Street Dogs Attack 12 Peoples In Mulugu : రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. మొన్న హైదరాబాద్లోని అంబర్పేటలో నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన మరవకముందే హనుమకొండ జిల్లాలో వీధి శునకాల దాడిలో 7 సంవత్సరాల చోటు అనే బాలుడు మృతి చెందాడు. తాజాగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ.. ఉదయాన్నే 12 మంది గ్రామస్థులపై దాడి చేశాయి.
Street Dogs Attack 12 Peoples In Chalwai : తెల్లవారుజామున 4 గంటలకు మహిళ ఇంటి వద్ద పడుకున్న సమయంలో ఒక్కసారిగా మీద పడి రెండు కుక్కలు దాడి చేశాయని బాధితురాలు తెలిపింది. అలాగే గ్రామాల్లోని రోడ్డుపై పోతున్న వారిపై కూడా శునకాలు విచక్షణరహింతగా దాడి చేశాయి. 12 మంది గాయపడిన బాధితులను ములుగు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు.
ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా.. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామంలోని వీధి శునకాలు.. గేదెలు, ఆవులు, పందులపై కూడా దాడి చేస్తున్నాయని ఈ విషయంపై గ్రామపంచాయతీ అధికారులకు ఎన్ని మార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మరోవైపు మే 19న హనుమకొండ జిల్లాలో వీధి కుక్కల దాడిలో 7 ఏళ్ల చోటు అనే బాలుడు మృతి చెందాడు. బాలుడు ఆడుకుంటున్న క్రమంలో రెండు కుక్కలు పిల్లాడిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో చోటుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు.. హుటాహుటిన 108 వాహనంలో పిల్లాడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బాలుడు(చోటు) మృతి చెందాడు. చోటు(బాలుడు) మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి కుటుంబం బతుకు దెరువు కోసం కాజీపేటకు వచ్చారు.
ఈ ఘటనతోనైనా అధికారులు మేల్కోవాలి..: ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే క్వార్టర్స్లో వీధి కుక్కలు ఉన్నాయని.. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గతంలో ఎన్ని సార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అంతకుముందు కూడా ఇదే ప్రదేశంలో ఓ బాలికపై వీధి శునకాలు దాడి చేశాయని.. అలాగే ఓ రైల్వే ఉద్యోగిపై కూడా ఈ వీధి శునకాలు దాడి చేశాయని స్థానికులు వాపోతున్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా కానీ, మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
ఇవీ చదవండి: