శత్రువులు చుట్టుముట్టినా... సింహంలా గర్జించాడు..!

author img

By

Published : Jun 22, 2020, 5:35 AM IST

Updated : Jun 22, 2020, 8:14 AM IST

colonel-santhosh-babu-fight-against-china-soldiers-till-death

అప్పటికే శరీరంపై తీవ్ర గాయాలు.. చుట్టూ పెద్ద సంఖ్యలో శత్రు బలగాలు.. తన వద్ద చాలా తక్కువ మంది సైనికులు.. అయినా వెనక్కి తగ్గలేదు ఆ తెలుగు యోధుడు.. శత్రువుతో అమీతుమీకి సిద్ధపడ్డాడు. అతడే కర్నల్‌ సంతోష్‌ బాబు. వైరిపక్ష దురాగతంపై తుదికంటూ పోరాడుతూ భరతమాత రక్షణలో అమరుడయ్యారు. మృత్యు ముఖంలోనూ ఆయన ప్రదర్శించిన అద్భుత నాయకత్వ పటిమ, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం.

ఈ నెల 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. నాటి ఘటనకు సంబంధించిన వివరాలు అధికార వర్గాల ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. రోమాలు నిక్కబొడుచుకునేలా.. సంతోష్‌ నేతృత్వంలోని మన బలగాలు సాగించిన వీరోచిత పోరాటమది.

గల్వాన్‌ ప్రాంతంలో ‘16 బిహార్‌’ రెజిమెంట్‌ విధులు నిర్వర్తిస్తోంది. ఈ దళానికి కర్నల్‌ సంతోష్‌ బాబు కమాండింగ్‌ అధికారి (సీవో)గా వ్యవహరిస్తున్నారు. నెల రోజులుగా సాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల రెండు దేశాలూ పోటాపోటీగా అక్కడికి అదనపు బలగాలను తరలించాయి. అక్కడ వేడిని చల్లార్చేందుకు ఈ నెల 6న రెండు దేశాల లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. అందులో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు తమ సరిహద్దుల నుంచి అదనపు బలగాలను వెనక్కి తరలించాలి. ఇందులో భాగంగా గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 (పీపీ-14) నుంచి చైనా సైనిక ఉపసంహరణ జరగాలి. దీన్ని పర్యవేక్షించే బాధ్యతను భారత సైనిక నాయకత్వం.. కర్నల్‌ సంతోష్‌ నేతృత్వంలోని ‘16 బిహార్‌’ దళానికి అప్పగించింది.

ఖాళీ చేసినట్లే చేసి..
చైనా సైనికులు తొలుత ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. తమ శిబిరాలనూ తొలగించారు. ఈ అంశంపై స్థానిక చైనా కమాండర్‌తో కర్నల్‌ సంతోష్‌ బాబు చర్చలు కూడా జరిపారు. అయితే అకస్మాత్తుగా ఈ నెల 14న చైనా సైన్యం అక్కడ ఒక సరిహద్దు పరిశీలన కేంద్రం (అబ్జర్వేషన్‌ పోస్ట్‌)ను, మరికొన్ని గుడారాలను ఏర్పాటు చేసింది. ఒప్పందం మేరకు దీన్ని తొలగించాలన్న సందేశంతో ఒక చిన్న గస్తీ బృందాన్ని ‘16 బిహార్‌’ దళం పంపింది. అయితే డ్రాగన్‌ దళాలు దీనికి ససేమిరా అన్నాయి. దీంతో మన గస్తీ బృందం ఈ విషయాన్ని సంతోష్‌ బాబుకు తెలియజేసింది. భారత బృందం వచ్చి వెళ్లాక.. చైనా సైనికులు అక్కడికి భారీగా అదనపు బలగాలను రప్పించారు.

రంగంలోకి సంతోష్‌
చైనా శిబిరాన్ని ఖాళీ చేయించేందుకు సంతోష్‌ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో మేజర్‌ హోదా అధికారికి అప్పగిస్తుంటారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో తన బలగాన్ని తానే ముందుండి నడిపించాలని సంతోష్‌ నిర్ణయించారు. ఆయన నేతృత్వంలోని బృందం ఈ నెల 15న చైనా శిబిరం వద్దకు వెళ్లింది. అక్కడ స్థానిక చైనా బలగాలు కాకుండా కొత్త ముఖాలు ఉన్నట్లు ఆయన గుర్తించారు. పాతవారు సంతోష్‌కు తెలుసు. అదనపు బలగాలను చైనా పంపినట్లు ఆయన గుర్తించారు. అబ్జర్వేషన్‌ పోస్ట్‌, ఇతర గుడారాలను అక్కడ ఏర్పాటు చేయడం అక్రమమని పొరుగు దేశపు కమాండర్‌కు సంతోష్‌ స్పష్టంచేశారు. అయితే చైనా సైనికుడొకరు.. కలగజేసుకొని, ఆయనను బలంగా వెనక్కి తోసేశారు. చైనా భాషలో దుర్భాషలాడాడు.

మన సైనికుల్లో ఆగ్రహం
తమ ‘సీవో సాబ్‌’పై జులుం ప్రదర్శించడంతో భారత సైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చైనా సైనికులపై పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ పోరు దాదాపు అర గంటపాటు సాగింది. ఇరుపక్షాలకు చెందిన అనేక మంది గాయపడ్డారు. అంతిమంగా మన బలగాలదే పైచేయి అయింది. భారత సైనికులు.. చైనా గుడారాలను నేలకూల్చడమే కాకుండా, వాటిని కాల్చి బూడిద చేశారు. గత్యంతరం లేక డ్రాగన్‌ దళాలు వెనుదిరిగాయి.

అయినా వెనకడుగు వేయని తెలుగు వీరుడు
ఈ పోరులో కర్నల్‌ సంతోష్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయినా వెనక్కి వెళ్లేందుకు ఆయన నిరాకరించారు. ఘటనా స్థలంలోనే ఉండిపోయారు. తన బలగాన్ని ముందుండి నడిపించారు. గాయపడిన భారత సైనికులను వెనక్కి పంపారు. అదనపు బలగాలను రప్పించారు. ఘర్షణ కారణంగా అక్కడ తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినా సంతోష్‌ సహనం కోల్పోకుండా ప్రశాంతంగా ఉన్నారు.

అదనపు బలగాలతో చైనా దాడి
కొద్దిసేపటి తర్వాత చైనా సైనికులు పెద్ద సంఖ్యలో అదనపు బలగాలతో అక్కడికి చేరుకున్నాయి. పొడవైన మేకులు కలిగిన ఇనుపకడ్డీలతో మన బలగాలపై దాడి చేశాయి. భారత సైనికులు బాయ్‌నెట్‌లతో వీటిని ఎదుర్కొన్నారు. తమ కన్నా చైనా సైనికులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కర్నల్‌ సంతోష్‌బాబు నాయకత్వంలో భారత బలగాలు భీకర పోరాటం చేశాయి.

రాళ్ల వర్షం
అప్పటికే అక్కడ బాగా చీకటి పడింది. గల్వాన్‌ నది ఒడ్డున, పర్వత పంక్తిపైన మాటు వేసిన చైనా బలగాలు అక్కడికి వచ్చాయి. వస్తూనే భారత సైనికులపై పెద్ద రాళ్లతో దాడి చేశాయి. సంతోష్‌ తలపై ఒక పెద్ద రాయి పడింది. దీంతో ఆయన గల్వాన్‌ నదిలోకి ఒరిగిపోయారు. తమ కమాండింగ్‌ అధికారి నేలకొరగడంతో భారత సైనికులు ఊగిపోయారు. చైనా సైనికులు దాదాపు 350 మంది ఉన్నప్పటికీ, తాము వంద మందే ఉన్నప్పటికీ అదేమీ లెక్కచేయక వారిపై విరుచుకుపడ్డారు. ఇరు దేశాలకు చెందిన అనేక మంది చనిపోయారు. మృతదేహాలు కుప్పలుగా పడ్డాయి. ఈ ఘర్షణలు ఎల్‌ఏసీ వెంబడి మిగతా ప్రాంతాలకూ పాకాయి.

గల్వాన్‌ లోయలో దాదాపు 3 గంటల పాటు పోరు సాగింది. పోరు ఆగేసరికి భారత్‌, చైనాలకు చెందిన అనేక మంది సైనికుల మృతదేహాలు నదిలో ఉన్నాయి. సంతోష్‌ సహా పలువురు భారత జవాన్ల మృతదేహాలను మన సైన్యం వెనక్కి తీసుకెళ్లింది. మిగతా బృందం మాత్రం ఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని సమీక్షించింది. మరుసటి రోజు ఉదయానికి ఉద్రిక్తతలు కొద్దిగా తగ్గాయి. చైనా సైనికుల మృతదేహాలు ఇంకా అక్కడే పడి ఉన్నాయి. వీటిని మన సైనికులు.. పొరుగు దేశానికి అప్పగించారు. సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పీపీ14 వద్ద చైనా శిబిరాన్ని సంతోష్‌ బృందం విజయవంతంగా తొలగించింది.

Last Updated :Jun 22, 2020, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.