Congress: అధికారంలోకి రాగానే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు: మల్లికార్జున ఖర్గే

author img

By

Published : Sep 17, 2021, 7:48 PM IST

Updated : Sep 17, 2021, 8:25 PM IST

mallikarjuna karge

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్​ రాజ్యసభ పక్షనేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో పాల్గొన్నారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. సభలో పార్టీ​ రాజ్యసభ పక్షనేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల్లో నైరాశ్యం నెలకొందన్నారు. ఎస్సీలు, గిరిజనులు వారి హక్కుల సాధన కోసం సన్నద్ధమయ్యారని తెలిపారు. ఎస్సీలు, గిరిజనుల హక్కుల కోసం కాంగ్రెస్‌ బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మోదీజీ, షాజీ 70ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందని ప్రశ్నించారని.. దేశంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ మాత్రమే అంతా చేసినట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Congress: అధికారంలోకి రాగానే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు: మల్లికార్జున ఖర్గే

ఇందిరా గాంధీ వల్లే మెదక్‌కు పరిశ్రమలు

దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అన్నది మర్చిపోయారా? అంటూ మల్లికార్జున ఖర్గే నిలదీశారు. దేశం కోసం కాంగ్రెస్​ నేతలు ఎందరో ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ అని చెప్పారు. ఇందిరా గాంధీ మెదక్‌ నుంచే పోటీ చేసి గెలిచారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ వల్లే మెదక్‌కు అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. ఎస్సీలు, గిరిజనులకు హక్కులు కల్పించిందే గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌ అని అన్నారు. ఎస్సీలు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించిందే కాంగ్రెస్​ అని గుర్తు చేశారు. రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీలు ఉద్యోగాలు పొందారని.. తెలంగాణలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సోనియా గాంధీ దేశం కోసం ప్రధాని పదవిని త్యాగం చేశారని చెప్పారు.

అనేక చట్టలు తీసుకొచ్చాం

మోదీ, కేసీఆర్‌ పాలనలో పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ, కేసీఆర్‌ పాలనలో ధనికులు మరింత ధనవంతులవుతున్నారన్నారు. అందరికీ విద్య అందించాలనే ఉద్దేశం విద్యాహక్కు చట్టం తెచ్చిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. అందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నరేగా చట్టం తీసుకొచ్చామని తెలిపారు. మోదీ, కేసీఆర్‌లకు కనువిప్పు కలిగించేందుకు సెల్‌ఫోన్‌ లైట్లు వెలిగించాలన్నారు.

70 ఏళ్లు కాంగ్రెస్​ ఏం చేసిందని అంటున్నారు. కాంగ్రెస్​ ఏం చేయలేదట.. అంతా మోదీ చేశారట.. రాష్ట్రంలో కేసీఆర్​ చేశారట.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్​.. కాంగ్రెస్​ వాళ్లు జైలుకు వెళ్లారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది మా చరిత్ర. భాజపా చరిత్ర ఏంటి. వాళ్లు దేశ స్వాతంత్య్రం కోసం ఏం చేశారు. వారి ఇళ్లలో ఒక్కరూ చనిపోలేదు. అయినా వాళ్లు దేశభక్తులుగా చెప్పుకుంటారు. తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ, కాంగ్రెస్​ పార్టీ.

-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్​ రాజ్యసభ పక్షనేత

ఇదీ చదవండి: Balakrishna: 'అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించటమే మా లక్ష్యం'

Last Updated :Sep 17, 2021, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.