BHEEMA BARAGE: కర్నాటకలోని భీమా నదిపై ఉన జొలదడిగి-గూడురు బ్యారేజీ ఎత్తును పెంచి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోంది. ప్రస్తుతం ఉన్న పాత బ్యారేజీ దిగువన కొత్తగా ఎత్తు పెంచి మరో బ్యారేజీని నిర్మిస్తోంది. దీంతో తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలం పరిధిలోని నది పరివాహాక ప్రాంతాలైన తంగిడిగి, కుసుమూర్తి, సుగురులింగంపల్లి, చేకుంట, అయినాపురం, గురిజాల గ్రామాల్లో పొలాలకు చుక్కనీరు కూడా అందని పరిస్థితి తలెత్తునుంది. రాష్ట్రంలో ఏడు కిలోమీటర్ల మేర ప్రవహించి ఈ నది ఏడారిగా మారే అవకాశం ఉంది.
కర్నాటకలోని యాదిగిరి జిల్లా సైదాపూర్ తాలుకా పరిధిలోని భీమా నదిపై జొలదడిగి-గూడూరు బ్యారేజీని 2002 సంవత్సరంలో ప్రారంభించి 2003లో పూర్తి చేశారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి అప్పట్లో రూ.24కోట్లను ఖర్చు చేశారు. 1.29 టీఎంసీల నీటిని వాడుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బ్యారేజీ కింద 1,960 హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో స్థానిక రైతులు తమ సొంత మోటార్ల ద్వారా నీటిని తోడుకోని వ్యవసాయానికి తరలిస్తారు. మొత్తం 550మీటర్ల దూరంలో 176 చిన్నగేట్ల ద్వారా ఏర్పాటు చేశారు. ఈ బీమా నది ఈ బ్యారేజీ వద్ద నుంచి మన రాష్ట్రంలో పరిధిలో ఏడు కిలోమీటర్ల దూరం వచ్చి నారాయణపేట జిల్లా తంగిడిగి వద్ద కృష్ణానదిలో సంగమం అవుతుంది. అయితే ప్రస్తుతం 176 చిన్న గేట్ల స్థానంలో 44 భారీ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు చిన్నగేట్లకు ఒక పెద్ద గేటు చొప్పున వెడల్పును, ఎత్తును పెంచి పాత దానికి ఆనుకునే దిగువన కొత్తగా బ్యారేజీని నిర్మిస్తున్నారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే రాష్ట్రానికి రావాల్సిన నీరు పూర్తిగా ఆగిపోతుంది. ఈ నీటిని దగ్గరలో ఉన్న పారిశ్రామికవాడకు ఎత్తిపోతల ద్వారా అందించాలని కర్నాటక ప్రభుత్వం చూస్తోందని స్థానికంగా ప్రచారం సాగుతోంది. అలాగే స్థానికంగా ఉన్న ఆయకట్టును పెంచుకోవాలని ప్రణాళికలు రూపొందించినట్లు అక్కడి రైతులు అంటున్నారు.
భీమా నది నారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలం తంగిడిగి వద్ద కృష్ణాలో కలిసి అక్కడి నుంచి జూరాల జలాశాయానికి వెళ్తాయి. కర్నాటకలో భారీ వర్షాలు పడినా, వరదలు వచ్చినా కృష్ణానది నీళ్లు భీమా నది నీళ్లతో కలిసే జూరాలకు వస్తుంది. ప్రస్తుతం భీమా నదిపై పాత స్థానంలో కొత్తగా నిర్మిస్తున్న బ్యారేజీ ఉపయోగంలోకి వస్తే భీమా నది నీళ్లు కృష్ణానదిలో కలువని పరిస్థితి ఉంటుంది. దీంతో కేవలం కృష్ణా నది ద్వారానే వచ్చే నీళ్లే జూరాలకు వస్తాయి. దీంతో జూరాల జలాశయానికి వచ్చే వరదనీటిపై దీని ప్రభావం ఉంటుంది. భీమాపై కొత్త బ్రిడ్జి నిర్మించాలన్న, ఎత్తు పెంచాలన్న సీడబ్ల్యూసీ అనుమతులు తప్పనిసరి. బ్యారేజీ ఎత్తు పెంచడంపై సాగునీటి పారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పూర్తి వివరాలు తెలుసుకుంటానని వెల్లడించారు.
ఇవీ చూడండి: