మునుగోడు ప్రజల తీర్పుపైనే రాష్ట్ర భవిష్యత్తు: భట్టి విక్రమార్క

author img

By

Published : Sep 18, 2022, 5:19 PM IST

Updated : Sep 18, 2022, 10:59 PM IST

భట్టి విక్రమార్క

కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస మునుగోడు ప్రజలను డబ్బుతో తమవైపు తిప్పుకోవాలని.. రూ.వందల కోట్లు తీసుకొచ్చి వారి ఆత్మగౌరవం పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. సిద్ధాంతాల భావజాలానికి మునుగోడు ప్రజలు కట్టుబడి ఉంటారే తప్ప డబ్బులకు అమ్ముడుపోరని తెలిపారు. ధన అహంకారాన్ని ప్రదర్శిస్తున్న తెరాస, భాజపా మెడలు వంచడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

మునుగోడు ప్రజల తీర్పుపైనే రాష్ట్ర భవిష్యత్తు: భట్టి విక్రమార్క

సామ్యవాద, లౌకికవాద భావజాలం కలిగిన ప్రజలను డబ్బుతో కొనుగోలు చేయాలనే భ్రమలో తెరాస, భాజపా ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సిద్ధాంతాల భావజాలానికి మునుగోడు ప్రజలు కట్టుబడి ఉంటారే తప్ప.. డబ్బులకు అమ్ముడుపోరని స్పష్టం చేశారు. నిజాం అహంకారానికి వ్యతిరేకంగా పోరాడి రజాకార్ల మెడలు వంచిన గడ్డ మునుగోడు అని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైన మునుగోడు ప్రజలకు ఎనలేని అభిమానం ఉందని భట్టి పేర్కొన్నారు. సామ్యవాద, లౌకికవాద భావజాలం కలిగిన మునుగోడు ప్రజలు వారికి ఉపయోగపడే పార్టీలనే ఇప్పటివరకు గెలిపించారని గుర్తు చేశారు. మునుగోడులో కాంగ్రెస్​ పార్టీ ఏర్పాటు చేసిన మండల కార్యకర్తల సమన్వయ సమావేశంలో భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస మునుగోడు ప్రజలను డబ్బుతో తమవైపు తిప్పుకోవాలని.. రూ.వందల కోట్లు తీసుకొచ్చి వారి ఆత్మగౌరవం పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. ధన అహంకారాన్ని ప్రదర్శిస్తున్న తెరాస, భాజపా మెడలు వంచడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని భాజపా సవాల్ చేస్తూ అడుగులు వేస్తూ అణగదొక్కుతుందని ఆరోపించారు.

అధికారానికి, డబ్బుకు అడ్డే లేదన్న అహంభావపూరిత వాతావరణంలో తెలంగాణపై భాజపా దాడి చేయడానికి వస్తున్నట్లు కనిపిస్తోందని భట్టి విమర్శించారు. తెలంగాణ ప్రజలను అణగదొక్కాలని చూసిన ప్రతి సందర్భంలో మట్టి మనుషులుగా ఎదిరించి ఎదురొడ్డి పోరాటం చేశారు తప్ప.. తలవంచుకున్న చరిత్ర ఈ పోరాటాల గడ్డకు లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో తెరాస పాలన ఇక చాలు అని ప్రజలు అంటున్నారు: రాష్ట్రంలో తెరాస పాలన ఇక చాలు అని ప్రజలు అంటున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దోపిడీ, అవినీతికి పాల్పడుతూ వనరులను ప్రజలకు ఇవ్వకపోగా.. తెచ్చుకున్న తెలంగాణను నవ్వుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజంలో తలెత్తుకొని బతకాలన్న ఆత్మగౌరవం తెరాస పాలనలో భంగపాటకు గురైందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిన తెరాస డబ్బు, మద్యం ప్రలోభాలతో మునుగోడును ఆక్రమణ చేయాలని చూస్తుందని మండిపడ్డారు.

పోరాటాల గడ్డకు మునుగోడు కేంద్ర బిందువు: మునుగోడు పోరాటాల గడ్డకు కేంద్ర బిందువని.. ఇక్కడి ప్రజలు ఇక తెరాస పాలన చాలు అని అంటున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మునుగోడు ప్రజల నిర్ణయాత్మకమైన తీర్పుపైనే ఆధారపడి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంగా మీ ఓటు ఉండాలని మునుగోడు ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలను అణగదొక్కాలని.. దోపిడీకి పాల్పడాలని చూస్తున్న భాజపా, తెరాసలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు దశా దిశ అని అభిప్రాయపడ్డారు.

పేదలతో మమేకమై ప్రతి ఇంటి మనిషిగా ప్రజల హృదయాల్లో చిరస్థానాన్ని సంపాదించుకున్న దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి మునుగోడు ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చిందని తెలిపారు. ఆడబిడ్డ స్రవంతిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించడానికి మునుగోడు ప్రజలు సిద్ధమై ఉన్నారని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు ఏ నోటుకు అమ్ముడుపోకుండా మునుగోడు ప్రజలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

"భాజపా, తెరాస ఈ మధ్యనే అధికారం చూస్తున్న పార్టీలు. ఈ మధ్యన పుట్టిన పార్టీలు వీళ్లు భ్రమలో ఉన్నారు. వందలకోట్లు తీసుకువచ్చి భావజాలం లేదు. సిద్ధాతం లేదు. డబ్బు. అధికారంతో ఏదైనా చేయవచ్చని చూస్తున్నారు. అహంకారంగా ఓటు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ పార్టీ లౌకికవాద, సామ్యవాద భావజాలంతో ఉన్నట్టువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రానికి , దేశానికి అవసరమని గుర్తించి ఓట్లు వేయించాలనే ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు." - భట్టి విక్రమార్క సీఎల్పీ నేత

ఇవీ చదవండి: నాపై కేసు పెట్టారు.. మరి మంత్రిపై ఎందుకు పెట్టడం లేదు​: వైఎస్​ షర్మిల

ఉచితాలపై తగ్గని ఆప్.. తటపటాయిస్తున్న భాజపా.. 2022 బాద్​షా ఎవరో?

Last Updated :Sep 18, 2022, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.