Praveen kumar: తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతోంది: ఆర్​ఎస్ ప్రవీణ్​ కుమార్

author img

By

Published : Aug 9, 2021, 5:28 AM IST

Ex ips rs praveen kumar comments

తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతోందని నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. రిజర్వేషన్లు మా హక్కు అని భిక్ష కాదన్నారు. వెయ్యి గురుకులాలు పెట్టి.. విద్యావ్యవస్థ మారిపోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో 4 లక్షల మందే గురుకులాల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మిగతా 30 లక్షల మంది పేద బిడ్డలకు విద్య బంద్‌ చేస్తే బంగారు తెలంగాణ ఎలా అవుతుంది?

తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతోందని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. బహుజనులంతా పాలకులవుతారని, ఏనుగెక్కి ప్రగతి భవన్‌కు వెళ్లాలని, ఎర్రకోటపైనా నీలిజెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ప్రజలు కారు కింద పడతారా.. ఏనుగు ఎక్కి వెళ్తారా తేల్చుకోవాలన్నారు. రిజర్వేషన్లు మన హక్కు అని, పాలకులు పెట్టే భిక్ష కాదన్నారు. ఆదివారం నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్పసభలో ప్రవీణ్‌కుమార్‌ బహుజన్‌ సమాజ్‌ పార్టీలో చేరారు. బీఎస్పీ జాతీయ కో ఆర్డినేటర్‌ రాంజీ గౌతమ్‌ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌కుమార్‌ సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.

అడుగడుగునా అడ్డంకులు
నల్లగొండ ఎంజీ కళాశాల మైదానంలో కాన్షీరాం కాలుమోపిన ఈ ప్రాంతానికి రావడానికి బిడ్డలు ఎన్నో కష్టాలు పడ్డారు. పోలీసులు అడ్డుకున్నా వారు ఆగలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజునే నాపై పోలీస్‌స్టేషన్లో కేసుపెట్టారు. మేం ఒంటరిగా లేం. లక్షలు, కోట్ల మంది బిడ్డ ప్రవీణ్‌. నల్గొండలో ప్రజలు కదనకుతూహలంతో కవాతు నిర్వహించారు. ఇదే ఉత్సాహంతో ప్రగతి భవన్‌కు పోదాం.

ఎందుకు బయటకు వచ్చానంటే.
బిడ్డా ఉద్యోగం ఎందుకు వదిలేశావు అని మా అమ్మ అడిగింది. లక్షలాది మంది బిడ్డల బతుకు మార్చాలంటే.. త్యాగం చేయాల్సిన అవసరముందని చెప్పాను. 17 ఏళ్ల పోలీసు జీవితాన్ని వదులుకుని 2012లో గురుకులాల సొసైటీకి వచ్చాను. తొమ్మిదేళ్లలో ఎన్నో గొప్ప పనులు చేశా. ఒక గిరిజన బిడ్డ ఎవరెస్టు ఎక్కి, అక్కడ అంబేడ్కర్‌ బొమ్మను పెట్టింది. గురుకులాల్లోని పిల్లలు ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు. వీళ్లకేం చేతనైతది అన్న వారే ముక్కుమీద వేలు వేసుకునేలా చేశాను. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదివేలా ప్రోత్సహించా. కరోనా సమయంలో పాఠశాలలు మూసేశారు. ఒక ఇంజినీరింగ్‌ కళాశాలను మాట్లాడుకుని అక్కడే ఉండి పిల్లలు చదువుకుంటుంటే సమాచారం ఎవరిచ్చారో తెలియదు కానీ... జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) అధికారులు వచ్చి పిల్లలు రాత్రికి రాత్రి ఇంటికి వెళ్లేలా చేశారు. నేను బాలల హక్కులు హరించేస్తున్నానంట. ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంటు సాక్షిగా అసత్య ఆరోపణలు చేశారు. మా బిడ్డలు చదువుకుంటే మీ కళ్లకు మంట. మేం జీవితాంతం గొర్లు, బర్లు కాయాలా? కల్లుగీత కార్మికులుగా బతకాలా? ఎప్పుడు ఇంజినీర్లు, వ్యోమగాములయ్యేది?

రూ. వెయ్యి కోట్లు ఎవరి సొత్తు?
అయ్యా సీఎం.. మీరు ఖర్చు పెడతానన్న రూ.1000 కోట్లు ఎవరివి? బడుగు జీవుల శ్రమ కాదా? వాటిని ఎందుకు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు? మా మీద ప్రేమ ఉంటే.. మీ ఆస్తులు అమ్మి పెట్టండి. మా బతుకులు బాగుపడాలంటే అత్యున్నత ప్రమాణాలున్న విద్య, వైద్యం, ఉపాధి కావాలి. ప్రభుత్వ పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాల్ని పట్టించుకునే నాథుడు లేరు. నియామకాల్లేవు. అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు తీసుకువచ్చి అనురాగ్‌, మల్లారెడ్డి యూనివర్సిటీలు పెట్టారు. బడుగు, బలహీన వర్గాలు, పేదలు, రెక్కాడితే డొక్కాడని పిల్లలు చదివే యూనివర్సిటీల్లో నియామకాలు ఎందుకు చేయడం లేదు?

వార్తలు తప్ప.. ఉద్యోగ ప్రకటనల్లేవు
రాష్ట్రంలో 50 వేల పోస్టులు ఉన్నాయంటున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్యోగాలంటూ వార్తలొస్తున్నాయి.. కానీ ఉద్యోగాల ప్రకటనలు రావడం లేదు. అధికారంలోకి వచ్చినప్పుడు ఉస్మానియా లాంటి 5-10 ఆసుపత్రులు వస్తాయన్నారు. కరోనా సమయంలో అవి ఎక్కడికి పోయాయి? ఈ మాటల గారడీతో ఆరేళ్లుగా ప్రజలు మోసపోతున్నారు. ఆ పరిస్థితికి ఈ సభ నుంచే చరమగీతం పాడాలి. హైటెక్‌సిటీ, టీహబ్‌, పారిశ్రామిక పార్కుల్లో ఎంత మంది బహుజన బిడ్డలున్నారు? సంపద కేవలం 5 శాతం మంది వద్ద ఉంటే.. 95 శాతం మంది పేదరికంలో ఉన్నారు. ఈ దేశంలో 46 మందికి భారతరత్న ఇస్తే ఒక్కరే ఓబీసీ. ఎస్టీలు లేరు. ఎస్సీలు ఇద్దరే ఉన్నారు. దేశంలోని 119 బిలియనీర్లలో ఒక్క ఎస్సీ, ఎస్టీ లేరు. ఇద్దరు బీసీలు ఉన్నారు. 1980 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన న్యాయమూర్తుల్లేరు. బహుజన రాజ్యంలో అది జరగనీయం. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు రావాల్సిందే.

బహుజన రాజ్యం ఇలా ఉంటుంది...
బహుజన రాజ్యంలో అన్ని కులాలకు సమానమైన వాటా లభిస్తుంది. మండలానికి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వస్తుంది. చైనాతో క్రీడల్లో పతకాల కోసం పోటీపడే రోజులొస్తాయి. మైనార్టీల బిడ్డలు మిలినీయర్లు అవుతారు. దళితులు డాలర్లు సంపాదిస్తారు బంజారా బిడ్డలు బంగ్లాలో ఉంటారు. వడ్డెరన్న బిడ్డలు రాకెట్లు ప్రయోగిస్తారు. అల్లు అరవింద్‌, అర్జున్‌, నాగార్జున, మహేష్‌బాబులే కాదు.. మా బిడ్డలు కూడా ఆ రంగంలోకి వెళ్లేదాకా నిద్రపోరు. మన బిడ్డలు వాళ్లంతట వాళ్లే కంపెనీలు పెట్టి సంపద సృష్టించి ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. తండేపల్లి మండలంలో కల్లుగీత కార్మికులతో మాట్లాడాం. వారి కాళ్లు పూర్తిగా కాయలు కాసినై. నేను రెండు నిమిషాలు కూడా చెట్టుమీద నిలబడలేకపోయాను. రోజుకు రూ.400 కన్నా ఎక్కువ సంపాదించలేను బాంచన్‌ అని అన్నారు వారు. ఈ బాంచన్‌ అనే భాష ఎక్కడి నుంచి వచ్చింది? ఆధిపత్య వర్గాలు తాయిలాలతో మాయ చేస్తున్నారు. మీరంతా కాన్షీరాం, మాయావతి కావాలి. కుట్రలపై అందరినీ అప్రమత్తం చేయాలి. పవిత్రమైన ఓటును అమ్ముకోకూడదు. ప్రజలందరినీ మనతో తీసుకెళ్లాలి.

రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేందుకు పిట్టకథలు చెప్పేవారంతా ఏం చేస్తున్నారో తెలుసు. యాసలో మాట్లాడుతూ వాసాలు లెక్కపెడుతున్నారు. గత 70 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలను పాలించిన 11 మందిలో 10 మంది ఆధిపత్య కులాలకు చెందినవారే. మాకు పాలన చేతకాదనా? మీరే అపరమేధావులా? మీరే 60 వేల పుస్తకాలు చదువుతారా... మాకు చదువు రాదనుకుంటున్నారా? జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా ఇవ్వాలి. లేకుంటే గుంజుకుంటాం.

- మాజీ ఐపీఎస్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

2023లో తెలంగాణలో బహుజనరాజ్యం: రాంజీ

లహీనవర్గాలకు రాజ్యాధికారం లక్ష్యంతోనే తమ పార్టీ ఏర్పాటైందని బీఎస్పీ జాతీయ కో ఆర్డినేటర్‌ రాంజీ గౌతమ్‌ తెలిపారు. 2023లో తెలంగాణలో బహుజనరాజ్యం వస్తుందని చెప్పారు. అందుకోసం ఈ సభ నుంచే పోరాటం మొదలుపెడతామన్నారు. బీఎస్పీ లేకుండా బహుజనరాజ్యం సాధ్యం కాదని ప్రవీణ్‌కుమార్‌కు మాయావతి స్పష్టం చేశారని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ బీఎస్పీ అధ్యక్షులు మందా ప్రభాకర్‌, పరంజ్యోతి కూడా ప్రసంగించారు. నల్గొండ జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ.. ‘నీలి’కొండ

ల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభ ఉత్సాహంగా సాగింది. మధ్యాహ్నానికే నల్గొండ పట్టణమంతా నీలిమయంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌తో పాటూ తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు, స్వేరో కార్యకర్తలు, ప్రజలు సభకు హాజరయ్యారు. ఎన్‌జీ కళాశాల మైదానం పూర్తిగా నిండిపోయింది. సభా ప్రాంగణానికి ప్రవీణ్‌కుమార్‌ రాగానే, సభికులు ‘సీఎం... సీఎం’ అంటూ నినాదాలు చేయగా.. ‘దానికి చాలా టైం ఉంది, తప్పకుండా ప్రగతిభవన్‌కు పోదాం’ అని ఆయన బదులిచ్చారు. దాదాపు అరగంటకు పైగా ఆర్‌ఎస్‌పీ ప్రసంగించగా... సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారి వాహనాలను దాదాపు 3 కి.మీ. దూరంలోనే పార్కింగ్‌ చేయించడంతో అందరూ సభాప్రాంగణానికి కాలినడకనే చేరుకున్నారు. స్వేరో కార్యకర్తలు సభ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు.

ఇదీ చూడండి:

RS PRAVEEN KUMAR: 'బహుజన రాజ్యం చాలా దగ్గరగా ఉందనిపిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.