ఆ పోరులో.. ఈ ఊరిలో ఎగిరింది నీ బావుటా...

author img

By

Published : Jun 17, 2020, 8:36 AM IST

colonel-santosh-babu-life-story

దేశ ప్రజల ‘సంతోష’మే తన సంతోషం అనుకున్నారు కర్నల్‌ సంతోష్‌బాబు. తండ్రి ఆశయ సాధనకు, తన లక్ష్యంపై గురిపెట్టి చిన్నప్పటి నుంచే ఆ దిశగా అడుగులు వేశారు. నాయకుడిగా ఎదిగారు. దేశసేవకు పునీతుడిని చేసిన ఆ తల్లిదండ్రులకు ఆయన మరణవార్త ‘సంతోష'ం లేకుండా చేసింది.

చైనా- భారత్‌ సరిహద్దులోని ఈశాన్య లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కర్నల్‌ సంతోష్‌బాబు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1993 నుంచి విజయనగరంలోని కోరుకొండ సైనిక పాఠశాలలో చదువుకున్నారు. పాఠశాలలోనూ ఉత్తమ విద్యార్థిగా, మంచి వక్తగా, క్రీడాకారునిగా గుర్తింపు పొందారు. ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనూ ఆయనతో నాయకత్వ లక్షణాలు ఉన్నట్లు తల్లిదండ్రులు గ్రహించారు. పాఠశాలలోని వసతిగృహాల్లో ఒకటైన గుప్తా హౌస్‌కు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించేవారు. తొలి ప్రయత్నంలోనే ఎన్‌డీఏ (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ)లో ర్యాంకు సాధించారు. సైన్యంలో చేరిన 2004 నుంచి వివిధ హోదాల్లో భారత సైన్యంలో సేవలు అందించి అందరి మన్ననలు పొందారు. డెహ్రాడూన్‌లో శిక్షణ పొందే సమయంలోనూ బ్యాచ్‌లో మెరుగైన ప్రతిభ చూపారు. చిన్ననాటి నుంచి అందిపుచ్చుకున్న నాయకత్వ లక్షణాలతోనే ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం పనిచేస్తున్న బ్యాచ్‌లోనూ అందరికీ సంతోష్‌బాబు ఆప్తునిగా ఉండేవాడని తండ్రి ఉపేందర్‌ వెల్లడించారు. 2018లో కోరుకొండ సైనిక పాఠశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విజయనగరం వచ్చినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. సూర్యాపేటకే చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పల్లాడ వెంకటేశ్వర్లు కూతురు సంతోషి ని 2009లో వివాహం చేసుకున్నారు.

సంతోష్‌కు గుత్తా నివాళి

నల్గొండ అర్బన్‌: భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో దేశం కోసం మంగళవారం ప్రాణాలర్పించిన సూర్యాపేట జిల్లా వాసి కల్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌కు శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళి అర్పించారు. ఉమ్మడి జిల్లా నుంచి కల్నల్‌ స్థాయికి ఎదిగి దేశ సేవలు అందిస్తున్న జవాన్‌ వీరమరణం పాలవ్వడం విచారకరమన్నారు. ఆయన మృతదేహం వెంటనే స్వస్థలానికి చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరినట్లు తెలిపారు.

ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమిపట్టి...!

చైనా-భారత్‌ సరిహద్దులో వీర మరణం పొందిన సంతోష్‌బాబు తల్లిదండ్రుల ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం అందరికీ కన్నీరు తెప్పించింది. పుట్టెడు దుఖాన్ని కడుపులో అనుచుకుంటూ భరతమాత కోసం కుమారుడి మృతి గర్వంగా ఉందంటూ ప్రకటించడం అందరినీ కలచివేసింది. కుమారుడితో తల్లిదండ్రులకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విషాదంలో మునిగిపోయారు. వీర జవానుగా నాన్న ఆశయానికి ప్రాణం పోశారు. ఆయన అభిరుచికి అనుగుణంగా సైన్యంలో చేరి దేశానికి సేవలందించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేసిన భరతమాత ముద్దుబిడ్డగా వీర మరణం పొందారు. తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయారు.

ఫేస్‌బుక్‌ నుంచి వాట్సప్‌ వరకు..

కర్నల్‌ సంతోష్‌బాబు మృతిపై సామాజిక మాధ్యమాల్లో నివాళులు మిన్నంటాయి. భరతమాత ముద్దుబిడ్డగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఎన్నటికీ మర్చిపోరంటూ నినాదాలు హోరెత్తాయి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌లల్లో కర్నల్‌ ఛాయాచిత్రాలకు నివాళులు అర్పించారు. పట్టణంలో ఉన్న వారికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఫోన్‌చేసి కర్నల్‌ మరణ వార్త గురించి ఆరా తీశారు.

అప్పుడు ముగ్గురు.. ఇప్పుడు ఒక్కరు

దేశ రక్షణకు ప్రాణాలర్పించిన వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఉన్నారు. అప్పటి ప్రధానిగా వాజ్‌పేయి ఉన్న సమయంలో కార్గిల్‌ యుద్ధం జరిగింది. 1999 మే 3 నుంచి 26 జులై వరకు పాకిస్థాన్‌తో కాశ్మీర్‌లోని కార్గిల్‌ జిల్లాలో జరిగిన యుద్దంలో 527 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఉమ్మడి జిల్లా నుంచి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారు ముగ్గురు ఉన్నారు. కార్గింల్‌లోని ఎత్తయిన పర్వతగిరి ప్రాంతాల్లో పాకిస్థాన్‌ సైనికలు కాల్పులకు తెగబడడంతో కింది భాగంలో ఉన్న భారత జవాన్లలో సూర్యాపేట జిల్లా పెన్‌పహడ్‌కు చెందిన గోపయ్యచారి, నల్గొండ జిల్లా నిడమనూరు మండలం కొనతాలపల్లికి చెందిన మిట్ట శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ పట్టణానికి చెందిన షేక్‌ హైమద్‌ ప్రాణాలు కోల్పోయారు. అదే సంఘటనలో పానగల్‌ వాసి శ్రీధర్‌రెడ్డి కాలును తొలగించారు. తాజాగా భారత్‌-చైనా మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేట జిల్లా వాసి సంతోష్‌ ప్రాణాలు వదిలారు. 20 ఏళ్ల తరువాత జిల్లాలో మరో సైనికుడి ప్రాణాలు కోల్పోవడంతో మాజీ సైనికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశ రక్షణతో పాటు సైనికుల ప్రాణాలు కాపాడుతూ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూచాలని కోరుతున్నారు.

సంతోష్‌బాబు తెలివైన వ్యక్తి

సంతోష్‌బాబు మంచి వ్యక్తి. కుటుంబ సభ్యులంతా సున్నిత మనస్కులు. 2019 మార్చి నెలలో సూర్యాపేటకు వచ్చినపుడు చివరిసారిగా ఆయనతో మాట్లాడాను. అందరితో సరదాగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తి వీరమరణం చెందాడని తెలిసి చాలా బాధపడుతున్నాం. -గుండా రమేష్, బంధువు

సరదాగా మాట్లాడతారు

సంతోష్‌బాబు అందరితో కలివిడిగా మాట్లాడతారు. తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడిచారు. దేశభక్తి ఎక్కువ. చిన్ననాటి నుంచి ఎక్కువగా బయటి ప్రాంతాల్లోనే ఉండి విద్యాభ్యాసం చేశారు. ఏడాదికి ఒకసారి సెలవుల్లో వచ్చినప్పుడు బంధువులందరినీ కలుస్తారు. -నరేంద్రుని శ్రీధర్, బంధువు

సొమ్మసిల్లిపడిన అత్త

అల్లుడు సంతోష్‌బాబు మృతిని తట్టుకోలేక అతని భార్య సంతోషి తల్లి సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్ఛార్జి చేయటంతో సంతోష్‌ తల్లిదండ్రుల నివాసానికి ఆమె వచ్చారు.

ఇదీ చూడండి: సూర్యాపేటలోనే కర్నల్​ సంతోష్​ అంత్యక్రియలు.. అధికారుల ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.