Drunk Police: పూటుగా తాగి రోడ్డుపైనే పడుకున్న ఏఎస్సై.. ఆటోలో ఇంటికి పంపించిన స్థానికులు

author img

By

Published : Sep 8, 2021, 4:11 PM IST

sulthanabad asi nagayya drink and slept at road side

ఒళ్లు తెలియకుండా తాగి.. ఎక్కడపడితే అక్కడే పడుకునే వాళ్లను రోడ్ల వెంట తరచూ చూస్తుంటాం. అలాంటివాళ్లను అదుపులో పెట్టేందుకు పోలీసులు అప్పడప్పుడు లాఠీలకు సైతం పని చెప్తుంటారు. మరి అదే స్థానంలో ఓ పోలీసే ఉంటే..! అవును మీరు విన్నది నిజమే. ఏఎస్సై హోదాలో ఉన్న ఓ పోలీస్​.. మద్యం మత్తులో ఒళ్లు తెలియకుండా రోడ్డుపైనే పడుకొని కనిపించటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పూటుగా తాగి రోడ్డుపైనే పడుకున్న ఏఎస్సై.. ఆటోలో ఇంటికి పంపించిన స్థానికులు

ప్రజలను రక్షించాల్సిన పోలీసులు మద్యం మత్తులో తూలుతూ.. రోడ్డుపైనే పడుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. తాగిన వ్యక్తులను అదుపులో పెట్టాల్సిన బాధ్యత మరిచి... ఏఎస్​ఐ నాగయ్య మద్యం మత్తులో కనిపించాడు. రాత్రి 10 గంటల సమయంలో ఒళ్లు తెలియకుండా రోడ్డుపైనే పడుకున్నాడు. గమనించిన స్థానికులు ఆటోలో... కరీంనగర్​లోని ఆయన ఇంటికి తరలించారు.

విధుల్లో ఉన్న సమయంలోనూ మద్యం తాగుతూ ఉంటాడని నాగయ్యపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మద్యం సేవించాలి కానీ.. ఇలా ఒళ్లు తెలియకుండా తాగి రోడ్డుపై పడుకోవడం వల్ల... డిపార్ట్​మెంట్​ పరువు ఏమవుతోందని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. పోలీసులే ఇలా చేస్తే.. ఇక పక్తు తాగుబోతుల పరిస్థితి ఏంటని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఏది ఏమైనా మద్యం మత్తులో ఏఎస్ఐ రోడ్డుపై పడుకున్న ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సామాన్యుడు మద్యం మత్తులో ఉంటే లాఠీలు ఝళిపించే పోలీసులు.. ఇప్పుడు ఓ పోలీసు అధికారి ఇలా చేయడంపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

ఇదీ చూడండి: నటి ఇంట్లో చోరీ.. గొంతుపై కత్తిపెట్టి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.