HEAVY RAIN EFFECT: భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు.. పలు ప్రాంతాల్లో రాకపోకలు బంద్​

author img

By

Published : Sep 4, 2021, 12:20 AM IST

HEAVY RAIN EFFECT: భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు.. పలు ప్రాంతాల్లో రాకపోకలు బంద్​

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ధాటికి.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉద్ధృతికి.. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లాలో అలుగు వద్ద ఆడుకుంటూ ఓ చిన్నారి మృత్యువాత పడింది.

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఆరు వాగులకు భారీ వరద వచ్చి చేరుతోంది. ఫలితంగా ఆయా వాగులు.. రహదారులపైకి ఉప్పొంగి వస్తున్నాయి. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మునుగోడు సమీపంలోని మర్రి వాగు ఉద్ధృతి వల్ల... మునుగోడు-చండూరు పట్టణాల మధ్య రవాణా లేకుండా పోయింది. చండూరు మండలంలోని చండూరు వాగుకు వచ్చిన వరదతో... మర్రి వాగు మాదిరిగానే మునుగోడు-చండూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. చండూరు పురపాలిక మీదుగా వెళ్తున్న అంగడిపేట వాగుకు... వరద అనూహ్యంగా పెరిగింది. రహదారిపై నుంచే వరద పోటెత్తుతుండటంతో... మాల్-మర్రిగూడతోపాటు హైదరాబాద్ వెళ్లే వీలు లేకుండా పోయింది. శిర్దేపల్లి వాగు ధాటికి... శిర్దేపల్లి వాసులు కాలు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇక అదే మండలం గొల్లగూడెం-బంగారిగడ్డ దారి తెగిపోవడంతో... బంగారిగడ్డకు సంబంధాలు నిలిచిపోయాయి.

భీకరంగా వాగు ప్రవాహం..

కొండాపురం వద్ద నీటి ఉద్ధృతి వల్ల... కొండాపురం-పుల్లెంలకు రాకపోకలు స్తంభించాయి. దీంతో గట్టుప్పల్ నుంచి మండల కేంద్రానికి రావడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నాంపల్లి మండలం రాందాస్ తండా వద్ద శేషిలేటి వాగు భీకరంగా ప్రవహిస్తోంది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... అదుపు తప్పి వాగులో పడిపోయారు. చామలపల్లి నుంచి నర్సింహులగూడెం వెళ్తున్న సమయంలో ఘటన చోటుచేసుకోగా... బాధితుల్ని స్థానికులు తాళ్లతో రక్షించి బయటకు తీసుకువచ్చారు. అదే శేషిలేటి వాగు... గుర్రంపోడు మండల కేంద్రంలోనూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద రావడంతో ముత్యాలమ్మ గుడి సగం వరకు నీళ్లు చేరాయి. గుర్రంపోడు-కొతలాపురం-నడ్డివారిగూడెం దారిలో... కల్వర్టు తెగిపోయింది. చాలా గ్రామాల్లో చెరువులు నిండుగా మారడంతోపాటు అలుగు పోస్తున్నాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో... మునుగోడు నియోజకవర్గంలో పత్తి చేలల్లో నీరు నిలిచింది. చాలా చోట్ల పంట పనికిరాకుండా పోయే స్థితికి చేరుకుంది.

వివిధ కాలనీలు జలమయం..

నాంపల్లి మండలం లక్ష్మణాపురం వాగుకు సైతం భారీగా వరద వచ్చి చేరుతోంది. గతంలో ఈ వాగు నీరు... దిగువనున్న చెరువులో చేరేది. కానీ ఆ చెరువు కిష్టరాయిన్ పల్లి జలాశయంలో కలవడంతో... ఆ ప్రాజెక్టులోకి వరద వస్తోంది. అక్కడ తాకిడి ఎక్కువైతే తమ గ్రామం ముంపునకు గురవుతుందని లక్ష్మణాపురం వాసులు ఆందోళనతో ఉన్నారు. స్పందించిన అధికారులు... వాగు నీటి వల్ల గ్రామానికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మర్రిగూడ మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో... మర్రిగూడ బస్టాండ్​తోపాటు వివిధ కాలనీలు జలమయమయ్యాయి.

భువనగిరి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వర్షం జోరుగా కురిసింది. వలిగొండ మండలంలోని సంగెం-బొల్లేపల్లి గ్రామాల మధ్య... భీమలింగం కాల్వతో పాటు లోలెవెల్ వంతెన మీదుగా మూసీ ప్రవహిస్తుండటంతో... సంగెం-బొల్లేపల్లి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సూర్యాపేట జిల్లాలో మునగాల మండలంలో గత ఐదురోజులుగా కురుస్తున్న వర్షానికి గణపవరం ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. అర కిలోమీటరు మేర కోతకు గురైంది. ఫలితంగా ఈ రహదారి గుండా వెళ్లే 20 గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గణపవరం ఊరి చెరువు మత్తడి పోవడం వల్ల రహదారి కొట్టుకుపోయిందని.. స్థానికులు చెబుతున్నారు. ఈ రోడ్డుపై వంతెన నిర్మించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలుగు వద్ద ఆడుకుంటూ చిన్నారి మృతి..

బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్తున్న తల్లితో సరదాగా వెళ్లిన చిన్నారికి అదే చివరి ఆట అయింది. నీళ్లలో ఆడుకుంటూ ప్రాణాలు విడిచింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్​(ఎస్) మండలం పాతర్ల పహాడ్​లో ఈ విషాదం చోటుచేసుకొంది. సూర రమేష్, మనీష దంపతుల చిన్న కుమార్తె.. గ్రామ సమీంలోని శంభోని చెరువు అలుగు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్తున్న తల్లితో వెళ్లింది. ఆమె బట్టలు ఉతుకుతుండగా.. అమ్మా.. నేను ఆడుకుంటా అంటూ చిన్నారి అలుగు వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు జారిపడి.. పక్కనే ఏర్పాటుచేసిన సిమెంట్​ గూనల్లో చిక్కింది. గుర్తించిన తల్లి వెంటనే కేకలు వేయడంతో స్థానికులు వచ్చి చిన్నారని బయటకు తీశారు. కాని అప్పటికే అరగంట గడవడం వల్ల చిన్నారి మృతిచెందింది. చిన్నారి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని.. 'శంభోని చెరువుకు వచ్చి శంకరుడి దగ్గరకు వెళ్లావా బిడ్డా'’ అంటూ తల్లిదండ్రులు విలపించిన తీరును చూసి స్థానికులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు.

జలపాతంలో చిక్కుకున్న పర్యటకులు..

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో గల జలపాతంలో పర్యాటకులు చిక్కుకున్నారు. ఎగువ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా వరద రావడంతో సుమారు 15 మంది జలపాతం అవతలి వైపున ఉండిపోయారు. సాయంకాలం కావడం, అటవీ ప్రాంతంలో ఉండిపోవడంతో భయాందోళనకు గురయ్యారు. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. జలపాతంలో చిక్కుకున్న వీడియోను సోషల్ మీడియాలో పర్యాటకులు పోస్ట్​ చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై స్థానికులకు సమాచారం అందించారు. వెంటనే సమీప గ్రామంలోని స్థానికుల సహాయంతో వారిని కాపాడారు. బసర్ గ్రామానికి చెందిన కొందరు.. వాస్తాపూర్ జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు.

నీటిలో బైక్​ సహా కొట్టుకుపోయిన వ్యక్తి..

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో నర్సాపూర్​కు చెందిన ఓ వ్యక్తి.. పనుల నిమిత్తం ఇంద్రవెల్లి మండలానికి వెళ్లాడు. ఎగువన కురిసిన వర్షానికి.. సాకెర సమీపంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎలాగైనా ఇంటికి చేరుకోవాలని తపనతో తన ద్విచక్ర వాహనంతో వాగు దాటే ప్రయత్నం చేశాడు. వాగు మధ్యకు వచ్చిన సమయంలో ద్విచక్రవాహనం సహా అతనూ నీటిలో పడిపోయాడు. పక్కనే ఉన్న స్థానికులు వెంటనే తాడు సహాయంతో రక్షించారు.

ఎట్టకేలకు బస్సు బయటకు..

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట శివారు మానేరు వాగులో గత నెల 30న ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అందులోని 23 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో సమీపంలోని రైతులు వారిని కాపాడారు. నాడు ప్రవాహంలో చిక్కుకున్న బస్సును జేసీబీ సాయంతో వెలికి తీయడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ క్రమంలో వరద ఉద్ధృతి పెరగడంతో.. బస్సు కొట్టుకుపోయింది. రాళ్ల మధ్య చిక్కుకున్న బస్సును మానేరు వాగులో నీటి ఉద్ధతి తగ్గిన తర్వాత వెలికి తీసేందుకు అధికారులు భారీ క్రేన్​ను వినియోగించి... బయటకు తీశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా వాసులకు ఈ వర్షాలు కొత్త సమస్యలు తెచ్చి పెట్టాయి. సేవాలాల్ తండా వాసుల పొలాలు.. నక్కవాగు అవతలి వైపు.. తెర్లమద్ది ప్రాంతంలో ఉన్నాయి. అయితే పొలాలకు వెళ్లాలంటే నక్కవాగు దాటి వెళ్లాల్సి ఉంటుంది. వర్షాకాలంలో వాగు దాటాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. వాగుపై రెండేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టినా.. నిధుల లేమి కారణంగా ఏడాదిగా పనులు నిలిచి పోయాయి. ఇప్పుడు ఆ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో దాటలేని పరిస్థితి నెలకొంది. దీనితో ఆ పిల్లర్లపై తాటి చెట్టు వేసి దానిపై నుంచి నడుస్తున్నారు. తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని తండావాసులు కోరుతున్నారు.

అసంపూర్తి పనులతో..

మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపల్ పరిధి ఉమా మహేశ్వర కాలనీలోకి వరద ఒక్కసారిగా ముంచుకొచ్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగువ నుంచి వరద నీరు ఫాక్స్​సాగర్​ చెరువులోకి కాకుండా.. దిగువునకు వెళ్లేందుకు పైప్​ లైన్​ ఏర్పాటుచేశారు. ఆ పనులు పూర్తికాకపోవడంతో ఆ నీరు ఫాక్స్ సాగర్​ చెరువులోకి కాకుండా... కాలనీలోకి వచ్చింది. సుమారు గంటపాటు వరద నీరు రావడంతో రెండు గల్లీలు నీట మునిగిపోయాయి. ఎక్కువ నీరురావడంతో పలువురు ఇళ్లలో సామాన్లను బయటకు తెచ్చుకుంటున్నారు. వరద నీటిని తోడేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

నాలుగు నెలలు వరదలోనే..

వర్షం లేదు. ఆకాశంలో కారు మబ్బులు కానరావు. అయిన ఊరంతా వరద ప్రవాహం పోటెత్తుతుంది. భారీ వర్షాలకు ఇంట్లోకి నీరు వస్తేనే ప్రజలు నానా పాట్లు పడతారు. అలాంటిది ఏకంగా నాలుగు నెలలు నీళ్లలోనే జీవిస్తున్నారు.. దంతాన్​పల్లి గ్రామస్థులు. ఏటా వర్షాకాలం అంటే జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నాలుగు నెలలు దంతాన్​పల్లి గ్రామంలో ప్రతి ఇంటి అడుగు భాగం నుంచి నీరు ఉటలా ఉబికి వస్తుంది. గ్రామస్థులు ఎంత తోడినా.. అదేరీతిలో నీరు ఉబికి వస్తుంది. ప్రతి ఏటా నాలుగు నెలలు నీళ్లతోనే సహవాసం చేస్తున్నామంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వర్ష సూచన..

నైరుతి రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అతి భారీ వర్షాలు.. ఒకటి, రెండు చోట్ల నమోదైనట్లు వెల్లడించింది. ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎల్లుండి భారీ వర్షాలు... ఒకటి, రెండు చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఉపరితల ఆవర్తనం.. ఒకటి తూర్పు-మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఏర్పడినట్లు చెప్పారు. ఈనెల 6 నుంచి 12 తేదీల మధ్యలో ఉత్తర దానిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఇదీచూడండి: modi - kcr meet: ప్రధాని మోదీకి పది లేఖలు అందజేసిన సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.