KTR review on crop rotation: 'అక్కడో పదిహేనెకరాలు తీసుకుని ఆయిల్​పామ్​ సాగుచేస్తా'

author img

By

Published : Sep 20, 2021, 10:55 PM IST

ktr review

రాష్ట్రం మరింత స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా (KTR review on crop rotation) రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 2021-22 యాసంగి పంటల మార్పిడిపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని (KTR review meeting with sircilla agriculture officers) నిర్వహించారు.

సిరిసిల్ల జిల్లా మోహినికుంట గ్రామంలో పదిహేను ఎకరాల స్థలం తీసుకుని తాను కూడా స్వయంగా ఆయిల్​పామ్ పంటను సాగు చేస్తానని మంత్రి కేటీఆర్​ అన్నారు. జిల్లాలోని (sirscilla) సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో యాసంగి పంటల మార్పిడిపై జిల్లా అధికారులతో సమీక్షించారు ( KTR review on crop rotation). వ్యవసాయ విస్తరణ అధికారులు... ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండాలని మంత్రి సూచించారు. పంటమార్పిడి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా కలిగే లాభాలను రైతులకు తెలియజేయడం, తదితర అంశాలపై మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టండి

రైతుబిడ్డగా, సీఎం కేసీఆర్​కు రైతుల సమస్యల గురించి అవగాహన ఉంది కాబట్టే వారికి రైతులకు ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని.. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు చాలా లాభసాటిగా ఉంటుందని తెలిపారు. తక్కువ పనితో ఎక్కువ ఫలితం పొందడం ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారానే సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యాన్ని పండించడంలో తెలంగాణ రాష్ట్రం... దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. గతేడాది యాసంగిలో ప్రతి ఊరిలోను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యంను కొనుగోలు చేయమని తేల్చి చెప్పిందని... వచ్చే యాసంగి పంట కాలంలో వరి పంట కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సాహించాలని సూచించారు.

నాటు వెలవెల.. నేడు జలకళ

ఒకప్పుడు కరవు ప్రాంతమైన సిరిసిల్లలో... ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయన్నారు. ఎగువ మానేరు, అన్నపూర్ణ, రాజరాజేశ్వర జలాశయాల ద్వారా జిల్లాలో భూగర్భ జలాల సామర్థ్యం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. మల్కపేట జలాశయం నిర్మాణం పూర్తయితే భూగర్భ జలాలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలో మొత్తం 666 చెరువులు ఉన్నాయని... వాటిలో 85 శాతం చెరువులు ఎప్పటికీ నిండి ఉండేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

ఆయిల్​పామ్​ పంటతో అధిక లాభాలు

ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చని మంత్రి అన్నారు. జిల్లాలోని 57 క్లస్టర్​ల పరిధిలో సగటున వంద ఎకరాల ఆయిల్​పామ్ పంట సాగు చేసేలా ప్రతీ వ్యవసాయ విస్తరణ అధికారి రైతులను ప్రోత్సహించాలని, రైతు వేదికల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్ మాదిరిగా జిల్లాలో మరో 5 కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

క్యూఆర్​కోడ్​ పోస్టర్​ రిలీజ్​

ktr review
క్యూఆర్​కోడ్​ పోస్టర్​ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్​

సిరిసిల్ల మున్సిపల్ అధికారులు రూపొందించిన క్యూ ఆర్ కోడ్ పోస్టర్​ను జడ్పీఛైర్​పర్సన్ అరుణ, కొండూరు రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఇతర అధికారులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. సిరిసిల్ల పట్టణంలో ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాలు, పబ్లిక్ టాయిలెట్స్, బస్టాండ్ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ బార్​కోడ్​ను స్కాన్ చేసి గాని, వాట్సాప్ నంబర్ 9100069040 ద్వారా గానీ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని తెలిపారు. తద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదని, కేవలం అంతర్జాలంలో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా సమస్యకు సత్వర పరిష్కారం పొందొచ్చని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: White challenge issue: న్యాయస్థానంలో పరువునష్టం దావా దాఖలు చేశా: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.