Nizamabad Family Suicide Case: సురేశ్​ కుటుంబం ఆత్మహత్య కేసులో విచారణ ప్రారంభం

author img

By

Published : Jan 12, 2022, 5:09 AM IST

Nizamabad

Nizamabad Family Suicide Case: వడ్డీ వ్యాపారుల వేధింపులతో సురేశ్​ కుటుంబం ఆత్మహత్య కేసులో విచారణ ప్రారంభమైంది. విజయవాడ నుంచి నిజామాబాద్‌కు వచ్చిన పోలీసులు... రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. సురేశ్​ ఇంటిని పరిశీలించి సీసీటీవీ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మృతుల కుటుంబాలకు చెందిన వ్యాపార ప్రాంతాలు, అప్పులిచ్చిన వారిని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని విచారణ చేస్తున్న పోలీసులు అంటున్నా... ఓ బృందం నిర్మల్‌కు వెళ్లి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిజామాబాద్‌లో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Nizamabad Family Suicide Case: నాలుగురోజుల క్రితం విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేశ్​ కుటుంబం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. సురేశ్​ రాసిన మరణ వాంగ్మూలం, సెల్ఫీ వీడియో ఆధారంగా నిర్మల్​కు చెందిన వినీత, చంద్రశేఖర్, నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేశ్వర్, గణేశ్‌లపై 306సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ ఒకటో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిజామాబాద్‌కు వచ్చిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్-2లోని శ్రీచైతన్య అపార్ట్మెంట్‌లో సురేశ్​ కుటుంబం నివాసముండే 207 నంబర్ గల ఇంటిని పరిశీలించారు. అక్కడున్న ఆపార్ట్మెంట్ సిబ్బందిని, అందులో నివాసముండే వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అప్పులు చెల్లించాలంటూ సురేశ్​ ఇంటికి వచ్చిన అందరినీ సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారిస్తామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

అరెస్ట్ చేసే అవకాశం...

ప్రాథమిక విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. అపార్ట్‌మెంట్‌ సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా సురేశ్​ ఇంటికి వచ్చి అప్పుల కోసం వేధించిన వారి జాబితాను సిద్ధం చేసి విచారించనున్నారు. అలాగే సెల్ఫీ వీడియోలో చెప్పిన వ్యక్తులను విచారిస్తారు. సురేశ్​ కుటుంబం నిర్వహించే వ్యాపార ప్రాంతాల్లోనూ విచారణ చేయనున్నారు. వ్యాపార భాగస్వాములు, కుటుంబీకులు, బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్న తర్వాత నిందితులను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. సెల్ఫీ వీడియోలో పేర్లు చెప్పినప్పటికీ అది నిజమని నిర్ధరణ అయిన తర్వాతనే తదుపరి చర్యలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

విచారణ ముమ్మరం...

స్థానిక పోలీసుల సహకారంతో విజయవాడ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సీఐ వెంకటేశ్వర్లు బృందం నిజామాబాద్‌లో, ఎస్సై శంకర్ బృందం నిర్మల్‌లో విచారణ చేస్తోంది. నిర్మల్‌కు వెళ్లిన బృందం వినీత, చంద్రశేఖర్​లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం సమయంలోనే వీరిని అరెస్టు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజామాబాద్‌కు చెందిన మరో ఇద్దరు నిందితులు గణేశ్​, జ్ఞానేశ్వర్‌లను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం సాగుతోంది.

సంబంధిత కథనాలు :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.