సంగారెడ్డి జిల్లా సిరగాపూర్లో రెవెన్యూ శాఖ పనుల నిమిత్తం ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది ప్రభుత్వం. ఆ ఇంటిని తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా మార్చారు. మొదట్లో అధికారులు ఇంటి యజమానికి కిరాయి బాగానే కట్టారు. కానీ కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదు. అంతా కలిపి లక్ష దాటింది. దీంతో ఆందోళన చెందిన ఆ ఇంటి యజమాని.. ఆ భవనానికి తాళం వేశారు. తనకు రావాల్సిన రూ. 1,37,800 అద్దె బకాయి మొత్తం చెల్లించే వరకు తాళాలు తీసేది లేదని ఆయన పట్టుబట్టారు.
యజమాని తాళాలు వేయడంతో అప్పటికే కార్యాలయానికి చేరుకున్న సిబ్బంది, భూ రిజిస్ట్రేషన్లు, ఇతర పనులకు వచ్చిన వారు చేసేదేం లేక బయట కూర్చున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన తహసీల్దార్ రత్నం.. భవన యజమాని నర్సింహులుతో మాట్లాడారు. అద్దె విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని యజమాని ఆవేదన చెందారు. నారాయణ ఖేడ్ ఆర్డీఓ రాజేశ్వర్తో ఫోన్లో మాట్లాడిన అనంతరం.. 15 రోజుల్లో అద్దె మొత్తం చెల్లిస్తామనే హామీ మేరకు యజమాని కార్యాలయం తాళాలు తెరిచారు.
ఇదీ చదవండి: RAITHU BANDHU TO HOUSE LANDS: అక్కడ.. రోడ్లు, ఇళ్లకు రైతుబంధు.!