బీఆర్​ఎస్​ కాకపోతే.. అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టుకోండి: బండి సంజయ్​

author img

By

Published : Apr 28, 2022, 10:54 AM IST

Updated : Apr 28, 2022, 11:57 AM IST

కేంద్రాన్ని, భాజపాను విమర్శించడం కోసమే తెరాస ప్లీనరీ: బండి సంజయ్​

Bandi Sanjay on TRS Plenary: కేంద్రాన్ని తిట్టడానికి, భాజపాను విమర్శించడానికే తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించిందని, ప్లీనరీ తీర్మానాల వల్ల దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెరాస పాలనలో ఆ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందో, ఏం చేయబోతుందో చెప్పుకోలేక పోయిందని అభిప్రాయపడ్డారు. కేసీయార్ మోడీ సహా భాజపాపై చేసిన విమర్శలపై సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రజలకే ఏమీ చేయలేని ముఖ్యమంత్రి దేశానికి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కాకపోతే.. అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తెరాస పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

Bandi Sanjay on TRS Plenary: కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి, భాజపాను విమర్శించడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించిందని రాష్ట్ర భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 8ఏళ్ల పాలనలో తెరాస ఏం చేసిందో, భవిష్యత్తులో ఏం చేయబోతుందో చెప్పకుండా భాజపా లక్ష్యంగానే ప్లీనరీ సమావేశాలు నడిచాయని అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూరులో పాదయాత్ర శిబిరంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏం చేసిందో చెప్పుకోలేని పరిస్థితికి తెరాస చేరుకుందని, రాష్ట్రంలో తెరాస పతనం ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. రెండోదశ ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తెరాసకు భాజపా భయం పట్టుకుందన్నారు. తాను సంధించిన 21 ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమే ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ప్లీనరీ తీర్మానాలు చూసి తెరాస నేతలే నవ్వుకుంటున్నారని, ఆ తీర్మానాల వల్ల రాష్ట్రానికి, దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు.

చెప్పులేసిన వాళ్లలో కేసీఆర్ లేరా? :మోదీ పాలనలో దేశఆర్ధికవ్యవస్థపై విమర్శలు చేసిన కేసీయార్ తెలంగాణ ఆర్ధిక వ్యవస్థను అప్పులపాలు చేసింది కేసీయార్ కాదా అని ప్రశ్నించారు. మోడీ విధానాల్ని ఇతర దేశాల అధినేతలు ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. తెరాసకు తెలంగాణ వీఆర్ఎస్ ఇచ్చిందని, బీఆర్ఎస్ కాకపోతే,, అంతర్జాతీయ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణకే కేసీఆర్​ చేసిందేమీ లేదని, దేశానికి ఏం చేస్తారన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ, సహారా కుంభకోణాలు వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్​పై అభిమానం ఒలకబోసిన ముఖ్యమంత్రి ..ఆయనపై చెప్పులేసిన వాళ్లలో కేసీఆర్ లేరా చెప్పాలన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని నమ్మించడానికే తప్ప ఎన్టీఆర్​పై ప్రేమతో కాదన్నారు. పార్టీ ఆస్తులు వెయ్యి కోట్లని ప్రకటించిన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ ఆస్తులు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

ఎంఐఎం పార్టీ క్యాన్సర్ లాంటిది: భాజపా మతతత్వ పార్టీ అన్న కేసీఆర్ విమర్శలపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. దేశానికే ఎంఐఎం పార్టీ క్యాన్సర్ లాంటిదని, అలాంటి క్యాన్సర్ గొంతులో వేసుకున్నది ముఖ్యమంత్రేనని ఎదురుదాడికి దిగారు. ఎంఐఎం మతపార్టీ కాదా అని ప్రశ్నించారు. అవకాశమిస్తే కేసీఆర్ ముస్లింలకు 20శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్- తెరాస ఒకటేనన్న సంజయ్.. కాదని చెప్పినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. భాజపాను ఒంటరిగా ఎదుర్కోలేక భాజపాయేతర పక్షాలు ఒక్కటవుతున్నాయని, ఎన్ని కూటములు ఏర్పడినా..తెలంగాణలో భాజపాదే అధికారమని స్పష్టం చేశారు.

ఎంత మంది మహిళలకు పదవులిచ్చారు?: మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి పోయిన మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకు పదవులిచ్చారో చెప్పాలన్నారు. మహిళా గవర్నర్​కు రాష్ట్రంలో కనీస గౌరవం దక్కడం లేదన్నారు. తెరాస పాలనలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, రజాకార్ల సమయంలోని ఆఘాయిత్యాలు తెరాస పాలనలో చూస్తున్నామన్నారు. కేంద్రంలో 27 మంది బీసీలకు మోదీ మంత్రి పదవులిచ్చారని, ప్రధాని మోదీ, తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బీసీలని తెరాస పాలనలో బీసీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కాయో చెప్పాలన్నారు.

కేంద్రాన్ని తప్పుపట్టడమేంటి?: ఖరీఫ్ సీజన్​లో 60వేల కోట్ల ఎరువులపై రాయితీ ఇచ్చి తక్కువ ధరకు రైతులకు ఎరువులు ఇస్తున్న ప్రభుత్వం భాజపా ప్రభుత్వమని చెప్పారు. పెట్రోల్, డీజీల్ ధరపై వ్యాట్ తగ్గించకుండా కేంద్రాన్ని తప్పుపట్టడమేంటన్నారు. పాలమూరులో వలసలు లేవన్న కేసీఆర్ అక్కడికి రావాలని, నారాయణపేట నుంచి ముంబయికి వెళ్లే బస్సు ఎక్కిస్తానన్నారు. ధాన్యం కొనుగోలు చేస్తున్నది కేంద్రం అయితే కేసీఆర్​కు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేయడమేంటని ఎద్దేవా చేశారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి: కేంద్ర పంచాయతీ రాజ్ ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో 20కి 19 తెలంగాణవే ఉన్నాయని గొప్పులు పోతున్న మంత్రులు.. ఆ గ్రామాలకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆ గ్రామాలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. తక్షణం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

"ప్లీనరీల్లో హామీలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తారు. తెరాస ప్లీనరీలో మాత్రం కేంద్రం, భాజపానే లక్ష్యంగా చేసుకున్నారు. ప్లీనరీలో భాజపా నేతలను అసభ్య పదజాలంతో దూషించారు. ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెరాస నేతలు గందరగోళం చేశారు. రూ.4 లక్షల కోట్ల అప్పులున్న తెలంగాణ ధనిక రాష్ట్రమా?. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్‌ కుటుంబం సంపాదించుకుంది. సీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు రాలేదా?. రైతు ఆదాయం రెట్టింపు చేసేలా కేంద్రం చర్యలుంటే విమర్శిస్తారా?." -బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

'కేసీఆర్ "అంతర్జాతీయ రాష్ట్ర సమితి" గురించి కూడా మాట్లాడతారు'

ఇవీ చదవండి:

Last Updated :Apr 28, 2022, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.