భారీ వర్షాలకు కాలువలు, చెరువు తూములకు గండ్లు

author img

By

Published : Jul 16, 2021, 8:43 PM IST

Drains for heavy rains

నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలకు పలు చోట్ల చెరువులు, కాల్వలకు గండి పడింది. ఫలితంగా రైతులు, స్థానికులు అవస్థలు పడ్డారు. మరికల్​లో తూము, ఉందేకోడ్​లో ఓ కాలువకు గండి పడింది.

నారాయణపేట జిల్లా మరికల్ గ్రామంలోని చెరువు గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని కొత్తగా నిర్మించిన తూముకు గండి పడింది. కట్ట పొడవునా చిన్న పాటి వర్షాలకు మట్టి కొట్టుకుపోయి గండ్లు ఏర్పడగా... రాత్రి కురిసిన భారీ వర్షానికి తూముకే గండి పడి ప్రమాదకరంగా మారింది. ఫలితంగా ప్రధాన రహదారిపై నీరు ప్రవహించి గంటకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహం మరికల్​ గ్రామంలోని కుర్వగెరి ప్రాంతంలోని ఇళ్ల మధ్యకు చేరి అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా రెండు ఇలానే వర్షాలు కురిస్తే చెరువు కట్టే తెగిపోయే ప్రమాదముందని.. గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం.. మరికల్​ తహసీల్దార్​ శ్రీధర్​, గ్రామ సర్పంచ్​ గోవర్ధన్​, ఇతర సిబ్బంది.. తూముకు గండిపడిన ప్రాంతానికి వెళ్లారు. జేసీబీతో మరమ్మతులు చేయించారు.

నర్వ మండలం ఉందేకోడ్ గ్రామ సమీపంలోని కాలువకు సంగంబండ రిజర్వాయర్ నుంచి గత కొన్ని రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు.. శుక్రవారం తెల్లవారుజామున గండిపడింది. ఆ నీరంతా పంట పొలాల్లోకి వెళ్లడంపై రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కవగా ఉంటోందని.. అధికారులు వెంటనే స్పందించి కాలువకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీచూడండి: ముంచెత్తిన వరద- 110 మంది బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.