MINISTER SABITHA: 'పూర్తిగా కొవిడ్​ నిబంధనల నడుమ పాఠశాలల నిర్వహణ'

author img

By

Published : Aug 26, 2021, 9:01 PM IST

MINISTER SABITHA: 'పూర్తిగా కొవిడ్​ నిబంధనల నడుమ పాఠశాలల నిర్వహణ'

పూర్తిగా కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణ ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. చాలా రోజుల తర్వాత పిల్లలు పాఠశాలలకు వస్తున్నందున.. అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సుమారు 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కౌకుంట్లలోని జడ్పీ పాఠశాలలో శానిటేషన్​ పనులను మంత్రి పరిశీలించారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధి కౌకుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వచ్చే నెల 1 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన చేపట్టనుండటంతో శానిటేషన్ పనులను పరిశీలించారు. తరగతి గదులు, మైదానంలో కలియ తిరిగారు. మరుగుదొడ్లను పరిశీలించి.. వెంటనే నీటి సదుపాయం కల్పించాలని సర్పంచ్​ను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో గుంతలు పూడ్చాలని, పారిశుద్ధ్యపై దృష్టి సారించాలని సూచించారు.

ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి
ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి

ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నందున.. అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. తాగు నీరు, విద్యుత్, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం విద్యార్థుల కోసం అత్యాధునికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మంత్రి పరిశీలించారు.

తరగతి గదులను పరిశీలిస్తున్న మంత్రి
తరగతి గదులను పరిశీలిస్తున్న మంత్రి

60 లక్షల మంది రాబోతున్నారు..

పూర్తిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల నిర్వహణ ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించి, చర్చించి, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల పునః ప్రారంభానికి నిర్ణయించారని వివరించారు. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభిస్తున్నామన్న మంత్రి.. సుమారు 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారని అన్నారు.

మరుగుదొడ్ల పరిశీలన
మరుగుదొడ్ల పరిశీలన

ఇదే స్ఫూర్తి కొనసాగాలి..

ఈ సందర్భంగా పాఠశాలల శానిటైజేషన్​కు అన్ని చోట్లా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారని మంత్రి తెలిపారు. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్న సబితా ఇంద్రారెడ్డి.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్​లు పాఠశాలలపై దృష్టి పెట్టాలని కోరారు.

'పాఠశాలల్లో ఏ ఏ పనులు చేశారో ప్రతి రోజూ ఉపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోల ద్వారా రాష్ట్ర అధికారులకు నివేదిక ఇవ్వాలి. సీజనల్​ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జ్వరం వచ్చిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు పంపాలి. అధికారులందరూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ధైర్యం కల్పించాలి. ప్రైవేట్​ పాఠశాలలూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సులను నిత్యం శానిటైజ్​ చేయాలి' అని మంత్రి తెలిపారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంట డీసీఎంఎస్ ఛైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ గాయత్రి గోపాల కృష్ణ, ఉప సర్పంచ్ అబ్దుల్ ఇనాయత్, విద్యా కమిటీ ఛైర్మన్ శివరాం, గ్రామ కార్యదర్శి స్వాతి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.

ఇవీ చూడండి: CM KCR: అంగన్వాడీ కేంద్రాలు సహా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పునఃప్రారంభం

TS schools reopen: 'ఈనెల 30లోపు విద్యాసంస్థలను సిద్ధం చేయాలి'

TS SCHOOLS REOPEN: తరగతి గదిలో వ్యక్తిగత దూరం ఉండదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.