Srisailam Project incident : శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర అగ్నిప్రమాద ఘటనకు ఏడాది

author img

By

Published : Aug 20, 2021, 9:21 AM IST

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర అగ్నిప్రమాద ఘటనకు ఏడాది పూర్తి

ప్రాణనష్టం, భారీగా ఆస్తినష్టంతో పాటు... జెన్ కో చరిత్రలోనే తీవ్ర విషాదాన్ని నింపిన శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర అగ్నిప్రమాద ఘటన(Srisailam Project incident)కు ఆగస్టు 20నాటికి ఏడాది అయింది. ప్లాంటులో బ్యాటరీలు మార్చుతుండగా జరిగిన విద్యుదాఘాతం... భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. 9 మంది ప్రాణాలను బలిగొంది. ప్రమాదం నుంచి తేరుకుని విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు... చాలాకాలం పడుతుందని, భారీగా ఖర్చవుతుందని అంతా అంచనా వేశారు. కానీ 45 రోజుల్లో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించిన జెన్ కో... దశలవారీగా యూనిట్లను వినియోగంలోకి తెచ్చింది. 4వ యూనిట్​కు మాత్రం ఇంకా మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర అగ్నిప్రమాద ఘటనకు ఏడాది పూర్తి

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలోని... శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి(Srisailam Project incident) ఏడాది పూర్తవుతోంది. 2020 ఆగస్టు 20న రాత్రి పదిన్నర గంటల సమయంలో జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు జెన్ కో అధికారులు, ఇద్దరు ప్రైవేటు కంపెనీ సిబ్బంది.. మృత్యువాత పడ్డారు. విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, టర్బైన్లు, ప్యానల్ బోర్డులు.. కేబుల్, వైరింగ్ అంతా కాలిపోయాయి.

బ్యాటరీలు మార్చుతుండగా..

విద్యుత్ కేంద్రంలో బ్యాటరీలు మార్చుతుండగా 4, 6యూనిట్లకు సంబంధించిన ప్యానెల్ బోర్డులో... విద్యుదాఘాతం(Srisailam Project incident) ఏర్పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగానే.. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పెద్దపెద్ద శబ్దాలు వినిపించాయి. ప్లాంటును రక్షించేందుకు సిబ్బంది ఆఖరి నిమిషం వరకూ శ్రమించారు. వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న 31మంది అధికారులు... 22 మంది సిబ్బంది అత్యవసర మార్గాల ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. ప్లాంటులోనే చిక్కుకుపోయిన 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జెన్కోలో అంతులేని విషాదాన్ని నింపింది.

భారీ కసరత్తు..

విషాదం(Srisailam Project incident) నుంచి తేరుకుని విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు... జెన్ కో అధికారులు భారీ కసరత్తే చేశారు. ప్రమాద తీవ్రతను బట్టి విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ కోసం ఏడాది, రెండేళ్లు పడుతుందని వంద కోట్లకు పైగా ఖర్చవుతుందనే అభిప్రాయాలు, అంచనాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. కానీ 45 రోజుల్లోనే.. ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. ముందుగా 1, 2 యూనిట్లు, దశలవారీగా 5, 6, 3 యూనిట్లను పునరుద్ధరించారు. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన 4వ యూనిట్ మాత్రం వినియోగంలోకి రాలేదు. మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటి వరకూ 8.9 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

పవర్​హౌజ్​లోకి ఫోన్లు అనుమతి..

మరోసారి ఇలాంటి ఘటనలు(Srisailam Project incident) పునరావృతం కాకుండా జెన్ కో రక్షణ చర్యలకు ఉపక్రమించింది. అత్యవసర మార్గాల ద్వారా తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా వేసింది. విద్యుత్తు కేంద్రం నుంచి సమాచారం బయటకు పంపించడానికి అవకాశం లేకపోవడంతోనే.. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం, భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. ఈ మేరకు సెల్ సిగ్నల్ అందేలా సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. చరవాణులను పవర్​ హౌజ్​లోకి తీసుకెళ్లేందుకు అనుమతించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు... అధికారులకు రక్షణపై ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పరిరక్షణ కోసం డీఈ స్థాయి అధికారితో పాటు... ఇద్దరు ఏఈలు, నలుగురు సహాయకులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు.. లోపలికి వెళ్లేందుకు బ్యాటరీలతో నడిచే వాహనాలను కొనుగోలు చేసేందుకు సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం అత్యవసరాల కోసం 15 ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధంగా ఉంచారు.

బాధిత కుటుంబాలకు సాయం..

ప్రమాద(Srisailam Project incident) సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఈఈ శ్రీనివాస్.. ఏఈలు సుందర్, మోహన్, ఉజ్మా ఫాతిమా, వెంకట్రావు, జూనియర్ ప్లాంటు అసిస్టెంట్లు రాంబాబు, కిరణ్​తోపాటు బ్యాటరీ కంపెనీ ఉద్యోగులు ఇద్దరు మృతి చెందారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి కోరుకున్న ప్రాంతంలో.... జెన్ కో కేంద్రాల్లో ఉద్యోగాలు కల్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.