malkapeta pump house: మునకలోనే మల్కపేట రిజర్వాయర్ సొరంగం

author img

By

Published : Oct 1, 2021, 9:00 AM IST

kaleswaram

భారీ వర్షాలకు మునిగిన కాళేశ్వరం 9వ ప్యాకేజీ సొరంగం, పంపుహౌస్‌లో నీటిని తోడుతున్నా సీపేజీ (లీకేజ్‌ నీరు) తగ్గడం లేదు. సిరిసిల్ల పట్టణ(rajanna sircilla) శివారు రగుడు నుంచి మల్కపేట జలాశయం వరకు(malkapeta pump house) 9 పంపులతో నీటిని నిరంతరాయంగా ఎత్తిపోస్తున్నారు.

రాజన్న సిరిసిల్లలోని రగుడు నుంచి మల్కపేట జలాశయం వరకు (malkapeta pump house) లీకేజ్​ నీటి ఎత్తిపోత పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం (kaleswaram project) 9వ ప్యాకేజీ సొరంగం, పంపుహౌస్‌లో నీటిని తోడుతున్నా సీపేజీ (లీకేజ్‌ నీరు) తగ్గడం లేదు. చెన్నైకి చెందిన సంస్థ ద్వారా ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు సెప్టెంబరు 14న ప్రత్యేకంగా మోటార్లు తెప్పించారు. వాస్తవానికి పది రోజుల్లో నీరు ఖాళీ చేయాల్సి ఉంది. గత సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు సొరంగ మార్గం, పంపుహౌస్‌లో సీపేజీ పెరిగింది. ఎంత తోడినా.. నీరు తరగడం లేదు. రగుడు నుంచి మల్కపేట వరకు సొరంగ మార్గం పైభాగంలోని చెరువులు, కుంటల్లోకి వరద పోటెత్తింది. ఈ నీటి ప్రవాహం అదుపులోకి వస్తేగానీ సొరంగంలోకి సీపేజీ తగ్గదు. ప్రవాహం తగ్గిన తరవాతే సొరంగంలో సిమెంటు లైనింగ్‌ పూర్తి చేసి.. పంపుహౌస్‌లో మోటార్లు బిగింపు ప్రక్రియను ప్రారంభించొచ్చు. గత 24 రోజులుగా పనులు చేస్తున్నా.. సామగ్రి మొత్తం నీటిలోనే ఉండిపోయింది. మరోవైపు డిసెంబరు నాటికి మల్కపేట జలాశయంలోకి ట్రయల్‌ రన్‌ చేసే ప్రణాళికతో అధికారులు ఉన్నారు.

అప్రోచ్‌ కాల్వకు గండి కొట్టి...

ఎగువ నుంచి వస్తున్న వరదతో రాజరాజేశ్వర జలాశయం నిండుకుండలా మారింది. జలాశయం వెనక జలాలు కరకట్టను దాటి సిరిసిల్ల పట్టణానికి చేరువగా వచ్చాయి. సిరిసిల్ల నుంచి వస్తున్న వరదను మానేరు వాగులోకి మళ్లించేందుకు అధికారులు 9వ ప్యాకేజీ అప్రోచ్‌ కాల్వ కట్టకు గండి కొట్టారు. హెడ్‌ రెగ్యులేటర్ల సమీపంలోని కొత్తకుంటకు గండి పడటంతో వరద నీరు కరకట్ట సమీపంలోకి చేరుతోంది. ఈ ప్రక్రియ 15 రోజులుగా కొనసాగుతున్నా నీరు తగ్గడంలేదు. మరోవైపు సొరంగంలోకి జలాలు చేరకుండా కట్టకు ఇరువైపులా రాతితెట్టును నిర్మిస్తున్నారు. నీటిని తోడే ప్రక్రియ పూర్తయితేనే సొరంగం, పంపుహౌస్‌లో ఎంతమేరకు సామగ్రి ఉంది, విడిభాగాలకు నష్టం జరిగిందా అన్న వివరాలు తెలుస్తాయి. అప్పటి వరకు ఏమీ చెప్పలేమని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

2019 సెప్టెంబరులోనూ ఇదే తీరులో మునక

మల్కపేట పంపుహౌస్‌కు మధ్య మానేరు(రాజరాజేశ్వర) జలాశయం వెనుక జలాలు వచ్చే విధంగా సొరంగం తవ్వారు. లైనింగ్‌ పనులు నడుస్తూండటంతో సొరంగంలోకి వెళ్లేందుకు అక్కడక్కడ దారులు ఏర్పాటు చేశారు. ఇటీవల మానేరు పరీవాహక ప్రాంతంలో ఒక్కసారిగా 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో సిరిసిల్ల, కోనరావుపేట మండలాల్లోని గొలుసు కట్టు చెరువులు పూర్తిగా నిండాయి. పర్రెలకుంట కట్ట తెగిపోయింది. సిరిసిల్ల ఎగువన ఉన్న జంగమయ్య కుంట, పెద్దచెరువు, శుద్ధికుంట, కొత్త చెరువులు నిండటంతోపాటు పట్టణాన్ని చుట్టు ముట్టిన నీరు సొరంగ మార్గాల ద్వారా లోనికి ప్రవేశించింది. వాస్తవానికి ఈ నీరంతా మానేరులోకి వెళ్లాలి. రాజరాజేశ్వర జలాశయం వెనుక జలాలు సిరిసిల్లలోకి రాకుండా కరకట్ట నిర్మించారు. వరదకు ఈ కట్ట అడ్డుగా రావడంతో సొరంగంవైపు మళ్లింది. దీంతో సొరంగంతోపాటు భూగర్భంలో ఉన్న పంపుహౌస్‌ మునిగిపోయింది. 2019 సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు కూడా ఇదే తీరులో మునకేసింది. సొరంగం పనులు, సిమెంటు లైనింగ్‌ పనులు పూర్తికాకపోవడంతో సీపేజీ నీళ్లు కూడా వచ్చి చేరాయి. అప్పుడు కూడా భారీ మోటార్లు ఏర్పాటు చేసి నెల రోజులపాటు నీటిని తోడారు.

ఇదీ చూడండి: PUMP HOUSE: వరదలో మొన్న సారంగపూర్... నేడు మల్కపేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.