BJP: భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాం

author img

By

Published : Sep 17, 2021, 8:51 PM IST

Amith Sha

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్​ రాష్ట్ర స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుకుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. సర్దార్​ వల్లాభాయ్​ పటేల్​ పరాక్రమం వల్లే ప్రజలు స్వాతంత్య్రం పొందారని చెప్పారు. నిర్మల్‌లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్నారు.

భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు. కర్ణాటకలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు. విమోచన దినోత్సవం జరిపేందుకు కేసీఆర్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్‌కు పట్టవా అంటూ నిలదీశారు. మజ్లిస్‌కు భాజపా భయపడదని స్పష్టం చేశారు.

మజ్లీస్​ అడ్డుపడుతోంది

రాష్ట్రంలో నియంత పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్​లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి.. తెరాస, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోనీయకుండా మజ్లీస్​ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడే కాకుండా.. ఇప్పుడు కూడా తెరాస ప్రభుత్వాన్ని కూడా ఆపేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ గడ్డ మీద విమోచన దినోత్సవాలు ఎందుకు జరుపుకోనివ్వరని... సీఎం కేసీఆర్​ను ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపనందుకు సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో విమోచన ఉత్సవాలు జరపాలని కేసీఆర్ డిమాండ్ చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు. నిర్మల్​లో భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సభ నిర్వహించారు. సభలో కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

సర్దార్‌ పటేల్‌ లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేది

విమోచన వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిపేందుకే నిర్మల్​లో సభ నిర్వహించినట్లు బండి సంజయ్ అన్నారు. విమోచన ఉద్యమంలో నిర్మల్‌ గడ్డపై వెయ్యి మందిని ఉరితీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన వీరులు పైనుంచి చూస్తున్నారని పేర్కొన్న ఆయన.. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడతామని స్పష్టం చేశారు. సర్దార్‌ పటేల్‌ లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆయనే లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని.. కేసీఆర్ సీఎం అయ్యేవారు కారని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్​కు భాజపా జయధ్వానాలు వినిపించాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన ఘనత అమిత్‌ షాకే దక్కుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ షురూ.. 2-10 ఏళ్ల వారికి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.