తెలంగాణలో 2023లో అధికారం చేపట్టేది భాజపా ప్రభుత్వమేనని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో ప్రజల్లో చైతన్యం వస్తోందని తెలిపారు. మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తనకు పాదయాత్ర చేసిన అనుభవం ఉందని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంకిరెడ్డిపల్లిలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర పశుసంవర్ధక పురుషోత్తం ధీమా వ్యక్తం చేశారు.
బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ద్వారా తెలంగాణ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తాను కూడా 1998లో గుజరాత్లోని తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసినట్లు తెలిపారు. పాదయాత్ర చేసిన అనుభవం తనకు కూడా ఉందని చెప్పారు. బండి సంజయ్ కలను నెరవేర్చేందుకు ఆయనతో పాటు రాత్రి, పగలు శ్రమిస్తున్న కార్యకర్తలను అభినందించారు. ఆయన వెంట నడుస్తున్న కార్యకర్తలంతా బండి సంజయ్ నిద్రించిన తర్వాతే పడుకుంటున్నారని.. ఆయనకంటే ముందే నిద్ర లేస్తున్నారన్నారని ప్రశంసించారు.
దేశప్రజలు ప్రధాని మోదీని ఎలా ఆశీర్వదిస్తున్నారో.. అలానే సంజయ్కి తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఎండ, వానలు లెక్కచేయకుండా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని కొనియాడారు. ఆయన పట్టుదల చూస్తుంటే తనకు చాలా ఆనందం వేస్తోందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో కోట్ల మంది ప్రజలకు కరోనా వాక్సిన్ ఇచ్చామన్నారు. ఈ దెబ్బతో మోదీని విమర్శించిన వాళ్లందరి నోళ్లు మూసుకు పోయాయన్నారు. ఒక్కరోజులో 2 కోట్లకు పైగా మందికి వాక్సిన్ వేసిన ఘనత మనదేనని ప్రశంసించారు. తెలంగాణ ప్రజలు బండి సంజయ్కి సంపూర్ణ మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: BANDI SANJAY: 'అక్టోబర్ 2 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు కోసం ఆందోళనలు'