'ఐదేళ్లు కరవు వచ్చినా హైదరాబాద్కు తాగునీటి కొరత ఉండదు'
Updated on: May 14, 2022, 12:36 PM IST

'ఐదేళ్లు కరవు వచ్చినా హైదరాబాద్కు తాగునీటి కొరత ఉండదు'
Updated on: May 14, 2022, 12:36 PM IST
KTR laid Foundation stone for Sunkishala Project: ఐదేళ్లు కరవు వచ్చినా... హైదరాబాద్లో తాగునీటికి ఇబ్బంది ఉండదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్టెక్ వెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరం ఎంత విస్తరించినా రాబోయే 50 ఏళ్లకు నీటికొరత రాకుండా ఉపయోగపడుతుందన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ 159 కిలోమీటర్లు రింగ్ మెయిన్ వేయాలనుకుంటున్నామన్న కేటీఆర్.. కృష్ణా, గోదావరి నీరు రింగ్ మెయిన్లో పడితే తాగునీటికి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. 2072 వరకు ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులు చేపట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు..
KTR laid Foundation stone for Sunkishala Project: దేశంలో హైదరాబాద్ మహానగరం వేగంగా పెరుగుతోందని.. దిల్లీ తర్వాత అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఉంటుందని ఐటీ,పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భారత దేశానికి హైదరాబాద్ నగరం ఒక అతిపెద్ద ఆస్తిగా మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ అవసరాలన్నీ తీర్చుతున్నారని తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద సుంకిశాల ఇంటెక్వెల్ ప్రాజెక్టుకు కేటీఆర్.. మంత్రులు జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి భూమి పూజ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి 37 టీఎంసీల నీరు అవసరమని కేటీఆర్ అన్నారు. 2072 నాటికి దాదాపు 70.97 టీఎంసీల నీరు అవసరమవుతుందని ఒక అంచనా ఉందని తెలిపారు. కృష్ణా నీటిని అదనంగా తరలించేలా రూ.1459 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ ఫేజ్ 4,5 కి కూడా ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కొండ పోచమ్మ నుంచి కూడా ఒక లైన్ హైదరాబాద్కు వేస్తున్నామని.. వచ్చే ఏడాది వేసవి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
'కోట్ల మందిని దృష్టిలో పెట్టుకుని సుంకిశాల నిర్మాణం చేపట్టాం. రూ.1,450 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టును చేపట్టాం. కాళేశ్వరం నిర్మాణం దేశానికే గర్వకారణం. వేగంగా నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుంది. హైదరాబాద్ ప్రజలకు 65 టీఎంసీల నీటిని గోదావరిలో కానుకగా అందించారు. ఐదేళ్ల పాటు కరవు వచ్చినా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం. హైదరాబాద్కు తాగునీటి విషయంలో సీఎం కేసీఆర్ విజన్ పెద్దది. ఓఆర్ఆర్ చూట్టూ 159 కిలోమీటర్లు రింగ్ మెయిన్ వేయాలనుకుంటున్నాం. కృష్ణా, గోదావరి నీరు రింగ్ మెయిన్లో పడితే తాగునీటికి ఇబ్బంది ఉండదు. 2072 వరకు ఇబ్బంది లేకుండా ప్రాజెక్టు చేపట్టాం.' -కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ఓఆర్ఆర్ కాదు ఆర్ఆర్ఆర్ వచ్చినా అక్కడి వరకు నీళ్లు ఇచ్చేలా సుంకిశాల ప్రాజెక్టు ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ వాసులు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని తెలిపారు. నగరం ఎంత విస్తరించినా రాబోయే 50 ఏళ్లకు నీటి కొరత రాకుండా సుంకిశాల ప్రాజెక్టు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అంతకు ముందుగా ఇంటెక్వెల్ ప్రాజెక్టు పనులను మంత్రులు పరిశీలించారు.
ఇవీ చదవండి: అమిత్షా జీ.. తెలంగాణకు ఏమిచ్చారో చెబుతారా?: ఎమ్మెల్సీ కవిత
కొవిడ్తో ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి.. తలపట్టుకుంటున్న 'కిమ్'!
