బతికున్న మహిళ చనిపోయిందని పొలం రిజిస్ట్రేషన్‌.. తహసీల్దార్‌ సస్పెండ్

author img

By

Published : Sep 22, 2022, 3:32 PM IST

Updated : Sep 22, 2022, 4:01 PM IST

MRO suspended

Tehsildar suspended: సంగారెడ్డి జిల్లాలో మహిళ బతికుండగానే చనిపోయిందని, ఆమె భూమిని బంధువుల పేరు మీదకు మార్చిన రాయికోడ్ తహశీల్దార్‌పై వేటుపడింది. ఈ మేరకు MRO రాజయ్యను కలెక్టర్‌ శరత్‌ సస్పెండ్‌ చేశారు. గతంలో రాయికోడ్‌లో పనిచేసి మెదక్‌ జిల్లాకు వెళ్లిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై క్రమశిక్షణా చర్యలకు కలెక్టర్‌ సిఫారసు చేశారు.

Tehsildar suspended: ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు చేసినా ఎంత కఠినంగా వ్యవహరించినా తమలో మాత్రం మార్పు రాదంటూ మరోసారి నిరూపించారు రెవెన్యూ అధికారులు. వృద్ధురాలు బతికుండగానే ఆమె పేరున ఉన్న భూమిని అక్రమంగా కాజేయాలని వారికి కట్టబెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణ అనంతరం తహసీల్దార్‌పై కలెక్టర్‌ వేటు వేశారు. రాయికోడ్ మండలం నాగన్ పల్లికి చెందిన పట్లోళ్ల హన్మంత్ రెడ్డికి సర్వేనంబర్ 198లో 27ఎకరాల 34 గుంటల భూమి ఉంది. గతేడాది ఆయన చనిపోగా ఈ భూమిని భార్య శివమ్మ పేరిట ఫౌతీ చేయించుకున్నారు. భర్త మరణించటంతో ఆమె హైదరాబాద్​లోని కుమారుల వద్ద ఉంటుండగా శివమ్మ బంధువులు ఆమె భూమిపై కన్నేశారు.

శివమ్మ మరణించిందంటూ ఆ భూమిని తన పేరిట మార్చాలంటూ హన్మంత్ రెడ్డి సోదరి స్లాట్ బుక్ చేసుకుంది. శివమ్మ పేరున ఉన్న భూమి మార్చుకునేందుకు హన్మంత్ రెడ్డి మరణ ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు సమర్పించింది. భర్త మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని బతికున్న భార్య పేరున ఉన్న భూమినంతా తహసీల్దార్ రాజయ్య రెవెన్యూ అధికారులు ఈ నెల10న అంజమ్మ పేరున మార్చేశారు. విషయం తెలుసుకన్న బాధితురాలు సంగారెడ్డి కలెక్టర్​ను ఆశ్రయించి ఆధారాలు సమర్పించింది. అనంతరం అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ రాజయ్యతో పాటు అంజమ్మపై బాధితురాలు శివమ్మ రాయికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు తహసీల్దార్‌ రాజయ్యపై రాయికోడ్‌ పోలీసులు క్రమినల్‌ కేసు నమోదు చేశారు. భూమి మరొకరి పేరున పట్టాచేశారంటూ ముందుగా బాధితురాలు సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌ను ఆశ్రయించగా ఇప్పటికే ఆయన విచారణ జరిపారు. ప్రాథమిక విచారణలో తహసీల్దార్‌ నిర్వాకం బయటపడటంతో రాజయ్యను వెంటనే సస్పెండ్‌ చేశారు. గతంలో రాయికోడ్ R.I.గా పనిచేసిన శ్రీకాంత్‌పై క్రమశిక్షణా చర్యలకు కలెక్టర్‌ సిఫారసు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి కలెక్టర్‌ నివేదిక అందజేశారు.

Last Updated :Sep 22, 2022, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.