సర్పంచ్​ల తిప్పలు.. పేరు తేవాల్సిన అభివృద్ధి.. చావును తెచ్చే పరిస్థితి..

author img

By

Published : May 22, 2022, 4:43 AM IST

సర్పంచ్​ల తిప్పలు.. పేరు తేవాల్సిన అభివృద్ధి.. చావును తెచ్చే పరిస్థితి..

Sarpanch Problems: ప్రగతి పేరుతో ప్రభుత్వ లక్ష్యాలు. గడువులోగా పూర్తికాకుంటే అధికారుల హెచ్చరికలు. వెనుకడుగు వేస్తే ప్రజల ఒత్తిళ్లు. ఊరి ప్రథమ పౌరుడైనందుకు పరువు నిలుపుకునే ఆరాటం. ప్రజాప్రతినిధి అయినందుకు పదవి కాపాడుకునే పోరాటం. ప్రభుత్వం నిర్దేశించిన పనులు సొంత డబ్బులతో పూర్తిచేసినా కాలం గడుస్తున్నా బిల్లులు రాకపోవటంలేదు. తెచ్చిన అప్పులకు మించుతున్న వడ్డీలు... డబ్బులిచ్చిన వారి నుంచి పెరుగుతున్న వేధింపులు. వెరసి గ్రామాల్లో సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు.

సర్పంచ్​ల తిప్పలు.. పేరు తేవాల్సిన అభివృద్ధి.. చావును తెచ్చే పరిస్థితి..

Sarpanch Problems: ఊరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండేది సర్పంచ్‌. గ్రామ అభివృద్ధి జరగాలన్నా.. ప్రజల బాగోగులు చూడాలన్నా.. ఇంటిపెద్దలా బాధ్యతను భుజాన వేసుకుంటాడు. ఆర్థిక వనరులను సృష్టిస్తూ... ఆదాయాన్ని రాబడుతూ... పల్లెను సొంత కుటుంబంలా కాపాడుకునే ప్రథమ పౌరుడి పరిస్థితి.. ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. అప్పులు తెచ్చి మరీ పూర్తిచేసిన అభివృద్ధి పనులకు సంబంధించి... బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఓ సర్పంచ్‌ ఆత్మహత్యకు యత్నించిన ఘటన పంచాయతీలో పరిస్థితులను ప్రతిబింబిస్తోంది.

అప్పులు చేసి మరీ పనులు చేయిస్తే..: నాగర్​కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామసర్పంచ్ గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం శ్మశాన వాటిక, సీసీ రోడ్లు సహా పలు అభివృద్ధి పనులను సర్పంచ్‌ ఎల్లయ్య పూర్తి చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఈ పనులకు సంబంధించిన బిల్లులు మాత్రం ఇప్పటికీ రాలేదు. 2020 నుంచి 9 లక్షల వరకు ఖర్చు చేస్తే.. వడ్డీతో 11 లక్షలైందనీ అధికారులు మాత్రం బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని ఎల్లయ్య వాపోతున్నాడు.

"ఊరిలో స్మశాన వాటిక, రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనులు చేయించాం. వీటికి సంబంధించిన బిల్లులు రావట్లేదు. 11లక్షల అప్పు ఉంది. 9లక్షలు నాకు రావాల్సిన బిల్లులు ఉన్నాయి. 2020లో పనులు చేయించాను కానీ ఇంతవరకు బిల్లులు లేవు. ఊరిలో వడ్డీకి తీసుకొచ్చాను. వారు ఒత్తిడి చేస్తున్నారు. బిల్లులు ఇప్పుడు అప్పుడు వస్తాయంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. అందుకోసమే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాను." -ఎల్లయ్య, అవుసలికుంట గ్రామసర్పంచ్

సర్పంచ్‌ల ఆవేదన: ఒక ఎల్లయ్యే కాదు... ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చాలా మంది సర్పంచ్‌ల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. ప్రభుత్వ లక్ష్యం అమలు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. దీంతో పాటు అధికారుల ఒత్తిడితో ఆగమేఘాల మీద డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, సెగ్రిగేషన్ షెడ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేశారు. కొన్నిచోట్ల మిషన్ భగీరథ, భూగర్భ మురుగు కాల్వలను సైతం సర్పంచ్‌లు పూర్తి చేశారు. కానీ బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం వారిని అప్పుల ఊబిలోకి నెడుతోంది. జనరల్ ఫండ్, ఆర్థిక సంఘం నిధులను సైతం స్తంభింపజేశారని, పంచాయతీ ఖాతాల్లో నిధులున్నా వినియోగించుకోలేని దుస్థితి నెలకొందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బిల్లులు చెల్లించాలి: మరోవైపు వచ్చే నెలలో గ్రామగ్రామాన ఐదో విడత పల్లె ప్రగతి కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చేసిన పనులకే ఇప్పటికే బిల్లులు రాక సతమతమవుతుంటే.. మళ్లీ పల్లెప్రగతి పనులను ఎలా చేపట్టాలని సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.