సూచికగా చేసే దిష్టి పూజ క్రతువుని సాంప్రదాయ బద్దంగా అర్థరాత్రి ఆలయ వంశపారం పర్య పూజారులు నిర్వహించారు. దిష్టి పూజతో రెండు వారాల ముందే జాతరకు ఆంకురార్పణ జరిగింది. ఎటువంటి ఆటంకం కలగకుండా జాతర జరగాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్​ ఛైర్మన్​ వట్టే జనయ్య యాదవ్, జడ్పీటీసీ జీడీ బిక్షంలు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్​పల్లిలో లింగమంతులస్వామి జాతర జరగనుంది.

యాదవుల ఆరాధ్య దైవం పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న దురాజ్ పల్లి గ్రామంలో కొలువై ఉన్న లింగమంతుల స్వామి జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. సమక్క సారలమ్మ జాతర తరవాత అదే స్థాయిలో ఈ జాతరకు భక్తుల ప్రవాహం ఉంటుంది. అందుకే తెలంగాణా రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందింది.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక లాంటి ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పెద్దగట్టుకు వస్తారు. మాఘ మాసం అమావాస్య తరవాత వచ్చే మొదటి ఆదివారం జాతర జరుపుతారు. జాతర జరిగే రెండు వారాల ముందుగా జాతర ప్రారంభ సూచికగా చేసే దిష్టి పూజ ఆదివారం రాత్రి యాదవ సాంప్రదాయ పద్దతుల్లో నిర్వహించారు.

మొదటగా ఆనవాయితీ ప్రకారం సూర్యాపేట పట్టణానికి సమీపంలో ఉన్న కేసారం గ్రామానికి మహబూబాబాద్ జిల్లా చిట్టాయాపాలెం నుంచి దేవరపెట్ట చేరుకుంది. ఈ పెట్టెలో లింగమంతుల స్వామి, సౌడమ్మ , ఎలమంచమ్మలతో పాటు 33 మంది దేవతా విగ్రహాలు ఉంటాయి. హక్కుదార్లుగా ఉన్న మెంతబోయిన, గొర్ల , మున్న వంశస్థులు కేసారం గ్రామంలో మొదటి పూజ నిర్వహించి బోనం కుంబాలు, తల్లి, పిల్ల గొర్రెలతో యాదవ సాంప్రదాయ వేశాలతో డప్పు చప్పుళ్ళు, బేరీల నృత్యాలతో వేలాది మంది భక్తుల నడుమ ఊరేగింపుగా దురాజ్ పల్లి పెద్దగట్టుకు దేవరపెట్టను తరలించి ప్రదక్షిణలు చేశారు.

అనంతరం హక్కుదారులు, వంశపారంపర్య పూజారుల ఇళ్ల నుంచి తెచ్చిన బియ్యంతో బోనం వండి పసుపు కుంకుమలతో పట్నం వేసి వండిన బోనాన్ని రాసులుగా పోసి దిష్టి కుంభాన్ని పెట్టి దీపారాధన చేసి మొక్కులు చెల్లించారు. ఒక వైపు బైకాన్ల కులస్థులు దేవుడి చరిత్రను పాటలుగా పాడుతుండగా మరో వైపు పిల్ల, తల్లి గొర్రెలను బలి ఇచ్చి ఆలయ ప్రాంగణంలో బలి ముద్దలు చల్లారు. దీంతో దిష్టి పూజ కార్యక్రమం ముగిసింది.

దిష్టి పూజా కార్యక్రమంలో బీఆర్​ఎస్ నాయకులు, యాదవ సోదరులు పాల్గొన్నారు. సీ‌ఎం కే‌సి‌ఆర్ సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ చరిత్రలో ఎన్నడూలేని విధంగా జాతరకు అధిక నిధులను కేటాయించి ఏర్పాట్లు చేస్తున్నారని అందుకు కే‌సిీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందిస్తారని తెలిపారు.

ఘనంగా పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతర దిష్టి పూజ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.