YS Sharmila Padayatra: నేటినుంచే వైఎస్ షర్మిల 'ప్రజా ప్రస్థానం'.. చేవెళ్ల నుంచే ప్రారంభం

author img

By

Published : Oct 20, 2021, 4:59 AM IST

Updated : Oct 20, 2021, 9:13 AM IST

ys-sharmila-padayatra-starts-from-today-in-telangana

చేవేళ్ల మరో పాదయాత్రకు వేదికైంది. వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఇవాళ ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్రను చేపట్టనున్నారు. శంకర్ పల్లి క్రాస్ రోడ్ వద్ద బహిరంగ సభ నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తారు. అభిమానులు, ప్రజలు ఆదరించాలని షర్మిల కోరారు.

చేవెళ్ల మరో పాదయాత్రకు వేదికైంది. బుధవారం వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. 2003లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే యాత్ర చేపట్టారు. 2012లో షర్మిల ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. 230 రోజులపాటు 116 నియోజకవర్గాల్లో 3,112 కిలోమీటర్లు చుట్టివచ్చారు. వైతెపాను స్థాపించిన ఆమె తాజాగా మరోమారు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం చేవెళ్ల నుంచి ప్రారంభించి 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి.. తిరిగి అక్కడే ముగించనున్నారు. ఈ ఏడాది జులై 8న పార్టీ ఆవిర్భవించగా.. పాదయాత్ర చేపడతామని ఆ రోజే షర్మిల ప్రకటించారు. మరోవైపు నిర్మాణపరంగా ఇతర పార్టీలు జిల్లా స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుంటే... వైతెపా పార్లమెంట్‌ స్థానాలను ఎంచుకుని.., వాటికి కన్వీనర్లు, కోకన్వీనర్లను ప్రకటించింది. ప్రస్తుతం పాదయాత్ర కూడా హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది. తొలిరోజు కార్యక్రమాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు ఆర్‌.కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ, కంచె ఐలయ్యతో పాటు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను వైతెపా ఆహ్వానించింది. మొదటి పది రోజులు చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో యాత్ర సాగనుంది. ఇదే మాదిరి రాష్ట్రంలోని దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రూట్‌మ్యాప్‌ను పార్టీ శ్రేణులు రూపొందించాయి. మొత్తం 26 సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశాయి. అన్ని మండలాల్లోని మున్సిపాలిటీలు, పెద్ద గ్రామాల మీదుగా యాత్ర కొనసాగుతుందని పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి తెలిపారు.

తొలిరోజు ఇలా...

ప్రజాప్రస్థానం పాదయాత్రలో తొలిరోజు చేవెళ్ల.. వికారాబాద్‌ రోడ్డులోని కేజీఆర్‌ గార్డెన్‌ సమీపంలో బహిరంగ సభ జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, వైఎస్‌ అభిమానులను తరలించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ.., అనంతరం 11.30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుంది. వైఎస్‌ విజయమ్మ చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. చేవెళ్ల పట్టణం మీదుగా పాదయాత్ర ప్రారంభించి కందవాడ-నక్కలపల్లి శివారుకు షర్మిల చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. నిత్యం సగటున 12 కి.మీ.లు నడిచేలా షెడ్యూలు రూపొందించినట్లు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి వెల్లడించారు.


ఇదీ చూడండి:

Last Updated :Oct 20, 2021, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.