నారాయణపేట జిల్లా ధన్వాడలోని భారత్ పెట్రోలియం బంకును డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ మూసివేయించారు. పెట్రోల్, డీజిల్ను తక్కువగా పోస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయని అందుకే తాత్కాలికంగా బంకును మూసేస్తున్నట్లు తెలిపారు. కొందరు రైతులు డీజిల్ను డబ్బాల్లో తీసుకెళ్తుండగా... ఎన్ని లీటర్లు పోస్తున్నారన్న విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇదే అదనుగా భావించి బంకు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని రఘునందన్ పేర్కొన్నారు. వినియోగదారులు మోసపోతున్నారని అన్నారు.
తూనికలు కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణలో బుధవారం సమగ్ర విచారణ జరుపుతామని డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. వినియోగదారులను మోసం చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్సీ!!