BANDI SANJAY: 'సంక్షేమ పథకాలపై ఈటీవీ భారత్ వేదికగా తెరాసతో చర్చకు సిద్ధం'

author img

By

Published : Sep 12, 2021, 5:01 AM IST

BANDI SANJAY

రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ఈటీవీ భారత్ వేదికగా చర్చకు సిద్ధమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెరాసకు సవాలు విసిరారు. తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు అనుహ్య స్పందన వస్తోందని తెలిపారు. కాలికి గాయమైనా.. అమ్మవారి దయ.. కార్యకర్తల ఆశీర్వాదం వల్ల ఆరోగ్యం బాగుందన్నారు. ప్రజల సమస్యలు, బాధలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అన్న అనుమానం వస్తోందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక హోద తీసుకురాకపోతే.. కేంద్రం నుంచే తామే ఆ దిశగా చర్యలు చేపడతాం అంటున్న బండి సంజయ్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.

బండి సంజయ్ తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ప్రశ్న: కాలికి గాయం అయినట్టుంది.. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?

జవాబు: కాలికి గాయం అయినా అమ్మవారి దయ, కార్యకర్తల ఆశీర్వాదం వల్ల ఆరోగ్యం బాగుంది. ప్రధాని మోదీ ఆశీర్వాదంతో ప్రజాసంగ్రామ యాత్ర చేయాలని ధృడ సంకల్పం తీసుకున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా యాత్ర కొనసాగిస్తాం.

ప్రశ్న: ప్రజా సంగ్రామ యాత్ర ఎలా సాగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది?

జవాబు: ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు విన్న తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అన్న అనుమానం కలుగుతోంది.

ప్రశ్న: పాదయాత్రలో ప్రధానంగా మీరు గుర్తించిన అంశాలు ఏంటి.

జవాబు: ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య ఉంది ప్రధానంగా రైతులు తీవ్వ ఇబ్బందుల్లో ఉన్నారు. వర్షాలు, వడగండ్ల వల్ల ప్రతి సంవత్సరం నష్టపోతున్నాం అని వారు వాపోతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు అధికారులు వచ్చి సర్వేలు, నివేదికలు అంటూ హడావుడి చేసి.. తర్వాత ముఖం చాటేస్తున్నారు. రుణమాఫీ, సబ్సిడీ విత్తనాలు, ఉచిత ఎరువులు వంటివి లేవు.

ప్రశ్న: ప్రభుత్వ సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక మీరు యాత్ర చేస్తున్నారు అని అధికార పార్టీ అంటోంది. దీనిపై మీ స్పందన.

జవాబు: రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈటీవీ భారత్ వేదికగా తెరాసతో చర్చకు మేము సిద్ధం. కేంద్రం ఇచ్చే నిధులకు పేర్లు మార్చి రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన నిధులతో రెండు పడక గదుల ఇళ్లు, అమృత్ నిధులను మిషన్ భగీరథ, కంపా నిధులతో హరితహారం, స్వచ్ఛభారత్ మిషన్ నిధులతో శౌచాలయాలు.. 14,15 ఫైనాన్స్ నిధులతో వైకుంఠధామాలు, జాతీయ రహదారులు, ప్రధాన మంత్రి సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నాం. ఒక్కో రైతువేదికలకు పది లక్షల రూపాయలు, ఆసుపత్రుల నిర్మాణం కోసం నిధులు ఇస్తున్నాం.

ప్రశ్న: దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అని.. మీకు తెరాసకు చీకటి ఒప్పందాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మీరు ఏమంటారు.

జవాబు: కాంగ్రెస్ పార్టీ దిల్లీలో లేదు, గల్లీలో లేదు. తన ఉనికిని చాటుకోవడానికే మాపై ఆరోపణలు చేస్తోంది. మేము ఎప్పుడూ తెరాసతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెరాస భాజపా ఒక్కటే ఐతే.. దుబ్బాక, హైదరాబాద్, వరంగల్ పురపాలక ఎన్నికల్లో మేము ఎందుకు తెరాస మీద విజయం సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే తెరాసలోకి వెళ్లారు. మా ఎమ్మెల్యేలు పోలే. తెరాస, మేము కలిసి ఎప్పుడు పోటీ చేయలే.

ప్రశ్న: మీ యాత్రకు రాష్ట్ర భాజపా పెద్దల సహకారం లేదన్న ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవం ఎంత?

జవాబు: ప్రజా సంగ్రామ యాత్ర అందరిది. అందరం సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. రోజుకో జాతీయ, రాష్ట్ర నాయకులు అతిథులుగా యాత్రలో పాల్గోంటున్నారు. ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ జరగలేదు.

ప్రశ్న: 17తేది అమిత్ షా వచ్చి.. తెలంగాణకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారు అన్నారు.. ఏంటి అది?

జవాబు: 2023లో రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకువస్తారని తెలంగాణ ప్రజలు, కార్యకర్తల మీద అమిత్ షాకు గట్టి విశ్వాసం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని భాజపా గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ తాను అధికారంలోకి రాగానే విస్మరించాడు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చవటలు, దద్దమ్మలు అంటూ తిట్టాడు. ఎంఐఎం మెప్పు కోసం.. కేవలం తన చరిత్ర ఉండాలన్న దురుద్దేశంతో కేసీఆర్ అధికారికంగా నిర్వహించడం లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజాం సమాధి వద్ద మోకరిల్లి.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేఖంగా పోరాడిన వీరుల అత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. ఇప్పటికైనా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.

ప్రశ్న: కేంద్రంలో అధికారంలో ఉన్న మీరైనా విమోచన దినానికి అధికారిక హోదా తేవచ్చు కదా?.

జవాబు: రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలి. స్పందన లేకపోతే ఆ దిశగా మేము ఆలోచిస్తాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.