RAINS IN TELANGANA: రాష్ట్రంలో వరుణ ప్రతాపం.. వరద నీటితో ప్రజల పాట్లు

author img

By

Published : Sep 7, 2021, 2:45 PM IST

RAINS IN TELANGANA

రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలకు.. వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల పైవంతెన నుంచి వరద పారుతుండడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని జిల్లాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. పలు జిల్లాల్లో చెరువులు అలుగు పారుతుండగా.. ఆయా చోట్ల రాకపోకలకు స్తంభించాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సిరిసిల్ల పట్టణంలోని ప్రగతి నగర్, పాత బస్టాండ్, సాయినగర్, అంబికానగర్​ తదితర కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఫలితంగా జన జీవనం స్తంభించి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత బస్టాండ్, కొత్తచెరువు ప్రాంతాల్లో భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరింది. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. సిరిసిల్లలోని వెంకంపేట, ప్రగతినగర్, సాయినగర్ సహా ఇతర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు పట్టణంలోని పలు కాలనీల్లోకి ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ప్రత్యేక కంట్రోల్​ రూం..

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. కొత్త చెరువు మత్తడి దూకడంతో సిరిసిల్ల - కరీంనగర్ రహదారిలోని దుకాణాల్లోకి నీళ్లు చేరాయి. భవనాల సెల్లార్లలో భారీగా నీరు చేరి.. దుకాణాలు తెరచుకోలేని పరిస్థితి నెలకొంది. కాళేశ్వరం 9వ ప్యాకేజీ సొరంగంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. అందులోని సామగ్రి పూర్తిగా నీట మునిగాయి. 111 చెరువులు, కుంటలు వరద నీటితో మత్తడి దూకుతున్నాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటుచేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు. జిల్లాలో వర్షాల కారణంగా ఆస్తి, పంట నష్టాల వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం కోసం 9398684240 ఫోన్ నెంబర్​ను సంప్రదించాలని పేర్కొన్నారు.

హనుమకొండ- ములుగు మధ్య రాకపోకలకు అంతరాయం..

రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. ఇళ్లలోని నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువులు, జలాశయాలు నిండి మత్తడి పోస్తున్నాయి. హనుమకొండలో భారీ వర్షాలతో కాలనీలు జలమయమయ్యాయి. కటాక్షాపూర్ చెరువు మత్తడి పోస్తుండటంతో హనుమకొండ-ములుగు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

రంగంలోకి డిజాస్టర్ టీం..

కాశీబుగ్గలోని మధురానగర్ లక్ష్మి గణపతి కాలనీ వివేకానంద కాలనీలు నీటమునగగా.. హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్​ బృందావన కాలనీలో ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లలో చిక్కుకుపోయిన వృద్ధులను వరంగల్ మహానగర పాలక సంస్థ డిజాస్టర్ టీం సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖిలా వరంగల్ రాతికోట సమీపంలోని అగర్తల చెరువు మత్తడి పోయడం వల్ల శివనగర్ మైసయ్య నగర్ కాలనీలోకి వరదనీరు చేరింది. ఉర్సు రంగసముద్రంతో పాటు భద్రకాళి జలాశయం అలుగు పారడంతో దిగువన ఉన్న కాపువాడ కాలనీ రహదారులపై వరద నీరు ప్రవహిస్తుంది. కాలనీలు నీటమునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికులను బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నీట మునిగిన విద్యుత్​ సబ్​ స్టేషన్​..

నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి హనుమకొండ జిల్లా కేంద్రంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ వంద అడుగుల రోడ్డుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అమరావతి నగర్‌ కాలనీలోకి వరద నీరు భారీగా చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాల్​పూర్, సమ్మయ్యనగర్, ద్వారక కాలనీ, ఎన్జీవో కాలనీ, గోకుల్​ నగర్ తదితర కాలనీలో వరద నీరు వచ్చి చేరింది. వడ్డెపల్లి చెరువు నిండి పోయి ఆ నీరంతా హనుమకొండలోని నాలాల గుండా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోపాల్‌పూర్ విద్యుత్ సబ్​స్టేషన్ నీట మునగడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

వరదలో చిక్కుకున్న లారీ..

పంతిని చెరువు అలుగు పారడంతో... వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారి జలమయం అయింది. నాలుగు అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ఖమ్మం వైపు వెళ్తున్న ఓ లారీ వరదలో చిక్కుకుంది. లారీని తొలగించేందుకు పోలీసులు, గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు. ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడం వల్ల జాతీయ రహదారిపై హనుమకొండ జిల్లా నుంచి ములుగు జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.

పంట చేనులోకి చేపలు..

జోరు వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా తడిసి ముద్దయింది. భారీగా కురుస్తున్న వర్షానికి చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు పంట చేనుల్లోకి చేరి భారీగా నష్టం వాటిల్లింది. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరదతో పాటు చేనులోకి చేపలు రాగా.. గ్రామస్థులు వలలతో పడుతున్నారు.

దుకాణ సముదాయాల్లోకి వరద..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వానపడింది. భారీ వర్షం కారణంగా హుస్నాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, ప్రధాన కూడళ్లు.. అంబేడ్కర్​ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా వరద నీటితో నిండిపోయింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న దుకాణ సముదాయాల్లోకి వరద నీరు చేరింది.

నీటమునిగిన ఆలయం..

నిర్మల్ జిల్లా ముథోల్​ నియోజకవర్గంలో నిన్న సాయంత్రం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నియోజకవర్గంలో అక్కడక్కడ పంటలు నీటమునిగాయి. భైంసా గడ్డెన వాగు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 40,708 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సుద్దవాగులోకి విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.7 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 358.5 అడుగులుగా ఉంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 38,150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విట్టలేశ్వర ఆలయం నీట మునిగాయి.

కుంటాలలో అత్యధిక వర్షపాతం..

నిర్మల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో జిల్లాలో 109 మి.మీ వర్షపాతం నమోదైంది. కుంటాల మండలంలో అత్యధికంగా 172 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా ఖానాపూర్​లో 47.2 మి.మీ రికార్డు అయింది. మరో రెండు రోజులపాటు జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

దంచి కొడుతున్న వానలు..

జగిత్యాల జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. జగిత్యాల గ్రామీణ మండలం అనంతారం వాగు వంతెనపైనుంచి వరద పారడం వల్ల నిన్న రాత్రి నుంచి జగిత్యాల-ధర్మపురి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రాయికల్‌-మైతాపూర్‌ వంతెనపై వరద ప్రవాహంతో రాయికల్‌-మైతాపూర్‌ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. మల్యాలలో పోచమ్మవాడలోని పల్లె ప్రకృతి వనం నీట మునిగింది. మెట్‌పల్లిలోని పెద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోరుట్లలో పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. సారంగపూర్‌ మండలం పెంబట్ల వంతెనపై నీటి ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

తప్పిన ప్రమాదం..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు పలు కాలనీల్లో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ఫలితంగా ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. సాయిబాబా కాలనీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాత ఇళ్లు కూలిపోయిది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం..

గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ఏరియాలోని ఉపరితల గనుల్లో 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. వరద నీరు గనుల్లోకి భారీగా చేరడంతో యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మట్టి వెలికితీత పనులు సైతం ఆగిపోయాయి.

నీట మునిగిన రైల్వే ట్రాక్​..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో తడికలపూడి రైల్వే స్టేషన్​లో ట్రాక్​ జలమయమైంది. పూర్తిగా నీటితో నిండిపోవడం వల్ల రైల్వే సిబ్బంది.. నీరు నిలిచిన ప్రాంతాలను పరీశీలన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బొగ్గు రవాణా ఈ మార్గం ద్వారానే ప్రధానంగా సాగుతుంది. కొత్తగూడెం నుంచి డోర్నకల్ వరకు వచ్చే పలు రైళ్లు ఈ మార్గం గుండానే వెళ్తాయి.

నీటిలో తేలియాడిన కార్లు..

సోమవారం నుంచి కరీంనగర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. మురుగు కాలువల నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో.. వర్షపు నీరు రహదారులపై ప్రవహిస్తోంది. ఆర్టీసీ వర్క్‌షాప్ నుంచి రేకుర్తి వరకు మధ్య ఉన్న రహదారి పూర్తిగా నీటితో నిండిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సూర్య నగర్ కాలనీ పూర్తిగా నీటిమయమైంది. ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. కార్లు నీటిలో తేలియాడుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు వేరే మార్గం నుంచి మళ్లిస్తున్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు నిర్మించకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరీక్షలు వాయిదా..

కరీంనగర్-జగిత్యాల వెళ్లే రహదారిలో వీ పార్క్‌ హోటల్‌ వద్ద రహదారి నీట మునిగింది. విద్యానగర్‌, జ్యోతినగర్‌, సూర్యనగర్ నుంచి వస్తున్న వర్షపు నీరంతా రోడ్డుపైకి చేరడంతో కరీంనగర్‌- జగిత్యాల రహదారి చెరువును తలపిస్తోంది. రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో శాతవాహన వర్సిటీ పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఇవాళ కరీంనగర్ జిల్లాలో పాఠశాలలకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ సెలవు ప్రకటించారు. ఎడతెరిపిలేని వానతో హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్‌ మండలాలు తడిసి ముద్దయ్యాయి. వాగులు, చెరువులు నిండిపోయి అలుగు పడుతున్నాయి. జమ్మికుంట మున్సిపాలిటీలో హౌసింగ్‌ బోర్డు కాలనీ, శిశుమందిర్‌కాలనీ, అంబేడ్కర్‌ నగర్‌ కాలనీలో నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరి స్థానికులు అవస్థలు పడుతున్నారు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.