Sircilla Dyeing industry closed 2021 : మూతబడ్డ సిరిసిల్ల అద్దకం పరిశ్రమలు

author img

By

Published : Nov 23, 2021, 8:40 AM IST

Sircilla Dyeing industry closed 2021

Sircilla Dyeing industry closed 2021 : సిరిసిల్లలో నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న అద్దకం పరిశ్రమలు మూతబడ్డాయి. కొన్నిరోజుల నుంచి రంగుల ధరలు పెరగడం వల్ల నష్టం వాటిల్లుతుండటంతో యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 2వేల మంది ఉపాధి కోల్పోయారు. 15వేల మరమగ్గాల కార్మికులపై దీని ప్రభావం పడనుంది.

Sircilla Dyeing industry closed : సిరిసిల్లలో వస్త్ర ప్రపంచానికి రంగులద్దే కీలకమైన అద్దకం పరిశ్రమ సోమవారం మూతబడింది. ఈ రంగంలో నష్టాలు కొనసాగుతుండటంతో పరిశ్రమల యజమానులు మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో 300 వరకు అద్దకం పరిశ్రమలు ఉండేవి. కాలానుగుణంగా అవి 60కి పడిపోయాయి. మూడు నెలల నుంచి రంగుల ధరలు పెరిగిపోయి పూర్తిగా నష్టం వాటిల్లుతుండడంతో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను కూడా సోమవారం నుంచి మూసివేశారు. దీంతో ప్రత్యక్షంగా 2 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అలాగే సుమారు 15 వేల మంది మరమగ్గాల, పెట్టికోట్స్‌ కుట్టే, సైజింగ్‌ కార్మికులపై తీవ్ర ప్రభావం పడనుంది.

fabric dye price hike 2021 : అద్దకం పరిశ్రమకు సంబంధించిన రంగుల ధరలు రూ.500 నుంచి రూ. 800లకు పెరిగాయి. రూ.2 వేలు ఉన్న రంగు ధర రూ.4,500లకు చేరుకుంది. రూ.200 ఉన్న రంగు ధర రూ.350కి చేరుకుంది. దీంతో రంగులద్దిన వస్త్రానికి మీటరుకు రూ.6.25 ఖర్చవుతుండగా వస్త్ర వ్యాపారులు రూ.4.25 చెల్లిస్తున్నారు. దీంతో తమపై మీటరుకు రూ.2ల భారం పడుతోందని అద్దకం పరిశ్రమ యజమానులు పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుంచి బయటకు రావడానికి వస్త్ర వ్యాపారులను ధరలు పెంచాలని కోరినప్పటికీ తామూ నష్టాల్లో ఉన్నామని, నూలు ధర విపరీతంగా పెరిగిందని, ప్రస్తుతం ధర పెంచే పరిస్థితిలో లేమని వారు తేల్చి చెప్పారు. దీంతో గత్యంతరం లేక అద్దకం పరిశ్రమలను పూర్తిగా మూసివేశారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Telangana Weavers news : మరోవైపు.. ఎన్నో ప్రతికూలతలు, కరోనా వంటి విపత్తులు.. చేనేత కార్మికుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఆ వత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న వారిని మరో ఉపాధి వెతుక్కునే పరిస్థితులు కల్పిస్తున్నాయి. చేతి కష్టంతో పనిచేసే నేతన్నలను ఆధునికత దిశగా మళ్ళించే ప్రయత్నాలు జరగడంలేదు. మరోవైపు జౌళి రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. సాంకేతికత పెంపు (టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌), నైపుణ్య శిక్షణ, డిజైన్‌లు అన్నీ జౌళికే పరిమితమవుతున్నాయి. చేనేత రంగంలో కొత్త మగ్గాలు పెద్దగా రావడం లేదు. ఆసు యంత్రాలు కొత్తగా వచ్చినా వాటి ఉత్పత్తి పెరగకపోవడం, చేనేత కార్మికులకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. తెలంగాణలో ఇప్పటికే 16 వేల మంది, ఏపీలో 29 వేల మంది కార్మికులు చేనేత నుంచి మరమగ్గాల రంగంలోకి మారారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.